ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా
జగన్పై కేంద్రం, చంద్రబాబు కుట్రలను దగ్గర నుంచి చూశా
ఆయనకు మద్దతుగా నిలబడటానికి ఇదే సరైన సమయమని భావించా
జైల్లో జగ న్తో నాని ములాఖత్
సాక్షి, హైదరాబాద్:
మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు, పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య(నాని) ప్రకటించారు. మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి అభిమానిగా.. ఆయన కుటుంబంపై జరుగుతున్న వేధింపులకు కలత చెందానని చెప్పారు. ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. గురువారమిక్కడ ఆయన చంచల్గూడ జైలులో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని కలుసుకుని, పార్టీలో చేరడానికి తన సంసిద్ధతను వ్యక్తం చేశారు. జగన్తో ములాఖత్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘జగన్ను నెలల తరబడి జైల్లో పెట్టడం బాధాకరం. తమపై జరుగుతున్న వేధింపులను వివరించడానికి ఏనాడూ బయటకు రాని వైఎస్ సతీమణి, ఆయన కుమార్తె ఎండనక.. వాననక.. జనంలో తిరగాల్సి రావడం నాకు ఆవేదన కలిగించింది.
ఆ కుటుంబం కష్టాల్లో ఉన్న తరుణంలో ఇంకా జగన్ వైపు నిలబడకపోవడం ఏ మాత్రం ధర్మం కాదని నియోజకవర్గ ప్రజలు నాతో చెప్పారు. అందుకే వైఎస్సార్ కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకున్నా’ అని వివరించారు. వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కలిసి చేసిన కుట్రలను చాలా దగ్గరగా.. ప్రత్యక్షంగా.. మౌనంగా వీక్షించానని చెప్పారు. అసెంబ్లీలో కూడా వారి కుమ్మక్కును చూశానన్నారు. ‘కేంద్రం, చంద్రబాబు కలిసి కుమ్మక్కై ఎనిమిది నెలలుగా జగన్ను జైల్లో ఉంచడం చూసి.. ఆయనకు మద్దతుగా నిలబడటానికి ఇదే సరైన సమయంగా నేను భావించాను. నియోజకవర్గ ప్రజలు నన్ను నమ్మి, ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు 2014 వరకు కాంగ్రెస్లోనే కొనసాగుదామనుకున్నా. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో మహానేత తనయుడైన జగన్కు అండగా ఉండి పనిచేసేందుకే నిర్ణయించుకున్నా’ అని పేర్కొన్నారు. త్వరలో తేదీ నిర్ణయించుకుని వైఎస్సార్ కాంగ్రెస్లో చేరుతానని తెలిపారు. పేర్ని నాని మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2004, 2009లో వరుసగా గెలుపొందారు. ఆయన తండ్రి పేర్ని కృష్ణమూర్తి గతంలో బందర్ మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా పనిచేశారు. మరోవైపు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు భూమా శోభానాగిరెడ్డి, గుర్నాథరెడ్డిలు కూడా జగన్ను ప్రత్యేక ములాఖత్లో కలిశారు.
0 comments:
Post a Comment