పాదయాత్రలో షర్మిల వద్ద పల్లె ప్రజల ఆవేదన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పాదయాత్రలో షర్మిల వద్ద పల్లె ప్రజల ఆవేదన

పాదయాత్రలో షర్మిల వద్ద పల్లె ప్రజల ఆవేదన

Written By news on Saturday, February 16, 2013 | 2/16/2013

పాదయాత్రలో షర్మిల వద్ద పల్లె ప్రజల ఆవేదన
పెరిగిన ధరలతో బతుకు భారంగా మారిందని కన్నీళ్లు..
వైఎస్సార్ పోయాక తమను పట్టించుకున్న వాళ్లే లేరని మండిపాటు
రోజుకు రెండు గంటలే కరెంటా? ఇదెక్కడి న్యాయం?: షర్మిల
చంద్రబాబు గారూ.. ప్రజల గోడు మీకు వినిపిస్తోందా?
ఇప్పటికైనా ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి గద్దె దించండి
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శుక్రవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 67, కిలోమీటర్లు: 972.4

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘ఆఖరి వాన కురిసి ఐదు నెలలు దాటింది.. పంటల సంగతి దేవుడెరుగు.. ఊళ్లలో మనుషులు తాగడానికి.. అడవి మీద పశువులు తాగడానికి కూడా నీళ్లు లేవు.. రోజుకు రెండు గంటలకు మించి కరెంటు రాదు. మోటారు నుంచి నీళ్లు దునికి మడికి పారకముందే మళ్లీ కరెంటు పోతది.. పొద్దంతా కష్టం చేసి ఇంటికి పోయి పడుకుందామంటే దోమల మోత.. వైఎస్సార్ పోయిన తరువాత మా బతుకంతా చీకట్లే’’ అని ముకుందాపురం గ్రామానికి చెందిన రాములమ్మ ఆవేదన వ్యక్తం చేసింది.

‘‘మా మహిళా సంఘం తరఫున బ్యాంకు నుంచి రూ.3 లక్షలు అప్పు తీసుకున్నాం. మూడేళ్ల నుంచి అప్పు కడుతున్నాం. ఇంకా రూ.1.66 లక్షల అప్పుంది. నెల నెలా వడ్డీ కట్టించుకుంటున్నారు. పావలా వడ్డీ అని చెప్తున్నారు కానీ రూ.3 వడ్డీ దాకా లెక్కొస్తోంది..’’ ముకుందాపురం గ్రామానికే చెందిన నాగమణి గోడు వెళ్లబోసుకుంది.

‘‘అక్కా పరీక్షలు దగ్గర పడ్డాయి. చదువుకుందామంటే రాత్రి కరెంటు ఉండటం లేదు.. ఫీజు రీయింబర్స్‌మెంటు ఇంత వరకు రాలేదు. ఫీజులు కడితేనే హాల్ టికెట్లు ఇస్తామని యాజమాన్యం చెప్తోంది. అమ్మ వాళ్లను ఫీజు అడిగితే.. చూస్తున్నావుగా బిడ్డా పంట చేతికి రాలేదు. ఫీజు ఎట్టా కట్టాలే అంటున్నారు. భయం వేస్తోందక్కా..’’ అని నిడమనూరుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని చంద్రకళ కళ్లనీళ్లు పెట్టుకుంది.

ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన పాదయాత్ర శుక్రవారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో సాగింది. నిడమనూరు, ముకుందాపురం గ్రామాల్లో నిర్వహించిన రచ్చబండల్లో రాములమ్మ, నాగమణి, చంద్రకళ ఇలా తమ గోడు చెప్పుకొన్నారు. వీరే కాదు.. పాదయాత్రలో రోజూ ఏ పల్లెకు వెళ్లి పలకరించినా ఇవే కష్టాలు! ఎవరిని కదిలించినా.. ఇవే కన్నీళ్లు. ఏ రైతు ముఖం మీదా చిరునవ్వు లేదు. ఏ మహిళ నోటి నుంచీ ప్రభుత్వాన్ని మెచ్చుకున్న మాట లేదు. నిడమనూరు, ముకుందాపురం గ్రామాల్లో జరిగిన రచ్చబండల్లోనూ ప్రజలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పెరిగిన ధరలతో తమకు బతుకే భారంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజల సమస్యలు విన్న షర్మిల.. జనాన్ని గాలికొదిలేసిన పాలకులపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకొని మోస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మండి పడ్డారు. రోజుకు రెండు గంటలే కరెంటు ఇస్తారా? ఇదెక్కడి న్యాయం? అంటూ పాలకులను నిలదీశారు. ఈ ప్రసంగాల సారాంశం ఆమె మాటల్లోనే..

చంద్రబాబూ మీకు వినిపిస్తోందా?

‘‘చంద్రబాబు గారూ.. వీళ్ల మాటలు మీకు వినిపిస్తున్నాయా? ప్రజల కన్నీళ్లు మీకు కనిపిస్తున్నాయా? ఇక ఆపండి.. పాదయాత్రల పేరుతో మీరు చేస్తున్న డ్రామాలు ఆపండి. మీరు అవసరం వస్తే అవిశ్వాసం పెడతానని అంటున్నారు. ఈ ప్రజల అవసరాలు మీకు కనిపించడం లేదా? మీకు ప్రజల మీద ప్రేమ కంటే కుర్చీ మీద మమకారమే ఎక్కువ. అందుకే అవిశ్వాసం పెట్టకుండా.. వచ్చే ఎన్నికల్లో ఓటేసేముందు గుర్తుంచుకోవాలంటూ పాదయాత్ర డ్రామాలాడుతున్నారు. మీరు అవిశ్వాసం పెట్టడం లేదు కాబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం మీపై కేసులు పెట్టదు.. విచారణ జరపదు. ప్రజలు ఎటు పోయినా వీళ్లకు అవసరం లేదు.

ఇది బాబు పాలనే..

రాష్ట్రంలో పత్తి రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. పత్తి వేస్తే రైతన్న కష్టం పోనూ క్వింటాల్‌కు రూ. 5 వేల ఖర్చు వస్తోంది. కానీ మార్కెట్‌లో పత్తి మద్దతు ధర రూ. 3,900కు మించలేదు. తరుగు, దళారుల మోసం తీసేస్తే రైతన్న చేతికి వస్తుంది కేవలం రూ. 2,500లే. అప్పుల బాధలు పడలేక రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక్క పత్తి రైతులే కాదు.. టమాటా, మిర్చి.. వరి సాగు చేసే ప్రతి రైతూ కన్నీళ్లు పెడుతున్నారు. రైతులు పంటలు చేతికి రాక, పండిన పంటకు గిట్టుబాటు ధర లేక అప్పుల పాలయ్యారు. ఆదుకునే నాథుడు లేకఅల్లాడిపోతున్నారు. విత్తనాల ధరలు, ఎరువుల ధరలు పెంచారు. రైతు మద్దతు ధరనేమో దించారు. ఇవే కష్టాలు, కన్నీళ్లను చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో చూశాం.. ఆయన హయాంలో దాదాపు 4 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన కూడా చంద్రబాబు పాలనను తలపిస్తోంది. ఇది చంద్రబాబు నాయుడి పాలన రెండో భాగం.’’

వైఎస్ హయాంలో రూ.12 వేల కోట్ల రుణమాఫీ..

ఇప్పుడైతే రైతులకు కూడా కరెంటు బిల్లులు ఇస్తున్నారు. ఆ బిల్లులు కట్టకపోతే మోటార్లు, స్టార్టర్లు ఎత్తుకు పోతున్నారు. అమ్మా ఇదెక్కడి అన్యాయం అంటున్నారు రైతులు. వైఎస్సార్ అధికారంలోకి రాగానే రూ.1,300 కోట్ల విద్యుత్తు బకాయిలను రద్దు చేశారు. 7 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తానని మాటిచ్చి.. ఇచ్చి చూపించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి బతికే ఉంటే ఈ రోజు విద్యుత్తు చార్జీలు పెరిగేవే కాదు. వైఎస్ విత్తనాల ధరలను దించారు.. ఎరువుల ధరలు పెరగనివ్వలేదు. మద్దతు ధర కల్పించారు. వైఎస్సార్ రైతులను గౌరవించారు.. ప్రేమించారు.. అందుకే రైతన్నలు బాగుపడాలని రూ. 12 వేల కోట్ల రుణాలనుమాఫీ చేశారు. కానీ ఇప్పుడున్న ఆ సర్కారుకు పెద్దమనసు లేదు. మహిళలైతే తమ పిల్లలను స్కూల్‌కు పంపించకుండా తమ వెంట పనులకు తీసుకొని పోతున్నారు. ఎందుకక్కా అని అడిగితే ‘కూలికి తీసుకొని పోతే కూలి డబ్బులు వస్తాయి కదమ్మా.. కనీసం రెండు పూటలైనా తింటాం’ అని చెప్తున్నారు. ‘ఒక రోజంతా కూలి చేస్తే రోజుకు 100 రూపాయలు వస్తాయి. నెల రోజులు కష్టం చేస్తే 3,000 రూపాయలు వస్తాయి.. పెరిగిపోయిన నిత్యావసర వస్తువుల ధరలకు ఈ డబ్బులు ఎలా సరిపోతాయమ్మా.. మేం ఎలా బతకాలమ్మా’ అని అంటున్నారు.

విద్యార్థులు చదువులు నిలిపేస్తున్నారు..

పేదోళ్లు పెద్ద చదువులు చదవాలని, ప్రతి ఇంటి నుంచి డాక్టరో.. ఇంజనీరో.. కలెక్టర్ లాంటి పెద్ద ఉద్యోగాలు చేయాలనే ఆలోచనతో వైఎస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంటు పథకాన్ని అమల్లోకి తెచ్చారు. ఆయన ఉన్నంత కాలం విద్యార్థుల ఫీజులను ఆయనే చూసుకున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత ఫీజు రీయింబర్స్‌మెంటు పథకాన్ని ఏం చేశారు? విద్యార్థి ఫీజులో రెండు వాటాలు తల్లిదండ్రులు భరిస్తే... ఒక వాటా మేం ఇస్తామని విద్యార్థులను ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. ఫీజులు కట్టలేక విద్యార్థులు మధ్యలోనే నిలిపేస్తున్నారు.’’

‘మరో ప్రజాప్రస్థానం’ 67వ రోజు శుక్రవారం నల్లగొండ జిల్లా అలీనగర్ గ్రామ శివారు నుంచి షర్మిల యాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి వెంకటేశ్వర నగర్, నిడమనూరు, నర్సింహుల గూడెం, బీకే తాండా, బొక్కముంతలపాడు గ్రామాల మీదుగా ముకుందాపురం చేరుకున్నారు. గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 7 గంటలకు చేరుకున్నారు. శుక్రవారం మొత్తం 14.8 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఇప్పటి వరకు మొత్తం 972.4 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు కేకే మహేందర్, జిట్టా బాలకృష్ణారెడ్డి, బీరవోలు సోమిరెడ్డి, గట్టు శ్రీకాంత్, బాలమణెమ్మ, స్థానిక నాయకులు బండారు మోహన్‌రెడ్డి, గాదె నిరంజన్, విరిగినేని అంజయ్య, ఇరిగి సునీల్ కుమార్, మల్లు రవీందర్‌రెడ్డి, సూరపల్లి సత్యకుమారి తదితరులు యాత్రలో పాల్గొన్నారు.
Share this article :

0 comments: