ఎఫ్‌డీఐకి దొంగచాటు మద్దతు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎఫ్‌డీఐకి దొంగచాటు మద్దతు

ఎఫ్‌డీఐకి దొంగచాటు మద్దతు

Written By news on Wednesday, December 12, 2012 | 12/12/2012

తన హెరిటేజ్ డెయిరీ కోసం బాబు చిత్తూరు డెయిరీ గొంతు నులిమారు
మళ్లీ అదే హెరిటేజ్ కోసం రైతులు, చిరు వ్యాపారుల పొట్టగొట్టే ఎఫ్‌డీఐకి దొంగచాటుగా మద్దతు పలికారు
యూపీఏకు అనుకూలంగా ఎఫ్‌డీఐపై ఓటింగ్‌కు తన పార్టీ ఎంపీలను గైర్హాజరవ్వాలని ఆదేశించారు
టీడీపీలో చంద్రబాబు హిట్లర్.. ఆయన మాట కాదని ఎంపీలు ఓటింగ్‌కు దూరమవుతారా?
అయ్యారు అని చంద్రబాబు అంటే ప్రజలు నమ్ముతారా?
పాదయాత్రలో ప్రజా సమస్యలు విని కూడా చంద్రబాబు అవిశ్వాసం పెట్టనంటున్నారు
జగనన్న అధికారంలోకి వచ్చాక పాడి పరిశ్రమకు వడ్డీ లేని రుణాలిచ్చి ప్రోత్సహిస్తారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ మంగళవారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 54, కిలోమీటర్లు: 772.80

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన హెరిటేజ్ డెయిరీ కోసం చిత్తూరు డెయిరీ గొంతు నులిమారు. చిత్తూరు జిల్లా పాల రైతుల పొట్టగొట్టి ఆయన తన హెరిటేజ్ డెయిరీని పెంచుకున్నారు. ఇప్పుడు మళ్లీ అదే హెరిటేజ్ కోసం చంద్రబాబు నాయుడు దేశంలోని రైతులు, చిరు వ్యాపారుల పొట్టగొట్టే ఎఫ్‌డీఐలకు(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు) దొంగచాటుగా మద్దతు పలికారు.ఎఫ్‌డీఐల వల్ల రైతులకు, చిరు వ్యాపారులకు నష్టమని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు తన హెరిటేజ్‌లోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలని చూస్తున్నారు. అందులో భాగంగానే, ఎఫ్‌డీఐలపై ఓటింగ్‌లో యూపీఏ ప్రభుత్వం నెగ్గడం కోసం కాంగ్రెస్‌తో కుమ్మక్కై తన పార్టీ ఎంపీలు ఓటింగ్‌కు గైర్హాజరు కావాలని ఆదేశించారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నిప్పులు చెరిగారు. 

‘‘నేను ఒక్క మాట అడుగుతున్నా. ఆయన పార్టీలో చంద్రబాబు హిట్లర్. చంద్రబాబు మాట కాదని ఆయన పార్టీకి చెందిన ఎంపీలు ఓటింగ్‌కు దూరం అవుతారా? అయ్యారు అని చంద్రబాబు చెప్తుంటే ప్రజలు నమ్ముతారా?’’ అని షర్మిల సూటిగా ప్రశ్నించారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మన్‌సన్‌పల్లి చౌరస్తాలో మాట్లాడుతూ ఆమె పై వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కైన చంద్రబాబు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 54వ రోజు మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లాలో పూర్తయి రంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించింది.

వైఎస్ ఉన్నప్పుడు రూ.22, ఇప్పుడు 14.40..

మంగళవారం యాత్రలో మహబూబ్‌నగర్ జిల్లా పెంజెర్ల, కోడిచెర్ల గ్రామాల్లో షర్మిల రచ్చబండ మీద కూర్చొని స్థానికులతో మాట్లాడారు. వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పెంజెర్ల గ్రామానికి చెందిన రైతులు వన్నె శ్రీనివాసులు షర్మిలతో మాట్లాడుతూ.. ‘‘అక్కా..! నేను డిగ్రీ వరకు చదివాను. వైఎస్సార్ పాడి రైతులమీద చూపించిన ప్రేమను చూసి నేను పాడి గేదెలు పెట్టాను. వైఎస్సార్ ఉన్నప్పుడు వర్షాలకు.. కరెంటుకు కొదవ లేదు. కావలసినంత పచ్చి గడ్డి దొరికింది. ఒక్కొక్క గేదె రోజుకు ఎనిమిది లీటర్ల వరకు పాలిచ్చాయి. లీటరు పాల ధర రూ. 22 పలికింది. వైఎస్సార్ పట్టుబట్టి ఒక్కొక్క గేదెకు రూ. 50 వేల ఇన్సూరెన్స్ ఇచ్చారు. ఆయన వెళ్లిపోయిన తరువాత పాల మద్దతు ధర రూ. 19.50కు పడిపోయింది. ఇప్పుడైతే లీటరు పాలకు రూ.14.40 మాత్రమే కట్టిస్తున్నారు. వర్షాలు సరిగా పడట్లేదు.. కరెంటు ఉండట్లేదు.. ఎండుగడ్డి కూడా దొరికే పరిస్థితి లేదక్కా... ఆ రోజుకు ఎనిమిది లీటర్ల పాలు ఇచ్చే పశువులు ఇప్పుడు 3-4 లీటర్ల పాలిస్తున్నాయి. ఈ పాల దిగుబడితో రైతులు డెయిరీని నడపలేక పోతున్నారక్కా. రూ.50 వేలు.. రూ.60 వేలు పెట్టి తెచ్చిన పశువులను అడ్డికి పావుశేరు లెక్కన అమ్ముకోవాల్సి వస్తోందక్కా’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే గ్రామానికి చెందిన మేకల శ్రీశైలం మాట్లాడుతూ.. తనది కూడా ఇదే దుస్థితని, ఏం చేయాలో పాలుపోవట్లేదని అన్నారు. అనంతరం రంగారెడ్డి జిల్లా మన్‌సన్‌పల్లి చౌరస్తాలో షర్మిల మాట్లాడుతూ.. ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

జగనన్న వచ్చాక పాడికి వడ్డీలేని రుణాలు..

‘‘ఇవాళ పల్లెల్లో పేదల బతుకు దుర్భరంగా ఉంది. రైతులు అల్లాడిపోతున్నారు. పాడి రైతుల మనసు విరిగి ఇవాళ పాలు కిందపారబోసుకునే పరిస్థితి వచ్చింది. పశువులకు రోగం వస్తే మందులు అందుబాటులో ఉండవు. వైద్యులు అసలే ఉండరు. ఈ రాక్షస పాలనలో మనుషుల వైద్యానికే దిక్కు లేదు ఇక పశువుల వైద్యం ఆలోచన చేస్తారా?’’ అని షర్మిల విమర్శించారు. ‘‘రైతుల గోడు పట్టని ఇట్లాంటి సర్కారు ఎక్కువ రోజులు ఉండదు. వీళ్లకు రైతుల ఉసురు, మహిళల ఉసురు తాకి పోతారు. అమ్మా..! అన్నా..! నేను మీకు మాటిచ్చి చెప్తున్నా.. జగనన్న వస్తారు. మీరు కోరుకున్నట్టుగానే పాడి పరిశ్రమ నిలబెడతారు. యువతను పోత్సహించడం కోసం పాడిపరిశ్రమకు వడ్డీ లేని రుణాలు ఇస్తారు. పశువులకు వైద్యం చేయించడం కోసం 103 ఆంబులెన్స్‌ను కూడా పెడతారు’’ అని షర్మిల భరోసా ఇచ్చారు.

హిట్లర్... చంద్రబాబూ.. 420: ‘‘చంద్రబాబు నాయుడుకు హిట్లరుకు చాలా దగ్గరి పోలికలున్నాయి. హిట్లర్ పుట్టింది 4వ నెల 20న, చంద్రబాబు పుట్టిందీ 4వ నెల 20వ తేదీనే. అంటే 420 అన్న మాట. హిట్లర్ దగ్గర గోబెల్స్ అనే ఒక మంత్రి ఉండేవారు. ఆయన అబద్ధాలను ప్రచారం చేసి వాటినే నిజమని ప్రజలను నమ్మించే వారు. చంద్రబాబు కూడా గోబెల్స్ ఎల్లో పత్రికల ద్వారా అబద్ధాలను నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తారు. ఆయన సిద్ధాంతం ఒక్కటే.. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెబితే ప్రజలు దాన్ని నిజమనుకుంటారని చంద్రబాబు విశ్వాసం’’ షర్మిల విమర్శించారు. ‘‘మేం పాదయాత్ర చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు కూడా పాదయాత్ర చేస్తున్నారు. ప్రజలు మాకు చెప్పిన కష్టాలనే ఆయనకూ చెప్పారు. ప్రజా సమస్యలు పట్టని ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి దించవయ్యా అంటే అవిశ్వాసం పెట్టనుగాక పెట్టను అంటున్నారు బాబు’’ అని మండిపడ్డారు.


బతుకమ్మ ఆడిపాడి.. షర్మిలకు వీడ్కోలు..

మహబూబ్‌నగర్ జిల్లాతో తెలంగాణలోకి పాదం మోపిన షర్మిలను పాలమూరు ప్రజలు తమ ఆడపడుచులా ఆదరించారు. 20 రోజులు గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు. మంగళవారం జిల్లాలో యాత్ర పూర్తవడంతో ఘనంగా వీడ్కోలు పలికారు. కొత్తూరు మండలం కోడిచర్ల గ్రామంతో జిల్లాలో యాత్ర పూర్తి చేసుకుని షర్మిల రంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించారు. పాలమూరు జిల్లా మాజీ ఎమ్మెల్యే స్వర్ణసుధాకర్‌రెడ్డి, బాలమణెమ్మ, కందుల శోభనాదేవి తదితరులు తంగేడి పూలతో బతుకమ్మలు కూర్చి షర్మిల విశ్రాంతి తీసుకున్న వేదిక వద్ద ఆడిపాడారు. ఆమెతో పాటు బతుక మ్మలను కూడా రంగారెడ్డి జిల్లా కోళ్ల పడకల్ గ్రామం వరకు తీసుకెళ్లి.. ఆ జిల్లా మహిళలకు అప్పగించి ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. మధ్యాహ్నం 4.38 గంటలకు షర్మిల కోళ్ల పడకల్‌లోకి ప్రవేశించి రంగారెడ్డి జిల్లాలో యాత్ర ప్రారంభించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు దేప భాస్కర్‌రెడ్డి, సురేఖ దంపతులు షర్మిలకు పుష్ప గుచ్ఛమిచ్చి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజలు భారీ ఎత్తున తరలిరావడంతో తోపులాట చోటు చేసుకుంది. అక్కడి నుంచి దాదాపు 8 కిలో మీటర్ల మేర జిల్లాలో యాత్ర సాగింది. మన్‌సన్‌పల్లి వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బసకు 8 గంటలకు షర్మిల చేరుకున్నారు. మంగళవారం మొత్తం 16.50 కి.మీ మేర యాత్ర సాగింది. ఇప్పటివరకు మొత్తం 772.80 కిలోమీటర్ల యాత్ర పూర్తయ్యింది. మహబూబ్‌నగర్ జిల్లాలో 20 రోజుల పాటు 94 గ్రామాల మీదుగా 290.70 కి.మీ మేర షర్మిల పర్యటించారు. మంగళవారం షర్మిల యాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, పార్టీ నాయకులు కేకే మహేందర్‌రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, ఎడ్మ కిష్టారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, రాజ్‌ఠాకూర్, బాజిరెడ్డి గోవర్ధన్, జనక్ ప్రసాద్, పుత్తా ప్రతాప్‌రెడ్డి, బెక్కరి జనార్దన్‌రెడ్డి, గట్టు రామచంద్రరావు, సంకినేని వెంకటేశ్వరరావు, గౌరు వెంకట్‌రెడ్డి, వాసిరెడ్డి పద్మ, తలశిల రఘురాం, కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, ఆదం విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు
Share this article :

0 comments: