ఖమ్మంలో పదిసీట్లు గెలవాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఖమ్మంలో పదిసీట్లు గెలవాలి

ఖమ్మంలో పదిసీట్లు గెలవాలి

Written By news on Thursday, February 14, 2013 | 2/14/2013

- పార్లమెంటు సీటు కూడా: వైఎస్ విజయమ్మ
- వైఎస్సార్‌సీపీలో చేరిన ఖమ్మం నేతలు

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలంతా కలిసికట్టుగా పనిచేసి ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలను, ఒక లోక్‌సభ నియోజకవర్గాన్ని గెలిపించాలని పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, ప్రముఖ పారిశ్రామికవేత్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం పార్టీలో చేరిన సందర్భంగా తన నివాసంలో కార్యకర్తలను ఉద్దేశించి విజయమ్మ మాట్లాడుతూ పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరూ తాము ఎదుగుతూ పార్టీకి గౌరవం తెస్తూ ముందుకు సాగాలన్నారు. ఏవైనా పొరపొచ్చాలు ఉంటే వాటన్నింటినీ పక్కన బెట్టాలని, పార్టీ శ్రేణులు ఐకమత్యంగా పనిచేయాలని ఆమె కోరారు. 

అంతకుముందు ఆ ఇద్దరు నేతలూ ఉదయం 10.15 గంటలకు పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి నివాసంలో ఆయన సమక్షంలో సభ్యత్వాన్ని తీసుకున్నారు. తెలంగాణ జిల్లాల్లోనే ఖమ్మం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అగ్రగామిగా ఉండేలా అన్ని సీట్లనూ వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తామని తాటి వెంకటేశ్వర్లు అన్నారు. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వైఎస్ ఆశయాల సాధనకు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న కృషికి ప్రభావితుడనై తానూ అందులో పాలుపంచుకోవాలని పార్టీలో చేరానని చెప్పారు. జిల్లా పార్టీ అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ పువ్వాడ అజయ్ ఆధ్వర్యంలో వారు పార్టీలో చేరారు. సీజీసీ సభ్యుడు డి.రవీంద్రనాయక్‌తో పాటు ఖమ్మం జిల్లా పార్టీ స్టీరింగ్ కమిటీ సభ్యులు, మండల కన్వీనర్లు, ఇతర ముఖ్య నేతలు సుమారు 250 మంది ఈ సందర్భంగా హాజరయ్యారు.

వైఎస్సార్‌సీపీలో తుని మాజీ మున్సిపల్ చైర్మన్ చేరిక
తుని మాజీ మున్సిపల్ చైర్మన్ కూసుమంచి శోభారాణి బుధవారం ఉదయం వై.ఎస్.విజయమ్మను కలిసి ఆమె సమక్షంలో పార్టీలో చేరారు. వై.ఎస్ ఆధ్వర్యంలో తాను మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని, అవి ముందుకు సాగించాలనే ఉద్దేశంతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరానని ఆమె అన్నారు. తుని నియోజకవర్గం పార్టీ నాయకుడు తాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో ఆమె పార్టీలో చేరారు. లోవ దేవస్థానం చైర్మన్ లాలం బాబ్జి, స్థానిక బీసీ నాయకుడు మాకినీడు గంగారాం కూడా పార్టీలో చేరారు. విజయమ్మ వీరందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Share this article :

0 comments: