సీబీఐ వాదన అవాస్తవం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీబీఐ వాదన అవాస్తవం

సీబీఐ వాదన అవాస్తవం

Written By news on Friday, December 21, 2012 | 12/21/2012

హైకోర్టుకు నివేదించిన జగన్ న్యాయవాది పద్మనాభరెడ్డి
అరెస్ట్ వాన్‌పిక్ కేసులో మాత్రమేఅనడం సరికాదు
అన్ని కేసులకు సంబంధించి అరెస్టు జరిగినట్లేనని జస్టిస్ చంద్రకుమార్ గతంలో స్పష్టం చేశారు
రిమాండ్ రిపోర్ట్, కస్టడీ పిటిషన్లు కోర్టుకు సమర్పించిన న్యాయవాది
వాదనలు పూర్తి.. బెయిల్‌పై తీర్పు 24న

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ నెల 24న తన నిర్ణయాన్ని వెలువరిస్తానని జస్టిస్ బి.శేషశయనారెడ్డి ప్రకటించారు. సీఆర్‌పీసీ సెక్షన్ 167(2) కింద తనకు బెయిల్ నిరాకరిస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలి సిందే. దీనిపై సీబీఐ వాదనలు బుధవారం ముగిశాయి. గురువారం జగన్ తరఫున సీనియర్ న్యాయవాది సి.పద్మనాభరెడ్డి తిరుగు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన సీబీఐ వ్యవహారశైలిని ఎండగట్టారు. జగన్‌ను అరెస్ట్ చేసింది కేవలం వాన్‌పిక్ కేసులో మాత్రమేనని సీబీఐ వాదించిన నేపథ్యంలో, ఆయన అరెస్ట్‌కు సంబంధించిన అరెస్ట్ మెమో, రిమాండ్ రిపోర్ట్, పోలీస్ కస్టడీ పిటిషన్‌లో ఏముందో చెప్పాలని సీబీఐని జడ్జి కోరిన విషయం తెలిసిందే. సీబీఐ వాటికి సమాధానం దాటవేయడంతో, గురువారం వాదనలు మొదలవగానే అరెస్ట్ మెమో, రిమాండ్ రిపోర్ట్, పోలీస్ కస్టడీ పిటిషన్లను పద్మనాభరెడ్డి న్యాయమూర్తి ముందుంచారు. 

అన్ని కేసుల్లో జగన్ అరెస్ట్ జరిగింది...

అరెస్ట్ మెమో ప్రకారం వివిధ ఆరోపణలపై జగన్‌ను ఆర్‌సీ 19(ఎ)(1) కింద అరెస్ట్ చేశారని పద్మనాభరెడ్డి నివేదించారు. రిమాండ్ రిపోర్ట్, కస్టడీ పిటిషన్‌లో.. జగన్ తన తండ్రి ద్వారా సండూర్ పవర్ సహా ఇతర కంపెనీలకు పలు ప్రయోజనాలు చేకూర్చారని పేర్కొన్నట్లు తెలిపారు. సండూర్ పవర్ గురించి రిమాండ్ రిపోర్ట్, కస్టడీ పిటిషన్‌లో పేర్కొన్నప్పటికీ, దానిపై ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపిందని వివరించారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. సీబీఐ ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉన్న కేసుల్లో కూడా జగన్‌ను కస్టడీకి అడిగే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. అవునంటూ పద్మనాభరెడ్డి సమాధానమిచ్చారు. వాన్‌పిక్ సహా దర్యాప్తు చేయాల్సి ఉన్న మిగిలిన ఏడు అంశాలపై కూడా ప్రశ్నించేందుకు జగన్‌ను కస్టడీ కోరే అవకాశం ఉందన్నారు. దీనిని బట్టి మొత్తం 8 కేసుల్లోనూ జగన్‌ను అరెస్ట్ చేసినట్లేనని, కేవలం వాన్‌పిక్ కేసులోనే అరెస్ట్ చేశామని చెప్పడంలో అర్థం లేదని వివరించారు. 

కస్టడీ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను ఒకసారి పరిశీలిస్తే దర్యాప్తు పూర్తయిన, చార్జిషీట్లు దాఖలు చేసిన కేసుల్లో మాత్రమే కాక, అన్ని అంశాల్లో జగన్ రిమాండ్ కోరినట్లుగా తెలుస్తుందన్నారు. తన అరెస్ట్‌ను అక్రమంగా ప్రకటించాలంటూ జగన్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు ఇదే హైకోర్టు న్యాయమూర్తి చంద్రకుమార్ తీర్పునిస్తూ.. వేర్వేరు నేరాల్లో జగన్‌కు భాగముందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నప్పుడు, ఆయనను అన్ని కేసుల్లో అరెస్ట్ చేసినట్లు భావించాల్సి ఉంటుందని స్పష్టంగా చెప్పారంటూ కోర్టుకు నివేదించారు. అందులో భాగంగానే జగన్ పిటిషన్‌ను కొట్టివేయడమే కాక, జగన్‌ను అన్ని కేసుల్లోనూ సీబీఐ కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. కాబట్టి జగన్‌ను అన్ని కేసుల్లో అరెస్ట్ చేయలేదన్న సీబీఐ వాదనల్లో పసలేదని పద్మనాభరెడ్డి స్పష్టం చేశారు. 

ఆ కేసుల్లో బెయిల్‌ను ఎందుకు వ్యతిరేకిస్తున్నట్లు..?

రిమాండ్ రిపోర్ట్‌లో.. దర్యాప్తు చేయాల్సి ఉన్న ఏడు అంశాలతో సహా అన్ని అంశాల గురించి స్పష్టమైన ప్రస్తావన ఉందని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ‘జగన్‌ను సీబీఐ అన్ని కేసుల్లోనూ అరెస్ట్ చేయలేదనే అనుకుందాం. దర్యాప్తు పూర్తయి, చార్జిషీట్లు దాఖలు చేసిన కేసుల్లో మాత్రమే అరెస్ట్ చేశారని సీబీఐ చెబుతున్న వాదన నిజమని కొద్దిసేపు భావిద్దాం. అదే నిజమైతే ఆ కేసుల్లో బెయిల్ కోసం జగన్ దాఖలు చేసుకున్న పిటిషన్లను సీబీఐ ఎందుకు వ్యతిరేకిస్తున్నట్లు..?’ అని ప్రశ్నించారు. సీబీఐ న్యాయవాది పి.కేశవరావు జోక్యం చేసుకుంటూ.. లేపాక్షి, ఇందూ ప్రాజెక్ట్ అంశాలు తమ దర్యాప్తులో తేలిన విషయాలని, దర్యాప్తు చేయాల్సిన ఏడు అంశాల్లో అవి తరువాత చేరాయని అన్నారు. ఆ రెండు అంశాలు అసలు ఎఫ్‌ఐఆర్‌లో లేనేలేవని తెలిపారు. పద్మనాభరెడ్డి వాదనలు కొనసాగిస్తూ.. సీబీఐ ఎప్పటికప్పుడు రిమాండ్ పొడిగింపు కోరుతూ మెమోలు దాఖలు చేస్తూ వచ్చిందని, అదే విధంగా కస్టడీ పొడిగింపును కూడా కోరిందని వివరించారు. క్విడ్ ప్రో కోకు సంబంధించి వివిధ అంశాలపై దర్యాప్తు చేస్తున్నామని చెబుతూ వచ్చిందే తప్ప, నిర్దిష్టంగా ఫలానా అంశంపై, ఫలానా కంపెనీపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పలేదన్నారు. 

వాన్‌పిక్ వ్యవహారంలో నాల్గవ చార్జిషీట్ దాఖలు చేసిన తరువాత, రిమాండ్ పొడిగింపు కోసం మెమో దాఖలు చేయడం సీబీఐ నిలిపివేసిందని వివరించారు. జగన్ బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో దాఖలు చేసిన కౌంటర్‌లో కూడా.. జగన్‌ను వాన్‌పిక్ కేసులో మాత్రమే అరెస్ట్ చేసినట్లుగా సీబీఐ సుప్రీంకోర్టుకు చెప్పలేదని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. వివిధ నేరాలకు సంబంధించి దర్యాప్తు సాగుతోందని, దర్యాప్తు కీలక దశలో ఉందని, ఈ దశలో బెయిలిస్తే, ఎంపీ, ఓ పార్టీ అధ్యక్షుడి హోదాతో సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని మాత్రమే సుప్రీంకోర్టుకు చెప్పిందని తెలిపారు. 

సీబీఐ వాదన పచ్చి అబద్ధం...

తాము 167(2) కింద చట్టబద్ధ బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరామన్న సీబీఐ వాదన పచ్చి అబద్ధమని పద్మనాభరెడ్డి చెప్పారు. తామెప్పుడూ చట్టబద్ధ బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయలేదన్నారు. నిబంధనలకు అనుగుణంగా చట్టబద్ధ బెయిల్ కోసం నవంబర్‌లో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో మాత్రమే పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు. కాబట్టి సుప్రీంకోర్టు 167(2) అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకునే ఉత్తర్వులు జారీ చేసిందన్న సీబీఐ వాదనల్లో అర్థం లేదని పేర్కొన్నారు. 

దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. ఇరుపక్షాలు ఈ విధంగా పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నప్పుడు, అసలు ఈ కోర్టు దేనిని నిజమని నమ్మాలి..? అసలు సుప్రీంకోర్టులో ఏం జరిగిందో తెలుసుకునేది ఎట్లా..? అని ప్రశ్నించారు. దీంతో ఒక చార్జిషీట్‌కు సంబంధించి మాత్రమే జగన్ అరెస్టయి, జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని, మిగిలిన చార్జిషీట్లలో ఆయన సీఆర్‌పీసీ సెక్షన్ 309 కింద రిమాండ్‌లో ఉన్నారని, దీనికి సంబంధించి బాండ్లను కూడా సమర్పించారని పద్మనాభరెడ్డి తెలిపారు. దీనినిబట్టి మిగిలిన చార్జిషీట్లకు సంబంధించి జగన్ బెయిల్‌పై విడుదలైనట్లేనన్నారు. కోర్టు లేవనెత్తిన అంశాల ఆధారంగా ఆయనకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాలరాయలేరని నివేదించారు. సుప్రీంకోర్టు సైతం తన ఉత్తర్వుల్లో ఎక్కడా కూడా జగన్ 167(2) కింద బెయిల్ కోరినట్లుగా పేర్కొనలేదని వివరించారు. సీబీఐ తరఫున కేశవరావు వాదిస్తూ.. రిమాండ్ రిపోర్ట్‌లోని అంశాలను ప్రస్తావించారు. అందులో తాము జగన్‌ను ఓ నేరం కింద అరెస్ట్ చేశామని పేర్కొన్నామే తప్ప, నేరాల కింద అరెస్ట్ చేశామని చెప్పలేదన్నారు. దీని అర్ధం జగన్‌ను తాము అరెస్ట్ చేసింది కేవలం వాన్‌పిక్ కేసులో మాత్రమేనని తెలిపారు. సుప్రీంకోర్టులో జగన్ 167(2) కింద పిటిషన్ దాఖలు చేశారని తాము ఎన్నడూ చెప్పలేదని, 167(2) అంశాన్ని ప్రస్తావించారని మాత్రమే చెప్పామని ఆయన వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ బెయిల్ పిటిషన్‌పై సోమవారం తన నిర్ణయాన్ని వెలువరిస్తానని ప్రకటించారు.

sakshi
Share this article :

0 comments: