గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి మరో గట్టిషాక్ తగిలింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ వైస్ చైర్మన్, ప్రస్తుత బోర్డు సభ్యుడు జంపన ప్రతాప్ శుక్రవారం చంచల్గూడ జైలులోవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలుసుకుని వైఎస్సార్ కాంగ్రెస్లో చేరే అంశాన్ని చర్చించారు. ప్రస్తుతం ప్రతాప్ కంటోన్మెంట్ 3వ వార్డు సభ్యుడిగా, ఆయన భార్య విద్యావతి 1వ వార్డు సభ్యురాలిగా కొనసాగుతున్నారు. జంపనకు కంటోన్మెంట్, సికింద్రాబాద్, కూకట్పల్లి నియోజకవర్గాల్లో బలమైన అనుచరవర్గం ఉండటంతో పాటు, కంటోన్మెంట్లో ఆయన ఆయా పార్టీలను గెలుపోటములను శాసించే స్థాయిలో బలమైన నాయకుడిగా ముద్రపడ్డారు. ప్రతాప్ త్వరలో ముఖ్య అనుచరులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించారు.
జగన్ను కలిసిన డాక్టర్ మధుశేఖర్
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కు చెందిన డాక్టర్ మధుశేఖర్ శుక్రవారం వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని జైల్లో ములాఖత్లో కలుసుకున్నారు. ‘చేయూత’ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడైన ఆయన.. తొలుత టీడీపీలో పని చేశారు. తర్వాత సినీనటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పీఆర్పీ తరఫున ఆర్మూర్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొంటున్నారు. ప్రస్తుతం డాక్టర్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్(డాట్స్) కో కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు. మూడు రోజుల్లో అధికారికంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
0 comments:
Post a Comment