ఎన్నేళ్లు సాగిస్తారు? - ఏ దర్యాప్తుకైనా గడువుండాలి కదా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎన్నేళ్లు సాగిస్తారు? - ఏ దర్యాప్తుకైనా గడువుండాలి కదా?

ఎన్నేళ్లు సాగిస్తారు? - ఏ దర్యాప్తుకైనా గడువుండాలి కదా?

Written By news on Tuesday, January 22, 2013 | 1/22/2013

ఎన్నేళ్లు సాగిస్తారు?
- ఏ దర్యాప్తుకైనా గడువుండాలి కదా?
జగన్‌ బెయిలుపై సీబీఐకి హైకోర్టు ప్రశ్న
- సుప్రీం తీర్పును ప్రస్తావిస్తూ.. బెయిలుకు అడ్డుపడిన సీబీఐ
- అరెస్టు చేసి 8 నెలలవుతున్నా నేటికీ గడువు చెప్పని సీబీఐ
- కేసు క్లిష్టమైనదని, ప్రభుత్వం సహకరించటం లేదని దాటవేత
- సుప్రీం తీర్పు బెయిలుకు అడ్డం కాదన్న జగన్ న్యాయవాదులు
- పరిస్థితులు మారితే ఇవ్వవచ్చని వాదన; పలు తీర్పుల ప్రస్తావన
- పరిస్థితులు ఎలా మారాయో కూడా వివరించిన తీరు
- బోఫోర్స్‌లో లెటర్ రొగేటరీలకు పదేళ్లు పట్టిందని వివరణ
- అన్ని సంవత్సరాలూ నిందితుల్ని జైల్లో ఉంచేస్తారా అంటూ ప్రశ్న
- జగన్ జైల్లో ఉంటే ఆయన నియోజకవర్గ ప్రయోజనాలకూ దెబ్బే
- ఆయనో పార్టీ అధ్యక్షుడు కనక సామాన్య జనమూ నష్టపోతారు
- సాంకేతికంగా... కేసు అంశాలపరంగా ఎలా చూసినా బెయిలివ్వొచ్చు
- అన్నిటినీ వివరించిన జగన్ తరఫు న్యాయవాది
- ముగిసిన వాదనలు; తీర్పు రేపటికి వాయిదా

హైదరాబాద్: దర్యాప్తునకు నిర్దిష్ట గడువనేది ఉండాలని, అలాంటిదేమీ లేకుండా ఎన్నాళ్లు సాగదీస్తారని సీబీఐని రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించింది. వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో దర్యాప్తు ఎన్నేళ్లు సాగుతుందని కూడా కోర్టు నిలదీసింది. ఈ కేసుకు సంబంధించి ఎనిమిది నెలలుగా జైల్లో ఉన్న జగన్‌మోహన్ రెడ్డి... బెయిలుపై విడుదల చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది. అయితే సీబీఐ నేరుగా సమాధానమివ్వకుండా.. ఈ కేసు చాలా క్లిష్టమైనదని, అయినా తాము సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని దాటవేత ధోరణిలో జవాబిచ్చింది. మరి మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని సుప్రీంకోర్టుకు లిఖితపూర్వకంగా చెప్పారు కదా? అని న్యాయమూర్తి ప్రశ్నించగా... తాము పేర్కొన్న ఏడంశాలకు గాను మూడింటిలో మాత్రమే దర్యాప్తు మూడు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పామని తెలియజేసింది. ఈ దశలో జోక్యం చేసుకున్న జగన్ తరఫు న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి దీనికి తీవ్ర అభ్యంతరం చెప్పారు. ఒక్కొక్క కోర్టు ముందు సీబీఐ ఒకోలా వాదనలు వినిపిస్తోందని, దిగువ కోర్టులో ఒక రకంగా... హైకోర్టులో మరో రకంగా... సుప్రీం కోర్టులో ఇంకో రకంగా చెబుతోందని, కోర్టులను తప్పుదోవ పట్టిస్తోందని చెప్పారు. సుప్రీం ఉత్తర్వుల్ని సీబీఐ పదేపదే ప్రస్తావించడాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. ఒక ఉదాహరణ చెబుతూ... ‘‘ఒక కేసులో సుప్రీం బెయిలు ఇవ్వరాదని చెప్పిందనుకోండి. మరి ఆ కేసులో రెండు పార్టీలూ ఒక రాజీకి వస్తే రాజీ చేయకుండా ఊరుకుంటామా? అందుకు వీల్లేదంటామా?’’ అని ప్రశ్నించారు. బోఫోర్స్‌లో లెటర్ రొగేటరీలకు సమాధానం రావటానికి పదేళ్లకు పైనే పట్టిందని గుర్తు చేస్తూ... ‘‘అలాంటి సందర్భాల్లో పదేళ్ల పాటు నిందితులను జైల్లో ఉంచేస్తారా?’’ అని ప్రశ్నించారు. ఇరు పక్షాల వాదనలూ విన్న న్యాయమూర్తి... తీర్పును గురువారానికి వాయిదా వేశారు. 

