చంద్రబాబు పాలనకు ఇది కొనసాగింపు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు పాలనకు ఇది కొనసాగింపు

చంద్రబాబు పాలనకు ఇది కొనసాగింపు

Written By news on Thursday, February 28, 2013 | 2/28/2013


‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘1999లో ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొన్ని వాగ్దానాలు చేశారు. మహిళలకు బంగారు మంగళ సూత్రాలు ఇస్తానన్నారు. పుట్టిన ప్రతి ఆడబిడ్డకూ రూ.5 వేలు డిపాజిట్ చేస్తామని, ఆ ఆడబిడ్డ చదివినంత వరకు ఉచితంగా చదివిస్తామనిమాట ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు.. కరెంటు బిల్లుల వసూళ్ల కోసం పల్లెల మీద పడ్డారు. ప్రత్యేక పోలీసు స్టేషన్లు పెట్టి రైతులను చిత్ర హింసలు పెట్టారు. ఇంట్లో మగవాళ్లు లేకపోతే మహిళలను తీసుకొని పోయి పోలీసు స్టేషన్లలో కూర్చోబెట్టారు. ఈ అవమానం భరించలేక... అప్పుల బాధలు తట్టుకోలేక నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంత మంది నా అక్కా చెల్లెమ్మల మంగళ సూత్రాలు తెంపిన పాపం ఈ చంద్రబాబు నాయుడుది.

ఇప్పుడున్న కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన కూడా చంద్రబాబు మాదిరిగానే ఉంది. ఇది చంద్రబాబు పాలన రెండో భాగం. కరెంట్ బిల్లులు కట్టడానికి తాళిబొట్లు తాకట్టుపెట్టాల్సి వస్తోందని మహిళలు వాపోతున్నారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కైన చంద్రబాబు వైఖరికి నిరసనగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర బుధవారం గుంటూరు జిల్లా మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో సాగింది. పేటసన్నెగండ్ల గ్రామ శివారులోని సమీప తోటల్లో మిరపకాయలు ఏరుతున్న రైతులు, కూలీలు షర్మిలను చూసి పరుగు పరుగున వచ్చారు.

‘అమ్మా... కరెంటు బిల్లు కట్టలేకున్నామమ్మా... రెండు నెలలకు కలిపి రూ. 6 వేలు వచ్చింది.. నిన్నయితే అర గంట కూడా కరెంటు లేదమ్మా... బిల్లు కట్టకపోతే పోలీసు స్టేషన్లకు పిలిపించి నిలబెడుతున్నారు. రైతు బతికి లాభం లేదమ్మా.. ఇంత పురుగుల మందు తాగి చావడమే మేలు’’ అని జూలకల్లు గ్రామానికి చెందిన పాశం శ్రీనివాసరెడ్డి కన్నీళ్లు పెట్టారు. అక్కడే ఉన్న రైతుకూలీలు నాలనాగమ్మ, వెంకట లక్ష్మి కల్పించుకొని ‘మా కాపురాలకు నిప్పు పెట్టడానికే కిరణ్‌కుమార్‌రెడ్డి వచ్చాడు. కరెంటు బిల్లు కట్టాలంటే తాళిబొట్లు తాకట్టు పెట్టాల్సి వస్తోంది’ అంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా షర్మిల పై వ్యాఖ్యలు చేశారు.

వైఎస్‌తోనే నా భాగ్యం పోయింది..
పెద్ద అగ్రహారం గ్రామానికి చెందిన గాదెబోయిన వెంకట కోటయ్య అనే రైతు తన పొలంలోని పసుపు మొక్కలను షర్మిలకు చూపిస్తూ.. ‘‘అమ్మా... నాన్నగారు ఉన్నప్పుడు కూడా పసుపు పెట్టిన, నాడు క్వింటాల్ రూ. 16 వేలు పలికింది. రాజశేఖరరెడ్డితోనే నా భాగ్యం, కాలం రెండూ పోయాయి. ఇప్పుడు క్వింటాల్ పసుపునకు రూ. 4 వేలకు మించి లేదమ్మా.. ఎకరానికి రూ. 1.10 లక్షలు ఖర్చు చేసి నాలుగు ఎకరాలు పెట్టినా. కరెంటు రోజుకు మూడు గంటలు కూడా రాదు. డబ్బులు పెట్టి తడి పెట్టుకున్నా. ఎకరాకు 15 క్వింటాళ్ల పసుపు వెళ్తుంది. రూ. 60 వేలు వస్తాయమ్మా... మిగిలిన రూ. 50 నష్టపోయినట్టే.. రూ. 3 వడ్డీకి అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టినా. మొత్తం రూ. 2 లక్షలు నష్టపోయా. సర్కారు ఆదుకోకుంటే ఆత్మహత్య తప్ప ఇంకో దారిలేదమ్మా’’ అని వాపోయాడు. అధైర్య పడొద్దని, జగనన్న త్వరలోనే వస్తారని షర్మిల ఆయనకు ధైర్యం చెప్పారు.

బుధవారం 76వ రోజు ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర కారంపూడి శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి పేటసన్నెగండ్ల, జూలకల్లు గ్రామాల మీదుగా సాగి పందిరివారి పాలెం చేరింది. ఇదే గ్రామం శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి షర్మిల రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. బుధవారం మొత్తం 13.7 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఇప్పటివరకు మొత్తం 1,072.9 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ కారంపూడి చేరుకొని పాదయాత్రలో ఉన్న షర్మిలను కలిసి పలకరించారు. యాత్రలో షర్మిల వెంట నడిచిన నేతల్లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మర్రి రాజశేఖర్, జంగా కృష్ణమూర్తి, ఆర్‌కే, అంబటి రాంబాబు, తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, నన్నపునేని సుధ, దేవళ్ల రేవతి, పి.గౌతంరెడ్డి, బండారి సాయిబాబు మాదిగ ఉన్నారు.

రాజు మంచివాడైతే...
జూలకల్లులో జరిగిన రచ్చబండలో షర్మిల మాట్లాడుతూ.. ‘‘పాలించే రాజు మంచివాడైతే.. దేవుని దయకూడా ఉంటుంది. వర్షాలు సకాలంలో పడతాయి. పంటలు పండుతాయి. వైఎస్సార్ సువర్ణపాలనలో వర్షాలకు కొదవలేదు.. పంటలు బాగా పండాయి. రైతన్నలకు మద్దతు ధర పలికింది. ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయిన తరువాత మన రాష్ట్రాన్ని ఈ పాలకులు నాశనం చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో ప్రజలు ఎలా కష్టాలు, కన్నీళ్లు పెట్టారో ఇప్పుడు రాష్ట్రంలో మళ్లీ అలాంటి పరిస్థితులే వచ్చాయి.

పంటకు గిట్టుబాటు ధర లేక, చేసిన అప్పులు పూడక రైతులు భూములను అమ్ముకుంటున్నారు. మరి కొంత మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిన్న ఇదే జిల్లాలో అప్పుల బాధ తట్టుకోలేక ఓ పత్తి రైతు అత్మహత్య చేసుకున్నాడని విన్నా.. ఈ పాలకులకు రైతన్న గోడు పట్టడం లేదు. వీళ్లు పదవులు కాపాడుకోవడానికి ఢిల్లీ చుట్టూ తిరగడమే సరిపోతోంది. వీళ్ల చొక్కా పట్టుకొని నిలదీయాల్సిన చంద్రబాబు ఆ పని చేయట్లేదు. ప్రజలు ఏమైపోయినా ఫర్లేదనుకుంటున్నారు. అందుకే అవిశ్వాసం పెట్టడం లేదు. తన అవినీతి ఆరోపణల మీద ఏ విచారణా రాకుంటే చాలు అనుకుంటున్నారు’’ అని దుయ్యబట్టారు.

జగనన్న వస్తారు... రైతును రాజుగా చూస్తారు..
‘‘రైతన్నలకు భరోసా ఇచ్చి మళ్లీ చెప్తున్నా.. మళ్లీ మంచి రోజులు వస్తాయి. జగనన్న త్వరలోనే బయటికి వస్తారు. రైతును రాజుగా చూసుకుంటారు. రాజన్న ఇచ్చిన ఉచిత విద్యుత్తును కొనసాగిస్తారు. అప్పుడు 9 గంటల ఉచిత విద్యుత్తు అందుతుంది. అప్పుల నుంచి మీకు విముక్తి కల్పించి, వడ్డీ లేని రుణాలు అందిస్తారు. అంతవరకు మీరు ఓపిక పట్టండి. దయచేసి ఏ ఒక్కరూ కూడా విలువైన మీ భూములను అమ్ముకోవద్దన్నా.. అంతకంటే విలువైన మీ ప్రాణాలను తీసుకోవద్దన్నా’’ అని షర్మిల రైతులను కోరారు
Share this article :

0 comments: