తెలంగాణా వ్యవహారంలో కేంద్రం నుంచి వస్తున్న సంకేతాలలొ సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీకి వణుకు పుట్టిస్తోంది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ ఓ స్వరం ‘తూర్పు’న ఉద్భవించింది. ఒకప్పుడు టీడీపీకి కంచుకోట అయిన జిల్లా నుంచే అధిష్టానంపై నిరసన గళం వినిపించడం గమనార్హం. జిల్లాలో టీడీపీ విధానపరమైన నిర్ణయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న ప్రణాళికా మండలి మాజీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు పార్టీ అధినేత బాబు తీరును బాహాటంగానే ఎండగట్టారు.
టీడీపీ సీనియర్ నేత బొడ్డు భాస్కర రామారావు రాసిన లేఖ ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సమైక్యాంధ్ర కంటె స్వీయ ప్రయోజనాలు, పార్టీ, ఎమ్మెల్సీ పదవులు ముఖ్యం కాదని ఆయన తెగేసి చెప్పారు. పార్టీ అధినేత చంద్రబాబు పునరాలోచన చేయకుంటే నాలుగైదు రోజుల్లో పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తానని ఆయన చేసిన ప్రకటన జిల్లా తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలను సృష్టించింది. దాంతో కేడర్ మనోధైర్యం కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఈ ప్రభావం పార్టీలోని ఇతర నేతలపై కూడా పడుతుందని నాయకత్వం ఆందోళన చెందుతోంది. మరింతమంది ఇదే బాటలో ఉన్నట్టు సమాచారం. నేతల హెచ్చరికలు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు తలనొప్పిగా మారుతోంది.
జిల్లాలో టీడీపీకి సీనియర్ నేతలుగా చెప్పుకునేవాళ్లు యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బొడ్డు భాస్కర రామరావు, చిక్కాల రామచంద్రరావు. ఉన్న ఈ నలుగురిలో ఒకరు పార్టీకి దూరంగా ఉంటే మరొకరు తెలంగాణా వ్యవహారంలో పార్టీని ధిక్కరిస్తూ ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. రామచంద్రపురం ఉపఎన్నికల్లో చంద్రబాబు చేసిన మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారంతో ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు మనస్థాపంతో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు.
ఇక గోరంట్ల, యనమల ఆయా నియోజకవర్గాల్లోనే పట్టు కోల్పోయారు. స్థానిక క్యాడర్తో వీరికి విబేధాలున్నాయి. ఇక పార్టీలో మరో సీనియర్ నేత, బలమైన టీడీపీ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు. ఇప్పుడు ఈయన తెలంగాణా విషయంలో చంద్రబాబు వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అధినేతపై బాహాటంగానే విమర్శలకు దిగారు. బహిరంగలేఖ రాయడమే కాకుండా మీడియా సమావేశం పెట్టి మరీ ఆగ్రహం వెళ్లగక్కారు.
వాస్తవానికి చంద్రబాబు తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయంపై పార్టీలో సీమాంధ్ర నేతలందరూ అసంతృప్తితో రలిగిపోతున్నారు. సీమాంధ్రలో రైతులు, ప్రజల భవిష్యత్తు దృష్ట్యా సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనేందుకు భాస్కర రామారావు ముందుకు రావడం టీడీపీలో ఇతర నేతలు, అధికార కాంగ్రెస్ సహా ఇతర పక్షాలు ఉద్యమ బాటపట్టాల్సిన అనివార్య పరిస్థితులను సృష్టించాయి.
తెలంగాణ అంశంపై పార్టీ తరఫున లేఖను అందజేయడానికి ఢిల్లీ వెళ్లిన పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు వైఖరిని కూడా భాస్కర రామారావు తీవ్రంగా గర్హించడం గమనార్హం. సమైక్యాంధ్ర కోసం సాహసోపేత నిర్ణయం తీసుకున్న తొలి నేతగా భాస్కరరామారావుకు ఆ పార్టీ నేతల నుంచే మద్దతు లభించడం ఖాయమని నేతలు విశ్లేషిస్తున్నారు. భాస్కర రామారావు సమైక్యాంధ్ర కోసం ధైర్యంగా పార్టీని, పదవులను వీడేందుకు సిద్ధపడటం ఇతర పార్టీల్లో గుబులు పుట్టిస్తోంది.
0 comments:
Post a Comment