Home »
» అత్యంత బాధాకరం: విజయమ్మ
అత్యంత బాధాకరం: విజయమ్మ
ఉగ్రవాదుల చర్యలను రాజకీయాలకు అతీతంగా అందరూ ఖండించాలని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షులు విజయమ్మ కోరారు. హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్ రద్దీ ప్రాంతంలో గురువారం రెండుచోట్ల ఉగ్రవాదులు బాంబు పేలుళ్లకు పాల్పడిన ప్రాంతాన్ని విజయమ్మ, పలువురు పార్టీ నేతలతో కలిసి వెళ్లి పరిశీలించారు. ఈ సంఘటనపై ఆమె స్థానికులను, ప్రత్యక్ష సాక్షులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడే ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఈ ఘటన వల్ల భారీగా ప్రాణనష్టం జరిగినట్టు తెలుస్తోందని, ఇది అత్యంత బాధాకరమైన ఘటనని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి సంఘటన పట్ల ప్రజలంతా సంయమనం పాటించి ధైర్యంగా ఉండాలని కోరారు. ఉగ్రవాదుల దుశ్చర్యలకు సంబంధించి రెండు రోజుల కిందటే కేంద్రం హెచ్చరించినట్టు వార్తలొస్తున్నాయని, ఇలాంటి సమాచారం అందినప్పుడు ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరించి జాగ్రత్త పడాల్సిందని అభిప్రాయపడ్డారు. సంఘటనలో గాయపడ్డ క్షతగ్రాతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అనంతరం ఆమె ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించి, వారి బంధువులను ఓదార్చారు. మృతి చెందినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. విజయమ్మతో పాటు పార్టీ నాయకులు ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి, ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాప్రెడ్డి, ట్రేడ్ యూనియన్ కన్వీనర్ బి.జనక్ప్రసాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కోఆర్డినేటర్ రాజ్ఠాకూర్, హైదరాబాద్ జిల్లా కన్వీనర్ ఆదం విజయ్కుమార్ తదితరులున్నారు.
|
|
0 comments:
Post a Comment