జగనన్నతోనే పథకాలకు జీవం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగనన్నతోనే పథకాలకు జీవం

జగనన్నతోనే పథకాలకు జీవం

Written By news on Saturday, April 20, 2013 | 4/20/2013

మరో ప్రజాప్రస్థానంలో షర్మిల భరోసా
రైతులకు, మహిళలకు వడ్డీ లేకుండానే రుణాలు అందుతాయి
అప్పుల ఊబి నుంచి ప్రతి రైతన్నా బయటపడతాడు
పిల్లలను చదివిస్తే అమ్మ ఖాతాలోకే డబ్బులు వస్తాయి
రాజన్న రాజ్యం తెచ్చేలా జగనన్నను ఆశీర్వదించండి
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శుక్రవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 125, కిలోమీటర్లు: 1,688.6

‘‘వైఎస్సార్ రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తుంగలో తొక్కింది. పక్కా ఇళ్ల పథకాన్ని పాడెక్కించారు. ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని ఆసుపత్రికి వెళ్తే ఆ కార్డును చెత్తబుట్టలో వేయాలని ఆసుపత్రి యాజమాన్యం అంటున్నారని నిన్న ఓ తాత బాధపడ్డారు. మరోవైపు ఈ ముఖ్యమంత్రి గారేమో వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామంటూ రూ.కోట్లు ఖర్చు చేసి గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ పల్లెల్లో ఏ మహిళను అడిగినా రుణాలే అందటం లేదని చెప్తున్నారు. మరి ఈ ముఖ్యమంత్రి గారు వడ్డీలేని రుణాలు ఎవరికి ఇస్తున్నట్టు..? ఆమ్మా... అక్కా.. సమయం వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్, టీడీపీలకు గట్టిగా బుద్ది చెప్పి జగనన్నను ఆశీర్వదించిన రోజున రాజన్న రాజ్యం మళ్లీ వస్తుంది. 

రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్సార్ ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకానికి జీవం పోస్తారు..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ప్రజలకు భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో సాగింది. పెనుగంచిప్రోలు మండలం గుమ్మడిదుర్రు గ్రామంలో షర్మిల వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అదే వేదిక మీద నుంచి కాసేపు మాట్లాడారు. అంతకుముందు పాదయాత్రలో తనతో పాటు కదం తొక్కిన మహిళలతో మాట్లాడారు. వారితో షర్మిల ఏమన్నారో ఆమె మాటల్లోనే..

రైతుల కోసం రూ. 3 వేల కోట్లతో నిధి..

జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు, మహిళలకు వడ్డీ లేకుండానే రుణాలిస్తారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర లభించేటట్టు, అవసరమైతే ప్రభు త్వమే పంట కొనుగోలు చేసేలా రూ.3 వేల కోట్లతో ఒక స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారు. ప్రతి రైతు అప్పుల ఊబిలోంచి బయటికి వచ్చి బాగుపడేటట్టు చేస్తారు. మన విద్యార్థుల కోసం మళ్లీ ఫీజు రీయింబర్స్‌మెంట్, పేదల కోసం ఆరోగ్యశ్రీ నిలబెడతారు. వృద్ధులకు రూ.700 పిం ఛన్ అందుతుంది. వికలాంగుల పింఛన్ రూ.1,000 అవుతుంది. అక్కాచెల్లెళ్లు వారి పిల్లలను చదివించేటట్లు ప్రోత్సహించడం కోసం ఇద్దరు పిల్లలకు పదో తరగతి వరకు నెలనెలా ఒక్కొక్కరికి రూ.500 చొప్పున అమ్మ అకౌంట్లోనే డబ్బులు జమవుతాయి. 

ఇంటర్ చదివితే రూ.700, డిగ్రీ చదివితే రూ.1,000 అమ్మ ఖాతాలోనే పడతాయి. అంతకంటే పెద్ద చదువులు చదివే వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ఎలాగూ ఉండనే ఉంది. రాష్ట్రంలో గుడిసె అనేదే లేకుండా ప్రతి నిరుపేదకు పక్కా ఇల్లు కట్టిస్తారు. పేదలు కూడా మళ్లీ ధీమాగా పెద్దాసుపత్రులకు వెళ్లి ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం చేయించుకునే రోజులు వస్తాయి. వైఎస్సార్ హామీ ఇచ్చినట్టు ప్రతి పేద కుటుంబానికి నెలకు 30 కిలోల బియ్యం ఇస్తారు. ఆ రోజు వచ్చేంత వరకు మీరందరూ జగనన్నను ఆశీర్వదించాలని, వైఎస్సార్ పార్టీని బలపరచాలని మా ప్రార్థన.

శనివారం 125వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జొన్నలగడ్డ గ్రామం నుంచి ప్రారంభమైంది. అక్కడ్నుంచి గుమ్మడిదుర్రు మీదుగా అనిగండ్లపాడు శివారు వరకు యాత్ర సాగింది. జొన్నలగడ్డలో షర్మిలను వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కలిశారు. రాత్రి 7.30 గంటలకు అనిగండ్లపాడు శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి షర్మిల చేరుకున్నారు. శ్రీరామనవమి పర్వదినం నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, అభిమానుల కోరిక మేరకు ఉదయం పూట యాత్రను రద్దు చేసినట్లు పాదయాత్ర కో ఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. మధ్యాహ్నం నుంచి యాత్ర ప్రారంభమైంది. శుక్రవారం మొత్తం 8.6 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు మొత్తం 1688.6 కి.మీ యాత్ర పూర్తయింది. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో ఎమ్మెల్యేలు జోగి రమేష్, పేర్ని నాని, జిల్లా పార్టీ కన్వీనర్ సామినేని ఉదయభాను, వాసిరెడ్డి పద్మ, మాజీ మంత్రి వసంత నాగేశ్వర్‌రావు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, స్థానిక నాయకులు వెస్లీ, వేజెండ్ల శివశంకర్ తదితరులున్నారు.
Share this article :

0 comments: