ఓటమి భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా పక్కనపెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సబబు కాదన్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్రంలో అన్ని జిల్లా పరిషత్, మండల పరిషత్లను వైఎస్సార్ సీపీ కైవసం చేసుకోవడం తథ్యమని జోస్యం చెప్పారు. అలాగే అత్యధికంగా గ్రామ పంచాయతీలను మా పార్టీయే గెలుచుకుంటుందన్నారు. ఈ విషయాలన్నీ తెలిసే కాంగ్రెస్పార్టీ ఎక్కడ తమ పరువు పోతుందోనని స్థానిక ఎన్నికలను వాయిదావేయాలని చూస్తోందన్నారు. ఇప్పటికే గ్రామపంచాయతీల్లో పారిశుధ్య పనులు అస్తవ్యస్తంగా తయారయ్యాయన్నారు.
దీనికితోడు ప్రత్యేక అధికారులు పూర్తిస్థాయిలో గ్రామాల్లో పర్యటించలేకపోతున్నారన్నారు. ఈ కారణంగా గ్రామీణులు ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి వస్తోందన్నారు. కనీసం వీధిదీపాలు కూడా వెలిగించలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరపని కారణంగా కేంద్రప్రభుత్వం నుంచి రావల్సిన రూ. 2,500 కోట్లు ఆగిపోయాయన్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసి భయంతో వణికిపోతూ స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేయాలని మెజార్టీ శాసనసభ్యులు, పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రిలకు విన్నవించుకున్నారని ప్రసన్న చెప్పారు. వీళ్లు ఒక నివేదికతో ఢిల్లీకి వెళ్లి అధిష్టానంతో సంప్రదించి ఏదో ఒక రకంగా స్థానిక సంస్థల ఎన్నికలను నిలుపుదల చేయాలని విశ్వప్రయత్నం చేయడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే కోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు.
0 comments:
Post a Comment