మైనారిటీలో పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రక్షించేందుకే టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్రలు చేస్తూ కాలయాపన చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ బహిష్కృత చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం.రాజేష్ ఆరోపించారు. చంచల్గూడ జైల్లో వున్న వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆయన సోమవారం ప్రత్యేక ములాఖత్లో కలిశారు. ఈ సందర్భంగా ఆయన జైలు వద్ద మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్కు చెందిన 9 మంది ఎమ్మెల్యేలను బర్తరఫ్ చేస్తున్నట్లు పీసీసీ చీఫ్ వెల్లడించినప్పటికీ మైనారిటీలో పడిన ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టకుండా చంద్రబాబు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు చేపట్టిన వస్తున్నా మీకోసం యాత్ర ఎవరికోసమో ముందుగా ప్రజలకు స్పష్టంచేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఆ యాత్ర ప్రజల కోసమా? లేక కాంగ్రెస్ కోసమా? అనేది చెప్పాలన్నారు. ఎమ్మెల్యేలను అమ్ముకోవటం, కొనటం చంద్రబాబుకే అలవాటని ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పారు. మహానేత వైఎస్ఆర్ కుటుంబానికి అండగా నిలిచేందుకే తమ పదవులను త్యాగం చేసి జగన్తో జతకడుతున్నామే తప్ప టీడీపీలా తాము కాంగ్రెస్కు అమ్ముడు పోలేదన్నారు. జగన్ కాంగ్రెస్లో ఉండి వుంటే కేంద్ర మంత్రో... రాష్ర్ట ముఖ్యమంత్రో... అయి ఉండేవారంటూ కేంద్రమంత్రి ఆజాద్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. జగన్ కాంగ్రెస్ను వీడినందుకే జైలుపాలు చేశారన్నది ప్రజలకు తెలుసునని చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడి విశ్వసనీయతతో కూడిన విలువలతో రాజకీయానికి కొత్త అర్థం చెప్పిన ఏకైక నాయకుడు జగన్ మాత్రమేనన్నారు. రాష్ట్ర ప్రజలందరూ జగన్కు అండగా ఉన్నారని ఆయన తెలిపారు. జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన వ్యాపారవేత్త పి.శ్రీనివాస్రెడ్డి జగన్ను కలిసినవారిలో ఉన్నారు.
0 comments:
Post a Comment