రాష్ట్రంలో సామాన్యులు దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తూ నామమాత్రంగా బతుకుతున్నారని సినీ నటుడు, హీరో శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ చంచల్గూడ జైలులో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డిని ప్రత్యేక ములాఖత్లో కలిశారు. అనంతరం జైలు బయటకు వచ్చిన శ్రీహరి అక్కడే మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలు నాణ్యమైన జీవనం సాగించాలంటే కుమ్మక్కు రాజకీయాలు తెలియని నాయకుడు అవసరమన్నారు.
అలాంటి మంచి లక్షణాలున్న గొప్ప నాయకుడు జగన్మోహన్రెడ్డి మాత్రమేనన్నారు. వైఎస్సార్కుమారుడిగా మాట తప్పని, మడమ తిప్పని గుణం ఆయన సొంతమన్నారు. మహానేత రాజశేఖరరెడ్డి ప్రభుత్వం రాకముందు...రాష్ట్రంలో పల్లెలు ఎలా కన్నీరు పెట్టాయో ప్రస్తుతం అదే దుస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. ఈ కన్నీటిని తుడిచే గొప్ప మనసున్న నాయకుడు జగన్మోహన్రెడ్డి మాత్రమేనన్నారు. ఆయనకు మద్దతు పలికేందుకే ఆయన్ను కలిశానని, ఆయన చేపట్టే ప్రతీ కార్యక్రమంలో తన సహకారం ఉంటుందని చెప్పారు. విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ వైఎస్ ఉన్నపుడూ ఎలాంటి పదవులూ ఆశించకుండా తాను ఆయనవెంట నిస్వార్థంగా పనిచేశానన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలా? లేక ప్రచార బాధ్యతలు చేపట్టాలా? అనే విషయాలను జగన్ నిర్ణయాలకే వదిలేసినట్లు తెలిపారు. త్వరలో ఘనంగా పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. శ్రీహరి వెంట వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన అధ్యక్షుడు పుత్తా ప్రతాప్రెడ్డి ఉన్నారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ రంగారావులు కూడా శుక్రవారం జగన్మోహన్రెడ్డిని కలిశారు.
0 comments:
Post a Comment