ఇది క్లిష్టమైన కేసని, అందుకే దర్యాప్తు పూర్తి చేయలేకపోతున్నామని... పెపైచ్చు రాష్ట్ర ప్రభుత్వం కూడా తమకు సహకరించటం లేదని సీబీఐ ఒక దశలో కోర్టుకు తెలిపింది. దీనికి నిరంజన్ తీవ్రంగా అభ్యంతరం చెప్పారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సహకరించకపోవచ్చు. మరి అదే సాకుతో పిటిషనర్‌ను జైల్లో ఉంచేస్తారా? రాజకీయ దురుద్దేశాలతో కూడిన కేసుల్లో దర్యాప్తునకు ఎన్నాళ్లయినా పట్టొచ్చు. మరి అన్ని రోజులూ బెయిలు ఇవ్వకూడదనటం కరెక్టా?’’ అని ప్రశ్నించారు. 

పరిస్థితులు మారితే బెయిలివ్వొచ్చు...

సుప్రీం ఉత్తర్వులను సీబీఐ ప్రస్తావించటంతో... ఈ బెయిలు పిటిషన్ దాఖలు చేయటానికి అవి అడ్డు రావటం లేదా? అని జగన్ తరఫు న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. ‘‘పై కోర్టు బెయిలును తిరస్కరించినా సరే... ఆ తరవాత గనక పరిస్థితులు మారినట్లయితే కింది కోర్టు బెయిలు మంజూరు చేసే ఆస్కారం ఉంది’’ అంటూ రెండు కేసులను జగన్ తరఫు న్యాయవాది ఎస్.నిరంజన్ రెడ్డి ప్రస్తావించారు. బాబు సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ (1978), కల్యాణ్ చంద్ర సర్కార్ వర్సెస్ రాజేష్ రంజన్ (2005) కేసుల్లో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను ఆయన ఉదహరించారు. ఈ కేసులో సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఇచ్చేనాటికి ఇప్పటికి పరిస్థితులు ఎప్పుడెప్పుడు ఎలా ఎలా మారాయో వివరంగా తెలియజేశారు. 

అరెస్టుపై వైఖరి మారింది...

‘‘మొదటి ఛార్జిషీట్లో (సీసీ-8) జగన్‌ను అరెస్టు చేసినట్లుగా సుప్రీం కోర్టులో చెప్పిన సీబీఐ... తానెన్నడూ ఈ ఛార్జిషీట్లో ఆయన్ను అరెస్టు చేయలేదని, రిమాండ్‌ను కూడా కోరలేదని ఇప్పుడు చెబుతోంది. ఈ పిటిషన్‌కు ప్రతిగా దాఖలు చేసిన కౌంటర్‌లోని 4, 5 పేరాల్లో ఈ విషయం స్పష్టంగా పేర్కొంది. సుప్రీంకోర్టులో మాత్రం బెయిలు వద్దని అభ్యర్థిస్తూ పేర్కొన్న అంశాల్లో సీసీ-8ను (మొదటి ఛార్జిషీటు) స్పష్టంగా పేర్కొంది. సుప్రీం ముందు సీబీఐ దాఖలు చేసిన కౌంటర్‌లో దీన్ని స్పష్టంగా చూడొచ్చు కూడా. మొదటి ఛార్జిషీట్లో నిందితుడి రిమాండ్ తమకు అక్కర్లేదని ఇపుడు సీబీఐ తనంత తనే చెబుతున్న నేపథ్యంలో ఇక జగన్‌మోహన్‌రెడ్డిని కస్టడీలో ఉంచాల్సిన అవసరం లేదు. ప్రత్యేకించి కింది కోర్టు కూడా ఈ ఛార్జిషీటును విచారణకు స్వీకరిస్తూ వారెంట్లేమీ జారీ చేయలేదు. కేవలం సమన్లు మాత్రమే ఇచ్చింది’’ అని నిరంజన్‌రెడ్డి వివరించారు. 

వాన్‌పిక్ కేసులో బాండ్‌ను అనుమతించారు...

వాన్‌పిక్ కేసులో బెయిలు మంజూరైన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి ప్రస్తావించారు. ‘‘సుప్రీంకోర్టులో వాదనల సందర్భంగా... తాము జగన్‌ను సీసీ నెంబర్ 14లో అరెస్టు చేశామని, దాన్లోనే రిమాండ్ అడిగామని సీబీఐ పేర్కొంది. నాటి సుప్రీం ఉత్తర్వుల అనంతరం సీసీ14లో (వాన్‌పిక్ కేసు) బాండ్‌ను సమర్పించటం, దాన్ని కోర్టు అంగీకరించటం జరిగింది. పరిస్థితులు మారాయనటానికి ఇది స్పష్టమైన ఉదాహరణ. మొదటి ఛార్జిషీట్లో దర్యాప్తు పూర్తయిందని, తదుపరి దర్యాప్తు అవసరం లేదని సుప్రీంకోర్టుకు సీబీఐ చెప్పింది కూడా’’ అని తెలియజేశారు. ఏడు అంశాలపై మాత్రమే దర్యాప్తు పెండింగ్‌లో ఉందని సుప్రీంకు సీబీఐ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

కస్టడీ తీరే మారిపోయింది...

ఈ కేసుకు సంబంధించి అన్ని అంశాల్లోనూ (ఎఫ్‌ఐఆర్ లేదా ఆర్‌సీ-19) పిటిషనర్‌ను అరెస్టు చేశామని సీబీఐ చెబుతోందని, కానీ సుప్రీంకోర్టులో చెప్పిన ఆ ఏడంశాలకూ సంబంధించి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 167కింద ఎన్నడూ రిమాండ్‌ను పొడిగించాలని కోరలేదని నిరంజన్‌రెడ్డి స్పష్టంచేశారు. ఈ అంశాన్ని కోర్టు కూడా గుర్తించిందని, ఈ వైఖరి పిటిషనర్ కస్టడీ తీరును పూర్తిగా మార్చేసిందని ఆయన వివరించారు. ఇలా పరిస్థితులు మారాయి కనక సుప్రీంకోర్టు ఉత్తర్వులున్నప్పటికీ పిటిషనర్ బెయిలుకు అర్హుడని తెలియజేశారు. 

త్వరగా పూర్తిచేస్తామంటే ఇదా అర్థం?

దర్యాప్తును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తానని గతేడాది అక్టోబర్ 5న సుప్రీం కోర్టుకు సీబీఐ తెలియజేసిందని చెబుతూ... ‘‘సాధారణంగా అయితే దర్యాప్తును 24 గంటల్లో పూర్తి చేయాలన్నది సుప్రీం కోర్టు నిర్దేశన. దాన్ని ఒకసారి 15 రోజులుగా పొడిగించొచ్చు. కానీ సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చినా సరే మూడున్నర నెలలుగా సీబీఐ దర్యాప్తును పూర్తి చేయలేదు. పిటిషనర్ రిమాండ్‌ను పొడిగిస్తూ వస్తున్నారు. ఇలా కస్టడీని పొడిగించటమే మారిన పరిస్థితిగా గుర్తించాలి’’ అని పేర్కొన్నారు. 1992లో సీబీఐ వర్సెస్ అనుపమ్ కులకర్ణి మధ్య నడిచిన కేసులో సుప్రీం కోర్టు తీర్పును కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

రిమాండ్ పొడిగించటాన్ని కూడా...

సీఆర్‌పీసీలోని సెక్షన్ 309 కింద... పిటిషనర్‌ను జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపాక రిమాండ్‌ను ఒకసారి 15 రోజుల పాటు మాత్రమే పొడిగించే వీలుందని నిరంజన్ గుర్తు చేశారు. ‘‘ప్రతి 15 రోజుల తరవాత రిమాండ్‌ను పొడిగించాల్సిన అవసరం ఉందని భావిస్తే... దానికి తగ్గ కారణాలను రికార్డు చేశాక కోర్టు ఆ మేరకు నిర్ణయం తీసుకుంటుంది. దీన్ని బట్టి రిమాండ్ పొడిగించిన ప్రతిసారీ పరిస్థితులు మారినట్లే గమనించాలి’’ అంటూ ఆ సెక్షన్‌ను ఆయన పూర్తిగా వివరించారు. 

ఇలా చూసినా బెయిలిచ్చి తీరాలి...

కేసు అంశాలను చూసినా పిటిషనర్‌కు బెయిలిచ్చి తీరాలని నిరంజన్ గట్టిగా పేర్కొన్నారు. మొదటి ఛార్జిషీటుకు సంబంధించి తొలి నిందితుడు జగన్‌మోహన్ రెడ్డితో పాటు పలువురికి కోర్టు సమన్లిచ్చిందని, కానీ మొదటి నిందితుడిని, రెండో నిందితుడైన విజయసాయిరెడ్డిని మినహా ఎవ్వరినీ కస్టడీలోకి తీసుకోలేదని స్పష్టం చేశారు. ఆ ఇద్దరిలో కూడా రెండో నిందితుడికి బెయిలు మంజూరైందన్నారు. ‘‘జగన్ ఒక్కరే తొలి ఛార్జిషీటుకు సంబంధించి జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు. నిజానికి ప్రాథమికంగా నిందితులైన వ్యక్తుల్ని కనీసం కస్టడీలోకి కూడా తీసుకోలేదు. పెపైచ్చు దర్యాప్తు కూడా పూర్తయింది. కానీ పిటిషనర్‌ను మాత్రం కస్టడీలో కొనసాగిస్తున్నారు. ఇది అవసరం లేదు. ఇవన్నీ కాకుండా పిటిషనర్‌పై వేరువేరు కేసులు పెడుతున్నారు. ఆయన్ను జైల్లో ఉంచి ఇలా కేసులు పెట్టడం వల్ల ఆయనకు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవటానికి సరైన అవకాశం ఇవ్వనట్లే. ఇది సరైన విచారణ కాదు. ఇలాంటి సమయాల్లో బెయిలు ఇవ్వవచ్చని సుప్రీంకోర్టు కూడా చెబుతోంది’’ అని వివరించారు. 

ఆయన ప్రజా ప్రతినిధి కూడా...

పిటిషనర్‌ను కస్టడీలో ఉంచటం వల్ల ఆయన ఒక్కరే కాదు. ఆయన నియోజకవర్గ సభ్యులు, సామాన్య ప్రజలు కూడా దెబ్బతింటున్నారు. ఎందుకంటే ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు కనక, ఎంపీ కనక బయట ఉంటే ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేసేవారు. ఆయన్ను కస్టడీలో కొనసాగించటం వల్ల వారందరి హక్కులు కూడా దెబ్బతింటున్నాయి. సానుకూలతల సమానత్వాన్ని చూసినపుడు అది పిటిషనర్‌వైపే మొగ్గుతోంది. ఎందుకంటే ఆయన రాజకీయ నాయకుడిగా తన నియోజకవర్గంలోని ప్రజలకు, పార్టీ సభ్యులకు తగిన విధంగా అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది’’ అని నిరంజన్ వివరించారు.

http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=527782&Categoryid=14&subcatid=0
Share this article :

0 comments: