దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం త్రేతాయుగంలో రామునిగా, ద్వాపరయుగంలో కృష్ణునిగా భగవంతుడు అవతారాలెత్తినట్లు పురాణాలు చెబుతున్నాయి. రాజరిక వ్యవస్థలో దైవాంశ సంభూతులుగా కొనియాడబడిన వ్యక్తులే రాజులుగా, పరిపాలకులుగా చలామణీ అయ్యారు. ప్రజల బాగోగులు, కష్టసుఖాలు తెలుసుకుని, వారి అవసరాల్ని తీర్చి ప్రజారంజకంగా పాలించారు.
తర్వాత వచ్చిన కలియుగంలో కొంతకాలంపాటు రాజుల, సామంతరాజుల వ్యవస్థ కొనసాగి బ్రిటిష్ పాలన అంతమై భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రభుత్వాలు అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే కదా! ప్రపంచంలో ఏ దేశంలో లేనన్ని రాజకీయపార్టీలు మన దేశంలో ఉన్నప్పటికీ భారత రాజ్యాంగ ఆదేశిక సూత్రాలకు అనుగుణంగా, అయిదు సంవత్సరాలకొకసారి సార్వత్రిక ఎన్నికలు నిర్వహించుకుంటూ పంచవర్ష ప్రణాళికలు అమలుపరుస్తూ ప్రజల అవసరాల్ని తీరుస్తూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు మన ప్రజాప్రతినిధులు. అయితే ప్రణాళికల ద్వారా దేశం అభివృద్ధి చెందినప్పటికీ ధనికులు, పేదల మధ్య అంతరాల్ని తగ్గించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి.
ప్రజాస్వామ్యంలో ఆర్థిక అసమానతలు తొలగించటం అంత తేలిక కానప్పటికీ పేదప్రజల కనీస అవసరాల్ని తీర్చటం ప్రజాప్రభుత్వాల బాధ్యతగా, కర్తవ్యంగా భావించి సంక్షేమ కార్యక్రమాల అమలు ద్వారా వారి జీవన ప్రమాణాల్ని మెరుగుపరిచి సమాజంలో పేదలు సైతం తలెత్తుకుని తిరిగే పరిస్థితుల్ని కల్పించే రాజకీయనాయకులు అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైననేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలతో మమేకమై వారి కనీస అవసరాల్ని గుర్తించి 2004లో అధికారంలోకి వచ్చిన వెంటనే పేదల కనీస అవసరాలైన కూడు, గుడ్డ, గూడు, విద్య, వైద్యం అందించాలన్న పట్టుదలతో ఆకలి బాధ తీర్చాలనే సదుద్దేశంతో రెండు రూపాయలకే కిలో బియ్యం, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రతి నిరుపేదకి పక్కా గృహం, ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా అందరికీ విద్య, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి పేదవానికీ కార్పొరేట్ వైద్యం అందించి అన్నివర్గాల ప్రజల మన్ననలనందుకుని మహాకూటమిని సైతం ధీటుగా ఎదుర్కొని ఒంటి చేత్తో కాంగ్రెస్ పార్టీని వరుసగా రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత వైఎస్సార్ది.
జన్మతః సంపన్న కుటుంబంలో పుట్టినప్పటికీ జీవితాంతం పేదప్రజల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ ప్రజాసేవలోనే తుదిశ్వాస విడిచిన పేదల పక్షపాతి, గొప్ప మానవతావాది వైఎస్సార్. అందువల్లనే ఆయన మరణానంతరం వేలాది విగ్రహాల్ని చందాల ద్వారా నెలకొల్పి దేవతలతో సమానంగా ఆరాధిస్తున్నారంటే పేదప్రజల గుండెల్లో ఆయనకున్న స్థానాన్ని వర్ణించటానికి మాటలు లేవు.
అలాంటి మహనీయుడు ఆకస్మికంగా మరణిస్తే తరువాత వచ్చిన పాలకులు ఆయన ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకి తూట్లు పొడిచి ప్రజలకు ఇబ్బందులు కలుగజేస్తుంటే యువనేత జగన్ కలత చెందారు. తను కాంగ్రెస్లో కొనసాగితే పదవులు లభిస్తాయేమో కాని తండ్రి ఆశయాల్ని కొనసాగించలేననే నిర్ణయానికి వచ్చి కాంగ్రెస్ నుంచి బయటపడ్డారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యత్వాన్ని తృణప్రాయంగా భావించి, రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి, అఖండ మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టించారు. దాదాపు సంవత్సరం నుండి జైల్లో ఉన్నప్పటికీ అన్ని పార్టీలకు చెందిని ప్రజలు, రాజకీయ నాయకులు తండోపతండాలుగా వైఎస్సార్ కాంగ్రెస్లో చేరుతున్నారంటే జగన్పై వారు పెంచుకున్న విశ్వసనీయతే కారణం. అంతటి విశ్వసనీయత, ప్రజాదరణ ఉన్న జగన్ని ప్రజలే నిర్బంధం నుంచి విడిపించుకుంటారు. తమ నాయకుడిగా గెలిపించుకుంటారు.
- శీలం నర్సిరెడ్డి, హైదరాబాద్చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34. e-mail: ysjagankosam@gmail.com
0 comments:
Post a Comment