నాడూ.. నేడూ.. బాబు పాలనే ! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నాడూ.. నేడూ.. బాబు పాలనే !

నాడూ.. నేడూ.. బాబు పాలనే !

Written By news on Wednesday, April 10, 2013 | 4/10/2013

* రాష్ట్రంలో విద్యుత్ కష్టాలపై షర్మిల ధ్వజం 
* చంద్రబాబు ఎనిమిదేళ్లలో 8 సార్లు కరెంటు చార్జీలు పెంచారు
* బిల్లులు కట్టలేక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారు
* నాడు ప్రజలకు భరోసా ఇవ్వడానికి వైఎస్ పాదయాత్ర చేశారు..
* రూపాయి భారం వేయకుండా వైఎస్ పాలన సాగించారు
* మళ్లీ కిరణ్ హయాంలో ప్రజలు చంద్రబాబు పాలన చూస్తున్నారు
* మూడింతలు పెరిగిన కరెంటు బిల్లులు కట్టడానికి తాళిబొట్లు అమ్ముకుంటున్నారు
* అధైర్యపడొద్దు.. జగనన్న త్వరలోనే మళ్లీ రాజన్న రాజ్యం తెస్తారుత
* వైఎస్ ప్రజాప్రస్థానం ప్రారంభించి పదేళ్లయిన సందర్భంగా మొక్కలు నాటిన షర్మిల 

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రతినిధి: ‘‘సరిగ్గా పదేళ్ల కిందట 2003లో ఇదే రోజున(ఏప్రిల్ 9న) రాజశేఖరరెడ్డి ప్రజాప్రస్థానం పాదయాత్రను మొదలు పెట్టారు. అప్పుడు సాగుతున్నది చంద్రబాబు పాలన. పేదలను, రైతులను పురుగుల్లా చూస్తూ ఆయన ఒక రాక్షస పాలన సాగించారు. బాబు పాలనలో బతుకుపై భరోసా కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రజలకు ధైర్యం చెప్పడానికి వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. యాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకొని అధికారంలోకొచ్చాక ఆ కష్టాలన్నీ తీర్చడానికి కృషి చేశారు. ఒక్క రూపాయి కూడా భారం వేయకుండా సువర్ణయుగం అందించారు. 

ఆయన మన నుంచి దూరమయ్యాక రాష్ట్రంలో మళ్లీ చంద్రబాబు పాలన మొదలైంది. అసలే కరువుతో అల్లాడిపోతున్న రోజుల్లో చంద్రబాబు ఎనిమిది సంవత్సరాల్లో ఎనిమిది సార్లు కరెంట్ చార్జీలు పెంచితే.. ఈ కిరణ్ కుమార్‌రెడ్డి చార్జీల మీద చార్జీలు పెంచుతూ, సర్‌చార్జీలు వేస్తూ ప్రజలను అష్టకష్టాలు పెడుతున్నారు. ఇప్పుడు కరువు జిల్లాల్లో కరెంటు బిల్లులు కట్టాలంటే.. మంగళసూత్రాలు అమ్ముకోవాల్సిన పరిస్థితి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. జగనన్న త్వరలోనే బయటకు వస్తారని, మళ్లీ రాజన్న రాజ్యం తెస్తారని భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యలు పట్టని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, ఆ ప్రభుత్వానికి రక్షణ కవచంలా నిలిచిన చంద్రబాబు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర మంగళవారం కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో సాగింది. నందివాడ మండలం పుట్టగుంటలో జరిగిన రచ్చబండలో షర్మిల మాట్లాడారు.

వైఎస్ ప్రజాప్రస్థానం ఒక యజ్ఞంలా సాగింది
ఈ సందర్భంగా షర్మిల నాడు రాజశేఖరరెడ్డి పాదయాత్ర సాగిన తీరును గుర్తుచేసుకున్నారు. ‘‘అప్పుడు నాన్న పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు అందరూ బయట బాగా ఎండలు ఉన్నాయని, వాయిదా వేసుకోమని చెప్పారు. కాని అప్పుడు నాన్న ఒక్కటే చెప్పారు. ‘అసలే అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వేసవిలో కరువు మరింత పెరుగుతుంది. ఇంకా కష్టాలు ఎక్కువవుతాయి. ఇంకా ఆత్మహత్యలు పెరుగుతాయి. ఇప్పుడే మనం వెళ్లి ధైర్యం చెప్పాలి. ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి అని చల్లబడ్డాక వెళ్తే ఉపయోగం ఏంటి’ అని అన్నారు. ఒక సుదీర్ఘ పాదయాత్ర చేశారు. మండుటెండలను లెక్క చేయకుండా రోజుకు 25 కిలోమీటర్ల మేర నడిచారు. వైఎస్ ప్రజాప్రస్థానం ఒక యజ్ఞంలా సాగింది. ప్రజల కష్టాలు విని ఆయన తల్లడిల్లిపోయారు. వారికి ధైర్యం చెప్పారు. పాదయాత్రలో వచ్చిన అనుభవాలతో ప్రజలకు ఏం అవసరమో, వారికి ఏం చేస్తే బావుంటుందో తన ఐదేళ్ల పాలనలో చేసి చూపించారు’’ అని షర్మిల అన్నారు.
కరెంటు బిల్లులు మూడురెట్లు పెరిగాయి. 

కరెంట్ బిల్లులు మూడురెట్లు పెరిగాయని, గతంలో రెండు వందలు వచ్చే బిల్లు ఇప్పుడు ఏడెనిమిది వందలు వస్తోందని రచ్చబండలో మహిళలు షర్మిల వద్ద మొరపెట్టుకున్నారు. రోజుకు నాలుగైదు గంటలు కూడా కరెంట్ ఉండటం లేదని బిల్లులు మాత్రం పెద్దమొత్తంలో వస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘మాకు రెండేళ్లుగా పావలా వడ్డీ రావటం లేదు. వడ్డీ లేని రుణాలు అంటూ ఇచ్చారు. తీరా బ్యాంకు పుస్తకంలో మాత్రం మాకు వడ్డీ పడుతుందని అన్నారు. ఇదేమిటని బ్యాంకర్లను అడిగితే డీఆర్‌డీఏ వారిని అడగండని.. డీఆర్‌డీఏ వారేమో బ్యాంకర్లను అడగాలని చెబుతున్నారు. మమ్మల్ని రోడ్డెక్కించి మా జీవితాలతో ఆడుకుంటున్నారు’’ అని పుట్టగుంట మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు.

గ్రూపు రుణాలు కట్టకపోతే మా ఇళ్లకు తాళాలు వేస్తున్నారని మరో మహిళ చెప్పారు. త్వరలోనే మంచి రోజులు వస్తాయని, జగనన్న ముఖ్యమంత్రి అయితే రాజన్న రాజ్యంలో వడ్డీ లేని రుణాలు వస్తాయని షర్మిల వారికి భరోసా ఇచ్చారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు ఉండవని, అందరికీ పక్కా ఇళ్లు వస్తాయని హామీ ఇచ్చారు. జగనన్న సీఎం అయితే వృద్ధులకు, వితంతువులకు రూ.700 చొప్పున, వికలాంగులకు రూ.వెయ్యి చొప్పున పింఛను అందుతుందన్నారు. పిల్లలను స్కూలుకు పంపితే పదో తరగతి వరకు రూ.500 చొప్పున, ఇంటర్‌కు రూ.700 చొప్పున, డిగ్రీకి రూ. వెయ్యి చొప్పున తల్లుల ఖాతాలో వేస్తారన్నారు. అంతకంటే ఎక్కువ చదివితే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉండనే ఉందన్నారు.

మొక్కలు నాటిన షర్మిల
ఈ నెల 7వ తేదీ మధ్యాహ్నం విజయమ్మ అమ్మమ్మ మరణించడంతో ఆమెను కడసారి చూసేందుకు షర్మిల వెళ్లటంతో ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. తిరిగి మంగళవారం మధ్యాహ్నం నందివాడ మండలం నందివాడ సత్రం నుంచి షర్మిల యాత్రను పునః ప్రారంభించారు. అక్కడి నుంచి పుట్టగుంట, పెదలింగాల, అరిపిరాల వరకు మొత్తం 7.7 కిలోమీటర్లు మేర యాత్ర సాగింది. వైఎస్ పాదయాత్ర ప్రారంభించి పదేళ్లయిన సందర్భంగా పుట్టగుంటలో పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డికి చెందిన చేపల చెరువు గట్టుపై రాతి ఉసిరి, మామిడి మొక్కలను షర్మిల నాటారు. 

స్థానికులు ఇచ్చిన వలను చెరువులో విసిరి చేపలు పట్టారు. అంతకుముందు గ్రామంలో అరకిలోమీటరు మేర రోడ్డుపై పూలు పరచి, మహిళా కోలాట బృందంతో గ్రామస్తులు షర్మిలకు ఘనస్వాగతం పలికారు. పుట్టగుంట వద్ద బుడమేరు ఆధునీకరణ పనులను పరిశీలించారు. పాదయాత్రలో ఎమ్మెల్యేలు కొడాలి నాని, పేర్ని నాని, మద్దాల రాజేశ్, నాయకులు ఎంవీఎస్ నాగిరెడ్డి, కుక్కల నాగేశ్వరరావు, మండలి హనుమంతరావు, దూలం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: