ముందు పంచాయితీ ఎన్నికలు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ముందు పంచాయితీ ఎన్నికలు!

ముందు పంచాయితీ ఎన్నికలు!

Written By news on Tuesday, February 19, 2013 | 2/19/2013

ఆ తర్వాతే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు!
ముందుగా కాల పరిమితి ముగిసింది మండల, జిల్లా పరిషత్‌లకే
అయినా తొలుత పంచాయతీ ఎన్నికల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు
పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయి
ఎవరు గెలిచినా అధికార పార్టీ తన ఖాతాలో వేసుకోవచ్చనే ఈ ఎత్తుగడ
బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 60.55 శాతం రిజర్వేషన్లు అమలు
అన్ని కేటగిరీల్లోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్
జూన్, జూలై నెలల్లో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం!

సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపడంతో ప్రభుత్వం ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మొగ్గుచూపుతోంది. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు రాష్ట్రంలో మొదటి నుంచీ పార్టీ రహితంగానే జరుగుతున్నాయి. పార్టీ రహిత ఎన్నికల వల్ల ఎవరు గెలిచినా అధికార పార్టీ తన ఖాతాలోనే జమ చేసుకునే అవకాశం ఉన్నందున ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లనున్నట్లు సమాచారం.

ఇంతకుముందు జరిగిన మూడు పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు 60.55 శాతం (బీసీ 34%, ఎస్సీ 18.30%, ఎస్టీ 8.25%) అమలయ్యాయి. సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రకారం ఈ రిజర్వేషన్లతోనే ఇప్పుడు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అన్ని కేటగిరీల్లోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు. 2011లో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ప్రకటించలేదు. రిజర్వేషన్ల సైకిల్ 2006తో (1995, 2001, 2006) ముగిసింది. దీంతో మళ్లీ రిజర్వేషన్ సైకిల్ ప్రారంభమవుతుంది. ఇప్పుడు జిల్లాలవారీగా రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. ఇది పూర్తి చేసి జూన్, జూలై నెలల్లో పంచాయతీ ఎన్నికలు జరిపే అవకాశముంది.

రాష్ట్రంలో 21,750 గ్రామ పంచాయతీలు, దాదాపు 16 వేల ఎంపీటీసీ స్థానాలు, 1,097 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. సాధారణంగా రాష్ట్రంలో మండల, జిల్లా పరిషత్ ఎన్నికల తరువాత పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తుంటారు. 2011లో కూడా మండల, జిల్లా పరిషత్‌ల కాల పరిమితే ముందుగా ముగిసింది. ఆ ఏడాది జూలైలో వీటి కాలపరిమితి ముగియగా, ఆగస్టులో పంచాయతీల కాలపరిమితి ముగిసింది. 2011లో మండల, జెడ్పీ ఎన్నికలకు ప్రభుత్వం రిజర్వేషన్ల నోటిఫికేషన్ జారీచేసింది. వీటిపై హైకోర్టు స్టే విధించింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఎన్నికలకు అడ్డంకులు తొలగిపోయాయి. ప్రభుత్వం మాత్రం ముందుగా పంచాయతీ ఎన్నికలు జరపాలని భావిస్తోంది. పార్టీ రహితంగా జరిగే ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా అధికార పార్టీ తన ఖాతాలో వేసుకుని మెజారిటీ పంచాయతీలు తామే గెలిచామని చెప్పుకోవచ్చు. సోమవారం సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తరువాత రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డి పంచాయతీరాజ్ కమిషనర్ రాంగోపాల్‌తో ఎన్నికల నిర్వహణపై చర్చించారు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీలకూ పార్టీ రహిత ఎన్నికలే!
పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు కూడా పార్టీ రహితంగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. అవసరమైతే ప్రస్తుతమున్న విధానంలో మార్పులు చేసుకొనే వీలుందని సీనియర్ మంత్రి ఒకరు తెలిపారు. సీఎంతో మంత్రులు, అధకారుల సమావేశం తరువాత దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.

మారిపోనున్న రిజర్వేషన్లు
ఈసారి పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల ముఖచిత్రం మారిపోనుంది. మేజర్ పంచాయతీలు, వాటికి అనుబంధంగా ఉన్న పలు గ్రామాలను మునిసిపాలిటీలుగా మార్చడంతో రిజర్వేషన్లలోనూ మార్పులు వస్తాయి. 130పైకి పైగా పంచాయతీలు మునిసిపాలిటీల పరిధిలోకి వెళ్లడంతో ఎంపీటీసీల డీలిమిటేషన్ జరగనుంది. ఈ పంచాయతీల్లో ఉండే జనాభా పట్టణ ప్రాంతాల పరిధిలోకి రావడంతో, పంచాయతీల్లో జనాభా తగ్గిపోతుంది. దీని ప్రభావం జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ రిజర్వేషన్ల పైన కూడా పడుతుంది. రాష్ట్రం యూనిట్‌గా మండల, జిల్లా పరిషత్, జెడ్పీటీసీ రిజర్వేషన్లు అమలు చేయడంవల్ల ఈ మార్పు తప్పదు. 2001 జనాభా లెక్కల ఆధారంగానే పంచాయతీరాజ్ అధికారులు డీలిమిటేషన్, రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. నెల రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Share this article :

0 comments: