బాధితురాలికి వైఎస్‌ఆర్ సీపీ సంతాపం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాధితురాలికి వైఎస్‌ఆర్ సీపీ సంతాపం

బాధితురాలికి వైఎస్‌ఆర్ సీపీ సంతాపం

Written By news on Saturday, December 29, 2012 | 12/29/2012

ఢిల్లీలో సామూహిక అత్యాచారానికి గురైన నిర్భయ మృతి నేపథ్యంలో ఈ దేశంలో మహిళలకున్న రక్షణ, చట్టాల సమీక్షకు తక్షణమే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. ఆమె పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో 13 రోజుల పాటు మృత్యువుతో పోరాడి మరణించిన బాధితురాలికి తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు.

మహిళల రక్షణకు పెనుమార్పులు తీసుకురావాల్సిన ఆవశ్యకతను ఈ ఉదంతం చాటి చెబుతోందని ఆమె అన్నారు. గ్యాంగ్ రేప్ జరిగిన తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించిన తీరు అత్యంత గర్హనీయం అని ఆమె దుయ్యబట్టారు. సంఘటన జరిగిన రెండో రోజునే ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మాట్లాడుతూ రాత్రిళ్లు మహిళలకు రక్షణ కల్పించలేమని మాట్లాడ్డం ఏమిటని ఆమె అభ్యంతరం తెలిపారు.

వారం రోజుల పాటు యువత, విద్యార్థులు ఢిల్లీని ముట్టడించిన తరువాతనే దిగివచ్చి కేసులో సత్వరం చార్జిషీటు వేస్తామని, నిందితులకు శిక్షపడేలా ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించిందని ఆమె అన్నారు. అసలు ఈ వ్యవహారాన్ని తొలి నుంచీ శాంతిభద్రతల కోణంలోనే చూస్తున్నారని ఆందోళన చేస్తున్న వారిని ఎలా అదుపు చేయాలని ఆలోచించారే తప్ప మహిళల రక్షణ గురించి చిత్తశుద్ధి లేదని ఆమె విమర్శించారు.

శాంతిభద్రతల కోణంలో ఆలోచించారు కనుకనే విషమ పరిస్థితిలో నిర్భయను ఢిల్లీ నుంచి సింగపూర్‌కు తరలించారని ఆమె అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తరలింపు ప్రమాదం అని వైద్యులు చెప్పినా చేశారంటే ఇందులో రాజకీయ కోణం ఉందని సోనియా నివాసమైన టెన్, జన్‌పథ్‌లో ఈ నిర్ణయం జరిగినట్లు ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.

అర్థరాత్రి మహిళలు ఎందుకు తిరగాలని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బాధ్యతారాహిత్యంగా మాట్లాడ్డం చూస్తే మహిళల పట్ల ఆయనకు ఎంత చులకన అభిప్రాయం ఉందో అర్థమవుతుందన్నారు. రాష్ట్రపతి కుమారుడు చేసిన వ్యాఖ్యలు కూడా దారుణమన్నారు. అందరూ సిగ్గుతో తల దించుకోవాల్సిన ఈ సంఘటన తరువాత ఉన్నత స్థాయిలో మహిళల రక్షణ గురించి చర్చించాల్సి ఆవశ్యకత కనిపిస్తోందని అందుకే పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశ పర్చాలని ఆమె కోరారు.

నిర్భయకు నివాళి
అత్యాచార బాధితురాలు మృతి చెందినట్లు తెలిసిన వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె చిత్రపటాన్ని ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, వైఎస్సార్ ట్రేడ్‌యూనియన్ నాయకురాలు గాయత్రితో పాటు పలువురు నేతలు పాల్గొని ఆమె మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. బాధితురాలి కుటుంబం మనోవేదన నుంచి కోలుకోవాలని వారు కోరారు. 
Share this article :

0 comments: