ప్రభుత్వం సహకరించకపోతే ఆ ఆధారాలు మీరు సృష్టించారా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రభుత్వం సహకరించకపోతే ఆ ఆధారాలు మీరు సృష్టించారా?

ప్రభుత్వం సహకరించకపోతే ఆ ఆధారాలు మీరు సృష్టించారా?

Written By news on Friday, January 25, 2013 | 1/25/2013

సర్కారు సహకరించకపోతే 26 జీవోలు అక్రమమని ఎలా నిర్ధారించారు?
ఏ ఆధారాలున్నాయని జగన్‌ను అరెస్టు చేశారు? అవి ఎక్కడినుంచి వచ్చాయి?
ప్రభుత్వం సహకరించకపోతే ఆ ఆధారాలు మీరు సృష్టించారా?
ఆధారాలు ఎలాగూ లేవు కనుక ఆధారాలు సృష్టించేవరకు జగన్‌ను జైల్లోనే ఉంచదలుచుకున్నారా?
ఆయన్ను వీలైనన్ని ఎక్కువరోజులు జైల్లో పెట్టేందుకే కోర్టు ముందు కొత్త వాదన
ప్రభుత్వం సహకరించడం లేదని సుప్రీంకోర్టులో ఎందుకు చెప్పలేదు?
ప్రభుత్వం సహకరించకపోతే.. సీఎంను, సీఎస్‌ను అరెస్టు చేస్తారా?
సీబీఐ, కాంగ్రెస్ ప్రభుత్వ కుట్ర ప్రజలకు అర్థమవుతోందన్న వైఎస్సార్ కాంగ్రెస్ నేత

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇంతకాలం దర్యాప్తుకు సహకరించకపోతే 26 జీవోలు అక్రమమని ఎలా నిర్ధారించారు? ఏ ఆధారాలతో తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్టు చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ సీబీఐని ప్రశ్నించారు. జగన్‌ను సాధ్యమైనన్ని ఎక్కువ రోజులు జైల్లో పెట్టాలనే దురుద్దేశంతోనే సీబీఐ ప్రభుత్వం సహకరించడం లేదనే కొత్తవాదనను కోర్టు ముందుకు తెచ్చిందని ఆమె చెప్పారు. ‘ఇది అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన కేసు...ఈ కేసుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదంటే సీబీఐ తీసుకోవాల్సిన తదుపరి చర్యలేమిటి? రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అరెస్టు చేస్తుందా? ముఖ్యమంత్రిని అరెస్టు చేస్తుందా?’ అని ప్రశ్నించారు. అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన కేసుకే రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదంటే.. దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ ఎందుకున్నట్లు? అని నిలదీశారు. హైకోర్టు జగన్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడం దురదృష్టకరమని ఆమె వ్యాఖ్యానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పద్మ మాట్లాడారు. 18 నెలలుగా దర్యాప్తు పేరుతో రకరకాల విన్యాసాలు చేస్తున్న సీబీఐ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జగన్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన ఏ కోర్టులోనూ.. రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తునకు సహకరించడం లేదనే విషయం ఎందుకు చెప్పలేదని ఆమె అడిగారు. హైకోర్టు ముందు సీబీఐ చేసిన వాదనలు చూస్తే.. ‘దర్యాప్తు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేము..’ అన్నట్టుగా ఉందని అన్నారు. 

గత ఏడాది అక్టోబర్ ఐదో తేదీకి ముందు సుప్రీంకోర్టులో జగన్ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని సీబీఐ చెప్పిందని, ఆ గడువు ఈ ఏడాది జనవరి 5వ తేదీతో ముగిసిందని.. ఇలాంటి దశలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని చెప్పడమేమిటని పద్మ ప్రశ్నించారు. ఇదే విషయం సుప్రీం విచారణ సందర్భంగా సీబీఐ ఎందుకు చెప్పలేదన్నారు. ‘18 నెలల క్రితం శంకర్రావు 26 జీవోలపై పిటిషన్ వేసినప్పుడు అడ్వొకేట్ జనరల్ హాజరై వాదించాలి. కానీ ఆయన కౌంటర్ దాఖలు చేయలేదు సరికదా.. ఆ ఛాయలకు కూడా రాలేదు. ఆరోజు సీబీఐ ఎందుకు ప్రభుత్వం సహకరించడం లేదని చెప్పలేదు? కౌంటర్ దాఖలు చేయలేదని చెప్పలేదు?’ అని నిలదీశారు. సుధాకర్‌రెడ్డి అనే న్యాయవాది ఈ వ్యవహారంలో మంత్రులు, ఐఏఎస్‌ల పాత్ర ఏమిటని సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే.. నెల రోజుల్లోపు ఈ జీవోలపై కౌంటర్ వేయాలని నోటీసులు జారీ చేసిందని తెలిపారు. సర్వోన్నత న్యాయస్థానం నెల రోజులే గడువు ఇచ్చినా మంత్రులు తొమ్మిది నెలల తరువాత నోటీసులకు సమాధానం చెప్పారని ఆమె విమర్శించారు. దీనిని బట్టి కోర్టులంటే ప్రభుత్వానికి ఎంత గౌరవం ఉందో అర్థం అవుతుందన్నారు.

మంత్రులు జవాబిచ్చేందుకు తొమ్మిది నెలల జాప్యం చేసినప్పుడు కూడా.. ప్రభుత్వం దర్యాప్తునకు సహకరించడం లేదని సీబీఐ చెప్పకపోవడంలోని అంతర్యం ఏమిటని పద్మ ప్రశ్నించారు. ‘అసలు జగన్‌ను ఏ ప్రాథమిక ఆధారాలున్నాయని అరెస్టు చేశామని సీబీఐ చెప్పిందో అవి ఎక్కడినుంచి వచ్చాయి? ప్రభుత్వం సహకరించకుంటే సీబీఐ ఆ ఆధారాలను సృష్టించిందా? జగన్‌కు శిక్ష పడదగ్గ ఆధారాలు ఎలాగూ సీబీఐ వద్ద లేవు కనుక అలాంటి ఆధారాలను సృష్టించే వరకూ ఆయనను జైల్లోనే ఉంచేందుకు కొత్త ప్రణాళికను రచిస్తోందా?’ అని నిలదీశారు. అసలు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారందరూ ద్రోహులే అన్న విధంగా సీబీఐ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ను జైల్లో పెట్టి ఎనిమిది నెలలైనా, ఇంతవరకు దర్యాప్తులో ఒక్క ఆధారం ఉన్నట్టుగా కూడా తేల్చలేకపోయిందని, దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో కూడా చెప్పలేని పరస్థితుల్లో ఉందని తెలిపారు. ‘ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, న్యాయం, చట్టాలను విశ్వసించే దేశం మనది. అలాంటి చోట సీబీఐ, కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ కలిసి ఎంత కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నాయో.. సామాన్య ప్రజలకు కూడా అర్థం అవుతోందని ఆమె పేర్కొన్నారు. శంకర్రావుకు కేసు ఎలా వేయాలో చెప్పిందీ, తమ కార్యాలయం నుంచి ఫ్యాక్స్‌లు పంపిందీ టీడీపీయేనని తెలిపారు. 

జగన్ జైలు నుంచి బయటకు వస్తే తమ పార్టీ ఉనికి ఉండదనే భయంతో.. ఆయనను శాశ్వతంగా జైల్లో ఉంచాలనే కుట్రకు టీడీపీ పాల్పడుతోందని పద్మ చెప్పారు. ఇవే కేసులకు సంబంధించి ఇతర నిందితులు బెయిల్ పిటిషన్లు వేసుకుంటే సీబీఐ కనీసం వ్యతిరేకించలేదన్నారు. ‘గత ఎమర్జెన్సీ రోజుల్లో మధు దండావతే, జయప్రకాష్ నారాయణ్, జార్జి ఫెర్నాండెజ్, కుల్దీప్ నయ్యర్ వంటి వారందరినీ జైల్లో పెట్టారు. కనీసం మీకు బెయిల్ అడగడానికి కూడా అర్హత లేదని ఆనాడు సుప్రీంకోర్టు జడ్జిలు తీర్పునిచ్చారు. ఆ జడ్జిలే కొందరు పదవి నుంచి దిగి పోయాక తాము చేసింది తప్పని అంగీకరించారు. ఇక్కడా అలాంటి పరిస్థితే వస్తుంది. ఇంత అన్యాయంగా అక్రమంగా కుమ్మక్కు రాజకీయాలతో 18 నెలలుగా ఇష్టానుసారం దర్యాప్తు జరుపుతున్నారంటే ఇది అప్రకటిత ఎమర్జెన్సీ కాదా?’ అని పద్మ ప్రశ్నించారు. దేశ ప్రజలు ఆనాడు ఎమర్జెన్సీ అనంతరం ఎలాంటి తీర్పునైతే ఇచ్చారో తెలుగు ప్రజలు కూడా రాష్ట్రంలో కచ్చితంగా అలాంటి తీర్పే ఇస్తారని ఆమె చెప్పారు.
Share this article :

0 comments: