ఈ సీఎంకు చంద్రబాబే ఆదర్శం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఈ సీఎంకు చంద్రబాబే ఆదర్శం

ఈ సీఎంకు చంద్రబాబే ఆదర్శం

Written By news on Monday, April 8, 2013 | 4/08/2013

మరో ప్రజాప్రస్థానంలో షర్మిల మండిపాటు
బాబుకు స్వప్రయోజనాలు తప్ప ప్రజా సమస్యలు పట్టవు
తన పాలనలో పల్లెలను పిప్పి చేశారు
ఇప్పుడు అవే గ్రామాల వెంట తిరుగుతున్నారు
ఈ ప్రజా వ్యతిరేక సర్కారుకు అండగా ఉన్నారు
నాడు మామను.. నేడు అసెంబ్లీ సాక్షిగా ప్రజలను వెన్నుపోటు పొడిచారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ ఆదివారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 114, కిలోమీటర్లు: 1,552.1

 ‘‘ఈ ప్రభుత్వం వైఎస్సార్ రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చింది కానీ ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న ప్రభుత్వం కాదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి.. వైఎస్సార్‌ను ఏమాత్రం అర్థం చేసుకోలేదు. చంద్రబాబునాయుడు ఆయనకు ఆదర్శం. ఈ ప్రభుత్వానికి చంద్రబాబే ముఖ్య సలహాదారు...’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నిప్పులు చెరిగారు. చంద్రబాబుకు కావాల్సింది స్వప్రయోజనాలేనని, ప్రజలు ఏమైపోయినా ఆయనకు పట్టదని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆదివారం కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలోని పల్లెల్లో కొనసాగింది. నక్సలైటు ఉద్యమ నాయకుడు కొండపల్లి సీతారామయ్య సొంతూరు జొన్నపాడు గ్రామ ప్రజలు షర్మిలకు ఆత్మీయ స్వాగతం పలికారు. ఇదే గ్రామంలో షర్మిల రచ్చబండ కార్యక్రమం నిర్వహించి మహిళలు, రైతుల సమస్యలు విన్నారు. వారితో మాట్లాడారు. షర్మిల ఏమన్నారో ఆమె మాటల్లోనే..

ఇది బాబు పాలనకు కొనసాగింపు.. 

‘‘చంద్రబాబు హయాంలో వర్షాల్లేక.. పంటలు పండక తొమ్మిదేళ్ల కరువొచ్చింది. సాయం చేసేవారు లేక లక్షలాది మంది ఇళ్లను వదిలి పొట్టకూటి కోసం ఎక్కడెక్కడికో వలసలు పోయారు. అప్పుల బాధలు తట్టుకోలేక వేలాది మంది రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు అదే పరిపాలన మళ్లీ వచ్చింది, చంద్రబాబు పాలనకు కొనసాగింపుగా కిరణ్‌కుమార్‌రెడ్డి పరిపాలన సాగుతోంది. చంద్రబాబు తన హయాంలో రైతులను పురుగులను చూసినట్లు చూశారు. వ్యవసాయం దండగన్నారు. ప్రాజెక్టులు కడితే నష్టం వస్తుందని పిచ్చి లెక్కలు వేసి చూపించారు. వేలకు వేలు కరెంటు బిల్లులు వేసి రైతులను, పల్లెలను పీల్చి పిప్పి చేసిన ఆయన ఇప్పుడు ‘వస్తున్నా మీకోసం’ అంటూ పల్లెల వెంట తిరుగుతున్నారు. 

పాదయాత్ర చేస్తున్నారు కదా..! ప్రజా సమస్యలు అర్థం చేసుకుంటారు.. రైతులకు, రైతు కూలీలకు అండగా నిలబడతారని అనుకున్నాం. ప్రజా సమస్యలు పట్టని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి కూలగొడతారని అనుకున్నాం. కానీ ఆయనకు ప్రజా ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలే ముఖ్యం. ఆయనకు కావాల్సింది రాజకీయాలు. ఆయన ఏ పని చేసినా రాజకీయంగానే ఆలోచన చేస్తారు. ఎంతటి నీచానికైనా దిగజారుతారు. రైతులు ఏమైపోయినా ఆయనకు పట్టదు. ఆ రోజు అధికారం కోసం పిల్లనిచ్చిన సొంత మామనే వెన్నుపోటు పొడిచారు. ఈరోజు తన అవినీతి పనుల మీద సీబీఐ విచారణ తప్పించుకోవడానికి అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు నాయుడే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భుజానికెత్తుకొని మోస్తున్నారు. ఆయన పాదయాత్ర ప్రజల కోసం కాదు. ఆయన కోసం.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రక్షించడం కోసం...’’

ఆదివారం 114వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం కేంద్రంలోని ఏలూరు రోడ్డు నుంచి ప్రారంభమైంది. షర్మిల మొత్తం 6 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 1552.1 కి.మీ యాత్ర పూర్తయ్యింది. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో ఎమ్మెల్యే కొడాలి నాని, కుక్కల నాగేశ్వర్‌రావు, ఎంవీఎస్ నాగిరెడ్డి, మాజీ మంత్రులు జ్యోతుల నెహ్రూ, కటారి ఈశ్వర్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే ముసునూరు రత్నబోసు తదితరులున్నారు.


పాదయాత్రకు నేడు విరామం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అమ్మమ్మ సోమమ్మ కన్నుమూయడంతో షర్మిల కడపకు బయలుదేరి వెళ్లారు. దీంతో సోమవారం జరగాల్సిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు విరామం ఇచ్చినట్లు పాదయాత్ర కార్యక్రమ సమన్వయకర్త తలశిల రఘురాం తెలిపారు. పాదయాత్ర మంగళవారం తిరిగి ప్రారంభమవుతుందని చెప్పారు. ఆదివారం ఉదయం పాదయాత్రలో ఉండగానే సోమమ్మ చనిపోయిన విషయం షర్మిలకు తెలిసింది. అయినా ఆమె మధ్యాహ్న భోజన విరామ సమయం వరకు యాత్రను కొనసాగించారు. జొన్నపాడులో రచ్చబండ నిర్వహించారు. పుట్టపాడు గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన భోజన విరామ కేంద్రం నుంచి మధ్యాహ్నం 2 గంటలకు కడపకు బయల్దేరారు. ఆదివారం రాత్రి 10.20గంటలకు ఆమె కడపకు చేరుకొని సోమమ్మ పార్థివదేహానికి నివాళులు అర్పించారు.
Share this article :

0 comments: