పార్టీ ప్రయోజనాలను, ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్‌కు తాకట్టు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పార్టీ ప్రయోజనాలను, ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్‌కు తాకట్టు

పార్టీ ప్రయోజనాలను, ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్‌కు తాకట్టు

Written By news on Tuesday, December 11, 2012 | 12/11/2012

పార్టీ ప్రయోజనాలను, ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్‌కు తాకట్టు పెట్టారు
 
పార్టీ అధ్యక్షుడిగా తెలుగుదేశం ప్రయోజనాలను, ప్రతిపక్ష నేతగా ప్రజల ఆకాంక్షను చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టారని మాజీ ఎంపీ, వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి విమర్శించారు. పార్టీ శ్రేణుల్లో, ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిన చంద్రబాబుకు తెలుగుదేశం అధ్యక్షుడిగా కొనసాగే అర్హత లేదని మండిపడ్డారు. సోమవారం కర్నూలులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కష్టకాలంలో టీడీపీకి అండగా ఉన్న వారికి పదవులు ఇవ్వకుండా, ధనవంతులను ఏరికోరి రాజ్యసభకు పంపించడం చంద్రబాబుకు ఆనవాయితీ అని, అందుకే ఈరోజు వారు బాబును ఖాతరు చేయడం లేదని ధ్వజమెత్తారు. 

‘‘కాంగ్రెస్‌తో కుమ్మక్కై ఎఫ్‌డీఐలపై ఓటింగ్ సమయంలో ఎంపీలు గైర్హాజరు కావాలని చెప్పింది చంద్రబాబే. అది బహిర్గతమై పార్టీలో, ప్రజల్లో వ్యతిరేకత రావడంతో వారిపై సొంత పార్టీ నేతలతో విమర్శలు చేయించారు. మళ్లీ ఇప్పుడు సుజనా చౌదరితో రాజీనామా డ్రామా ఆడిస్తున్నారు. ఈరోజో రేపో దేవేందర్ గౌడ్, సుధారాణి కూడా రాజీనామా లేఖలు అందజేస్తారు. తర్వాత పార్టీ ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి, వారి తప్పేమీ లేదని తీర్మానించి, వారి రాజీనామాలను ఆమోదించడం లేదని చెత్తబుట్టలో పడేస్తారు. టీడీపీలో ఎప్పుడూ జరిగేది ఇదే కదా’’ అని భూమా అన్నారు. విప్ జారీ చేయకుండా ఓటింగ్‌కు పంపించడంలోనే చంద్రబాబు కుమ్ముక్ము రాజకీయం ప్రజలకు అర్థమైందని పేర్కొన్నారు. ‘‘దేవెగౌడ, గుజ్రాల్, వాజ్‌పేయిలను నువ్వే ప్రధానులను చేసినట్లు చెప్పుకుంటావు. అబ్దుల్ కలాం రాష్ట్రపతి కావడానికీ నువ్వే కారణమంటావు. ఢిల్లీలో అంత పలుకుబడి కలిగిన సమయంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పార్లమెంటులో ఎందుకు పెట్టలేదు’’ అని ప్రశ్నించారు. చివరికి ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో ఎన్టీఆర్ విగ్రహం లేకపోతే విమర్శలు వస్తాయని శోభా నాగిరెడ్డి నచ్చచెప్పాకే ఆనాడు స్పందించారని అన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్‌వీ మోహన్ రెడ్డి, నాయకులు ఏవీ సుబ్బారెడ్డి, కోట్ల చక్రపాణి రెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: