ఆత్మీయ అతిథి ఆగమనంతో పలనాడు ప్రజానీకం పులకించింది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆత్మీయ అతిథి ఆగమనంతో పలనాడు ప్రజానీకం పులకించింది

ఆత్మీయ అతిథి ఆగమనంతో పలనాడు ప్రజానీకం పులకించింది

Written By news on Monday, February 25, 2013 | 2/25/2013

ఆత్మీయ అతిథి ఆగమనంతో పలనాడు ప్రజానీకం పులకించింది... గుండెనిండుగ అభిమానం ఉప్పొంగగ సాదర స్వాగతం పలికింది... జననేత సోదరి షర్మిలమ్మను చూసేందుకు సకల నేత్రాలు స్వాగత పత్రాలు అవుతున్నాయి. ఆమె నడిచే దారిలో అడుగులో అడుగేస్తూ.. అభిమానం చెరగని ముద్రలు వేస్తోంది. చెల్లెమ్మకు మద్దతు తెలుపుతూ ప్రతి గొంతు నినదిస్తోంది. నాన్న ఆకాంక్షలు.. అన్న ఆశయాలను భుజానికెత్తుకుని పాదయాత్రగా నడిచి వస్తోన్న ఆ పాదచారికి పలనాడు బ్రహ్మరథం పడుతోంది. మాటకు కట్టుబడే త త్వం కలిగిన పలనాటి ప్రజానీకం.. విశ్వసనీయతకు మారుపేరైన వైఎస్సార్ కుటుంబంపై తమ అపార అభిమానాన్ని చాటుతోంది. ప్రజాహితం కోసం చేపట్టిన పాదయాత్రకు ప్రణామం చేస్తోంది. వెన్నంటి నడుస్తోంది.. వెన్నుదన్నుగా నిలుస్తోంది. మనసులోని బాధలన్నీ ఆమెతో పంచుకుంది.. ఆమె పలుకులతో సాంత్వన పొందుతోంది.

సాక్షి ప్రతినిధి గుంటూరుఅవ్వా..మీకు పించన్ వస్తుందా..అమ్మా.. మీ ఊళ్లో కరెంట్ ఎన్ని గంటలు ఉంటుందిఅన్నా..మనూళ్లో రైతుల పరిస్థితి ఎలా ఉంది..అంటూ దాచేపల్లి మండలంలో ఆదివారం కొనసాగిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎవరిని కదిలించినా, ఏమి అడిగినా ఒకటే జవాబు.. ఈ ప్రభుత్వంలో మా సమస్యలు తీరవు. జగనన్నముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ రాజన్న రాజ్యం వస్తుంది. మా సమస్యలు తీరిపోతాయి.

దాచేపల్లి మండలంలోని శ్రీనగర్ గ్రామం నుంచి ఆదివారం ఉదయం 10 గంటలకు షర్మిల పాదయాత్ర ప్రారంభమైంది. ఆమె బసచేసిన ప్రాంతంలో అప్పటికే వేల సంఖ్యలో గుమికూడి ఎదురుచూస్తున్న నాయకులు, కార్యకర్తలు, అబిమానులు వెంటరాగా షర్మిల తన పాదయాత్ర కొనసాగించారు. కార్యకర్తల కేరింతలు, జయజయధ్వానాలు హోరెత్తగా వేగంగా అడుగులు వేస్తూ కార్యదీక్షతో సాగారు.తనకు ఎదురు పడిన ప్రతి అమ్మను, ప్రతి చెల్లిని, ప్రతి అన్నను పలకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. షర్మిల రాకతో ఆయా గ్రామాలు పరవశించాయి. మహిళలతో కర చాలనాలు చేస్తూ ముందుకు సాగిన షర్మిలపై శ్రీనగర్‌లో పూలవర్షం కురి సింది. గ్రామంలో దివంగత మహానేత వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన షర్మిల శ్రీనగర్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు.

గామాలపాడులో ఘన స్వాగతం..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి స్వగ్రామం గామాలపాడులో షర్మిలకు ఘన స్వాగతం లభించింది. పల్నాటి చరిత్రను ప్రతిబింబిస్తూ ప్రధాన పల్నాటి నాయకుల వేషధారణలతో కళాకారులు షర్మిలను కలిశారు. నాగళ్లు చేతబూనిన రైతులు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం గ్రామంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న షర్మిల మహిళలతో ముచ్చటించారు. గ్రామంలో సమస్యలను, మహిళలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి అడిగారు. అనంతరం షర్మిల తన పాదయాత్రను నారాయణపురం గ్రామం వరకు కొనసాగించి రైల్వేస్టేషన్ రోడ్డు సమీపంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు, వి ద్యార్థినులు, రైతులతో సమస్యలపై చర్చించారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ తాను చేస్తున్న పాదయాత్రలో ఎవరిని కదిలించినా ఎన్నో సమస్యలు చెబుతున్నారని, ప్రజల సమస్యలు పరిష్కరించటంలో ఈ సర్కార్ ఘోరంగా విఫలమైందని విమర్శించారు. 

వైఎస్ మరణంతో అభివృద్ధి తిరోగమనం.. 
నారాయణపురం గ్రామంలో ప్రజలు చెప్పిన సమస్యలను ప్రస్తావిస్తూ ఈ సమస్యలు ఈ ఒక్క గ్రామానికే పరిమితం కాలేదని రాష్ర్టంలోని ఏ గ్రామంలో చూసినా ఇలాంటి సమస్యలు కనిపిస్తూనే ఉన్నాయని షర్మిల చెప్పారు. కరెంట్ ఉండటం లేదు...నీళ్లు లేవు..పొలాలు పండటం లేదు..రైతులకు గిట్టుబాటు ధరలే లేవు...ఇన్ని సమస్యల మధ్య ప్రజలు నలిగిపోతుంటే పట్టించుకోకుండా ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందని, ప్రతి పక్ష నాయకుడిగా ఈ సమస్యలను ఎండగట్టాల్సిన చంద్రబాబు ప్రభుత్వంతో కుమ్మకై దోస్తీ చేస్తున్నాడని విమర్శించారు. వైఎస్ హయాంలో ఏ రైతును కదిలించినా బాగున్నామంటూ సమాధానం చెప్పే వారని, ఇప్పుడు ఏ రైతును కదిలించినా అన్నీ కష్టాలే ఏకరువుపెడుతున్నారన్నారు. 

బాధలు తట్టుకోలేక రైతుల పొలాలను, ఒంట్లోని కిడ్నీలను అమ్ముకునే దుస్థితి దాపురించిందన్నారు. వైఎస్ హయాంలో ఏ నాడూ కరెంట్, గ్యాస్, ఆర్టీసీ చార్జీలను పెంచలేదని, అభివృద్ధి మాత్రం గణనీయంగా జరిగిందన్నారు. కానీ మహానేత మరణం తర్వాత రాష్ర్టం అభివృద్ధిలో పన్నెండేళ్ళ వెనుకకు వెళ్లిందన్నారు. రాష్ర్టంలో ఇన్ని సమస్యలు తాండవిస్తుండగా సీఎం మాటలు కోటలు దాటుతున్నాయని, ఆరున్నర లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టించి 30 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ ప్రగల్బాలు పలుకుతున్నారని షర్మిల దుయ్యబట్టారు. జైలులో ఉన్నా జగనన్న ధైర్యం ఏ మాత్రం సడలలేదని, ఏ తప్పు చేయని జగనన్న త్వరలోనే ప్రజల ఆశీర్వాదంతో బయటకు వచ్చి రాజన్న ఇచ్చిన ప్రతి మాటను నేరవేరుస్తారని, రాజన్న కన్న ప్రతి కలనూ నెరవేరుస్తారని షర్మిల హామీ ఇచ్చారు. 

నారాయణపురంలో సభ అనంతరం షర్మిల దాచేపల్లి మీదుగా కేశానుపల్లి గ్రామానికి తన పాదయాత్రను కొనసాగించి అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బసలో విశ్రమించారు. సోమవారం కేశానుపల్లి గ్రామం నుంచి తక్కెళ్ళపాడు గ్రామం వైపుగా షర్మిల పాదయాత్ర కొనసాగనుంది. షర్మిల పాదయాత్రలో పాల్గొన్న ప్రముఖుల్లో వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, టూర్ ప్రొగ్రాం కో ఆర్డినేటర్ తలసిల రఘురాం, పార్టీ కేంద్ర నిర్వాహక మండలి సభ్యుడు ఆర్కే, కేంద్రపాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి, అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, గుంటూరు జిల్లా పార్టీ పరిశీలకుడు పి.గౌతంరెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జిల్లా యువజన విభాగం కన్వీనర్ కావటి మనోహర్‌నాయుడు, పార్టీ గుంటూరు నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి, పార్టీ నాయకులు యెనుముల మురళీధర్‌రెడ్డి, చింతాసుబ్బారెడ్డి, సాయిబాబా, అన్నబత్తుని సదాశివరావు, జానీబాషా, చిట్టా విజయభాస్కరరెడ్డి, దేవళ్ళ రేవతి, మండపూడి పురుషోత్తం, షేక్ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: