కుట్రలు, కుమ్మక్కుల ‘సహకారం’ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కుట్రలు, కుమ్మక్కుల ‘సహకారం’

కుట్రలు, కుమ్మక్కుల ‘సహకారం’

Written By news on Tuesday, February 19, 2013 | 2/19/2013

ముగిసిన సహకార డెరైక్టర్ల ఎన్నికల ప్రహసనం 
తారస్థాయిలో అధికార దుర్వినియోగం
గుప్పెడు డీసీసీబీలు.. గంపెడు అపకీర్తి
ఫలితాలపై కాంగ్రెస్‌లో అంతర్మథనం
యథాప్రకారం కాంగ్రెస్‌తో టీడీపీ చెట్టపట్టాలు

సాక్షి, హైదరాబాద్:ఓటర్ల నమోదు ప్రక్రియ నుంచే మొదలైన అధికారిక కుట్రలు, ప్రతిపక్ష కుమ్మక్కులతో మెజారిటీ జిల్లా సహకార బ్యాంకు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీల అధ్యక్ష పీఠాలను కాంగ్రెస్ పార్టీ దక్కించుకోనుంది. ఈ ‘సహకార’ ఎన్నికలు అధికార దుర్వినియోగానికి, కుట్రలకు, కుంతంత్రాలకు, ప్రధాన ప్రతిపక్ష పార్టీ దివాళాకోరు కుమ్మక్కులకు ప్రతీకగా రాష్ట్ర చరిత్రలో కలకాలం నిలిచిపోతాయి. ఎలాగైనా రాష్ట్రంలో మూడో రాజకీయ పార్టీ వేళ్లూనుకోకూడదన్న ఏకైక ధ్యేయంతో కాంగ్రెస్, టీడీపీ పాల్పడ్డ నిస్సిగ్గు కుమ్మక్కు రాజకీయాల పర్యవసానంగా వైఎస్సార్, ఖమ్మం మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్ తన మద్దతుదారులను డెరైక్టర్లుగా గెలిపించుకోగలిగింది. 

తద్వారా గుప్పెడు డీసీసీబీలను చేజిక్కించుకున్నా, గంపెడు అపకీర్తిని కూడా ఈ ఎన్నికల ద్వారా పార్టీ మూటగట్టుకుందన్న వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. కడప జిల్లా ప్రజలు మాత్రం అధికార పార్టీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలకు పాల్పడినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులనే గెలిపించుకున్నారు. కడపలోనైతే స్వయంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబే ఫోన్ చేసి మరీ పోటీలో ఉన్న తెలుగుదేశం అభ్యర్థిని కాంగ్రెస్‌కు అనుకూలంగా పోటీ నుంచి ఉపసంహరింపజేసినా ఫలితం దక్కలే దు. ఇక విశాఖలో 15 మంది టీడీపీ అభ్యర్థుల్లో ఏకం గా 14 మంది కాంగ్రెస్ మద్దతుదారులకు ఓట్లేశారు!

కుట్రలను భగ్నంచేసిన కడప
కడప జిల్లాలో 77 ప్రాథమిక సహకార సంఘాలుండగా కేవలం 54 స్థానాలకే ఎన్నికలు నిర్వహించారు. వాటిలోనూ ‘డిఫాల్ట్’ కింద 18 సంఘాలను ఎన్నికలకు దూరం చేశారు. ఇలా అడుగడుగునా వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల గెలుపును దెబ్బ తీసేందుకు ప్రయత్నించినా చివరకు 36 మందిలో కూడా మెజారిటీ సభ్యులు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులే గెలుపొందారు. డీసీసీబీ ఎన్నికల్లో బీ-గ్రూపు ఓటర్ల కోసం అధికార పార్టీ నేతలు ఎంతగా వెంపర్లాడినా అందులోనూ పై చేయి సాధించలేకపోయారు. దాంతో కొందరు సభ్యులను కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి అనుచరులు కిడ్నాప్ చేశారు. ఇదే సమయంలో డీసీసీబీ డెరైక్టర్ స్థానానికి జిల్లా టీడీపీ నేత రెడ్డెం వెంకట సుబ్బారెడ్డి సోదరుడు నామినేషన్ వేశారు. కాంగ్రెస్‌కు అనుకూలంగా పక్కకు తప్పుకోవాల్సిందిగా జిల్లా టీడీపీ నేతలు సూచించినా ఆయన వినకపోవడంతో బాబే నేరుగా ‘లైన్’లోకి వచ్చి మరీ ఆయనను విరమింపజేశారు. ఇన్ని కుట్రలకు తోడు, సోమవారం ఎన్నికల రోజు కూడా పోలీసుల అండతో భయోత్పాతాన్ని సృష్టించేందుకు వీరశివారెడ్డి ప్రయత్నించారు. ఈ అధికార, ప్రతిపక్ష కుట్రలన్నింటినీ భగ్నం చేస్తూ 14 స్థానాలకు గాను ఎనిమిదింటిని వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు గెలుచుకున్నారు.

సిగ్గుచేటుగా చిత్తూరు రాజకీయం: ఇక ముఖ్యమంత్రి కిరణ్, విపక్ష నేత చంద్రబాబుల సొంత జిల్లా చిత్తూరు రాజకీయం మరింత సిగ్గుచేటుగా సాగింది. జిల్లాలో కాంగ్రెస్‌కు దీటుగా బరిలో నిలిచిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల్లో పలువురిని నామినేషన్ వేయకుండా నానారకాలుగా అడ్డుకున్నారు. డీసీసీబీ స్థానం కాంగ్రెస్‌కు ఏకగ్రీవమయ్యేలా విపక్ష టీడీపీ సహకరించింది. అందుకు ప్రతిగా డీసీఎంఎస్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులెవరూ నామినేషన్ వేయకుండా, ఆ స్థానం టీడీపీకి దక్కేలా చేశారు. ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు టీడీపీ అధికారికంగా ప్రకటించినప్పటికీ డీసీఎంఎస్‌లో ఆ పార్టీ మద్దతుదారులే గెలవడం కుమ్మక్కుకు పరాకాష్టగా చెప్పుకోవచ్చు. ప్రింటింగ్ ప్రెస్ సహకార ఎన్నికల్లో ఐదు డెరైక్టర్ స్థానాలతో కాంగ్రెస్ అధికారాన్ని దక్కించుకుంది. ఇక కర్నూలు ఎన్నికంతా ఏకపక్షంగానే జరిగిపోయిం ది. డీసీసీబీ కాంగ్రెస్‌కు ఏకగ్రీవం కాగా, డీసీఎంఎస్ లో టీడీపీ నాలుగు డెరైక్టర్ స్థానాలను దక్కించుకుంది. 10 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందింది.
Share this article :

0 comments: