ఆయన ఎంపీ కాదు. ఎమ్మెల్యే కూడా కాదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆయన ఎంపీ కాదు. ఎమ్మెల్యే కూడా కాదు

ఆయన ఎంపీ కాదు. ఎమ్మెల్యే కూడా కాదు

Written By news on Monday, May 20, 2013 | 5/20/2013

 సీబీఐ డెరైక్టర్‌కు మరో లేఖ
* సీబీఐ కేంద్ర ప్రభుత్వం చేతిలోని అస్త్రమే అన్నది సుస్పష్టం.. అందుకే నిబంధనల ప్రకారం దర్యాప్తు సాగడం లేదు..
* కుతంత్రాల వల్ల నేనూ, నా పిల్లలు త్యాగాలు చేయాల్సి వస్తోంది 
* స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఉన్న భారతదేశ పౌరురాలిగా..
* చట్టం ముందు అంతా సమానమేనని నేను నమ్ముతున్నాను
* ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకొని వేధింపులకు పాల్పడరాదన్న సందేశాన్ని మీ జోక్యం ద్వారా ఇవ్వాలని కోరుతున్నాను..

కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలా మారిన సీబీఐ.. తన భర్త వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డిని సార్వత్రిక ఎన్నికల వరకు జైల్లోనే ఉంచేందుకు కుట్ర చేస్తోందని వై.ఎస్. భారతి ఆవేదన వ్యక్తంచేశారు. ఇదంతా రాజకీయ లబ్ధి కోసమే జరుగుతుందన్న విషయంలో ఎలాంటి అనుమానమూ లేదని అన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరుతూ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు ఆమె లేఖ రాశారు. జగన్ కాంగ్రెస్ పార్టీని వీడినందుకే ఆయనపై కుట్ర చేసి కేసులు పెట్టారంటూ.. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను గుర్తుచేశారు.

జగన్‌పై దర్యాప్తు పూర్తి చేయడానికి 2012 అక్టోబర్‌లో 3 నెలలు గడువు కోరిన సీబీఐ.. ఆ గడువు లోపల దర్యాప్తు పూర్తి చేయకపోగా.. 8 నెలల తర్వాత 2013 మేలో మరో 4 నెలల గడువు కోరిందని గుర్తుచేశారు. దీనికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన కాసేపటికే సీబీఐ న్యాయవాది.. 4 నెలల్లో దర్యాప్తు పూర్తి చేసే అవకాశాలు లేవని, తాము మరింత గడువు కోరతామన్నట్లు సంకేతాలిచ్చారని, అసలు దర్యాప్తు పూర్తి చేసే ఉద్దేశమే సీబీఐకి లేదని దీని ద్వారా స్పష్టమవుతోందని ఆమె ప్రధాని దృష్టికి తెచ్చారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవడం ద్వారా పౌరుల హక్కుల కోసం నిలబడిన నేతగా దేశం గుర్తుంచుకునేలా చేయాలని, మూడు దశాబ్దాలుగా దేశానికి, పార్టీకి సేవచేసిన వైఎస్సార్ కుటుంబానికి అన్యాయం జరుగుతున్నా మౌనంగా చూస్తుండిపోయిన నేతగా మిగిలిపోవద్దని భారతి కోరారు. అదే సమయంలో సీబీఐ న్యాయవాది చేసిన వ్యాఖ్యలపై విచారణ జరపాలని కోరుతూ ఆమె సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హాకు లేఖ రాశారు.

- సాక్షి, హైదరాబాద్

మౌనం వీడండి.. న్యాయం చేయండి
ప్రధాన మంత్రి
డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి,
సర్,

ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన ఉపఎన్నికల ప్రచారం చేస్తుండగా 2012 మే 27న నా భర్త వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్టు చేశారు. అప్పటి నుంచీ అంటే ఏడాది కాలంగా ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి మీకు తెలిసిందే. ఓ భర్త కోసం ఎదురుచూస్తున్న భార్యగా, ఓ తల్లిగా నేను మీకు ఈ లేఖ రాస్తున్నాను. మిమ్మల్ని గురుతర బాధ్యతల్ని నిర్వర్తించేందుకు శాయశక్తులా యత్నించే వ్యక్తిగా భావిస్తూ కూడా నేను ఈ లేఖ రాస్తున్నాను. ఈ కేసులో ఇటీవలి పరిణామాలు మా అందరినీ దిగ్భ్రాంతికి, భయభ్రాంతులకు గురిచేస్తున్న నేపథ్యంలో ఈ లేఖ రాయక తప్పడం లేదు. ఈ కేసులో దర్యాప్తు తీరు మమ్మల్ని తీవ్రంగా బాధిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నిబంధనల ప్రకారం జరగడం లేదని స్పష్టంగా తెలుస్తోంది.

వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధించి (ఆర్‌సీ: 19ఏ/2011-సీబీఐ-హైదరాబాద్) గడచిన 22 నెలలుగా దర్యాప్తు సాగుతోంది. ఈ దర్యాప్తు పూర్తి చేయడానికి మూడు నెలల గడువు కావాలని 2012 అక్టోబర్‌లో సుప్రీంకోర్టును సీబీఐ కోరింది. అది జరిగిన 8 నెలల తర్వాత.. అంటే 2013 మే నెలలో బెయిల్ కోసం మేము సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు.. దర్యాప్తు పూర్తి చేయడానికి మరో 4 నెలలు కావాలని సీబీఐ కోరింది. దీంతో దర్యాప్తు పూర్తి చేయడానికి మరో 4 నెలల గడువును సుప్రీంకోర్టు ఇచ్చింది. ఆ తర్వాత మాత్రమే జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ బెయిల్ కోరవచ్చని పేర్కొంది. 

అయితే, తీర్పు వెలువడిన నిమిషాల వ్యవధిలోనే సీబీఐ న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు పూర్తి విరుద్ధంగా వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్దిష్ట కాల పరిమితికి తాము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని, గడువు పొడిగించడానికి అవసరమైన కారణాలు తాము వెతుకుతామని సంకేతాలిచ్చారు. దర్యాప్తును చిత్తశుద్ధితో పూర్తి చేయాలన్న ఆలోచన సీబీఐకి ఏ మాత్రమూ లేదని ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే సీబీఐ పనితీరు ఆత్మ ప్రబోధానుసారం సాగుతోందనిగాని లేదా స్వతంత్రంగా సాగుతోందనిగాని నాకు అనిపించడం లేదు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వీడియో ఫుటేజ్ ఉన్న డీవీడీని ఈ లేఖతో జతచేసి మీకు పంపిస్తున్నాను.

తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్లతో సాగుతున్న సీబీఐ దర్యాప్తునకు సంబంధించి, నా భర్త నిర్బంధానికి సంబంధించి పలు వాస్తవాలను మీ ముందు ఉంచదలిచాను. అవి..

* దర్యాప్తు జరిపిస్తున్న హయాం అంటే.. 2004-09 కాలంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో నా భర్తకు ఎలాంటి సంబంధమూ లేదు. ఆయన ఎంపీ కాదు. ఎమ్మెల్యే కూడా కాదు. ఆ సమయంలో.. అంటే 2001 నుంచి మేము బెంగళూరులో నివసిస్తున్నాం. నిజాయితీ కలిగిన వ్యక్తిగా, ఓ మంచి వ్యాపారవేత్తగా ఆయన పలు ప్రాజెక్టులు మొదలుపెట్టారు. జల విద్యుత్ కేంద్రాల్లో వివేచనతో పెట్టుబడులు పెట్టారు.

* మా మామగారు మరణించిన 15 నెలల తర్వాత, కాంగ్రెస్ పార్టీని జగన్ విడిచిపెట్టిన నెల తర్వాత, ఆ పార్టీ ఎమ్మెల్యే పి.శంకర్రావు.. ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తికి ఓ లేఖ రాశారు. దివంగత వైఎస్సార్‌పైన, జగన్‌పైన ఆ లేఖలో పలు ఆరోపణలు చేశారు. అయితే మా మామగారి ప్రభుత్వంలో ఆయన భాగంగా ఉన్న 6 సంవత్సరాల్లో ఏ రోజూ ఆయన ఈ ఆరోపణలు చేయలేదు. ఆయన లేఖ ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)గా మారిన వెంటనే ఆయనకు రివార్డులు అందాయి. రాష్ట్ర క్యాబినెట్‌లో ఆయన మంత్రి పదవి అందుకున్నారు. ఆ తర్వాత ఆయన పిటిషన్‌లో తెలుగుదేశం పార్టీ ఇంప్లీడ్ అయ్యింది. ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు అని స్పష్టమైంది.

హైకోర్టు తీర్పులో నా భర్త జగన్ 52వ ప్రతివాది. రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వానికి సంబంధించిన ఇతరులు 1 నుంచి 15 వరకు ప్రతివాదులుగా ఉన్నారు. అయితే రాష్ట్రప్రభుత్వం మాత్రం ఉద్దేశపూర్వకంగా స్పందించరాదని నిర్ణయించుకుంది. స్పందించకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నప్పటికీ, జీవించి లేని వ్యక్తిపై దర్యాప్తునకు ఆదేశిస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఆయన మరణించిన 15 నెలల తర్వాత, ఆయన కుమారుడు కాంగ్రెస్ పార్టీని వదిలేసిన తర్వాత ఇది చోటుచేసుకుంది.

* రాష్ట్ర ప్రయోజనాల కోసం తన సహచరులతోపాటు తాను తీసుకున్న నిర్ణయాలను సమర్థించుకోవడానికి మా మామగారు ఇప్పుడు జీవించి లేరు. బాధాకరమైన విషయమేంటంటే.. ఆయన కేబినెట్ సహచరులందరూ ఇప్పుడు జీవించే ఉన్నప్పటికీ, స్వేచ్ఛగా బయట తిరుగుతున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగుతున్నప్పటికీ.. నాడు ప్రభుత్వంతో ఎలాంటి సంబంధమూ లేని నా భర్త మాత్రం జైల్లో మగ్గుతున్నారు. ఆయన ఒక ఎంపీ అయినప్పటికీ కూడా..‘‘దర్యాప్తును ప్రభావితం చేస్తారు’’ అని, ‘‘శక్తిమంతుడు’’ అని సాకులు చెబుతూ ఆయన్ను జైల్లోనే ఉంచుతున్నారు.

* జగన్ ప్రభుత్వంలో లేకపోవడంతో.. ఆ సమయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలకు వివరణ ఇచ్చే స్థితిలో ఆయన లేరు. ప్రస్తుత మంత్రులకు మాత్రం ఆ అవకాశం ఉంది. అయితే ప్రస్తుత ప్రభుత్వం వారి వ్యాజ్యాలకయ్యే ఖర్చులను భరించాలని నిర్ణయించుకోవడం ద్వారా వారికి క్లీన్‌చిట్ ఇచ్చేసింది. మరో విషయమేంటంటే, ప్రభుత్వ బిజినెస్ రూల్స్ ప్రకారమే ఆ జీవోలన్నీ జారీ అయ్యాయంటూ ఆయా మంత్రులు సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు.

* సీబీఐ దర్యాప్తు అధికారి జాయింట్ డెరైక్టర్ ఉద్దేశపూర్వకంగా ఈ కేసును జాప్యం చేస్తున్నారని విశ్వసిస్తున్నాను. నా భర్త నేతృత్వంలోని రాజకీయ పార్టీ ఇదే అంశా న్ని బయటపెట్టింది. నా భర్తకు, పార్టీకి వీలైనంత ఎక్కువగా నష్టం కలిగించేలా ఆయన దర్యాప్తుపై ఏకపక్ష సమాచారాన్ని, నిర్దిష్ట లీకులను ఇచ్చారు. దీనిపై పలువురితోపాటు పార్టీ కూడా నిరసన వ్యక్తంచేసింది. సీబీఐ దురుద్దేశపూరిత వైఖరిపై ఇదివరకే ఫిర్యాదు చేశాం. వ్యతిరేక వార్తలు రాస్తూ నా భర్తకు, ఆయన పార్టీకి శత్రువుల్లా వ్యవహరించే నిర్దిష్ట మీడియా సంస్థలకు జాయింట్ డెరైక్టర్ చేసిన 500కుపైగా ఫోన్ కాల్స్ వివరాల జాబితాను కూడా ఆ ఫిర్యాదుకు జతచేశాం. నా భర్త ప్రతిష్టకు భంగం కలిగించే హక్కు వీరికి ఎవరిచ్చారు?

సాక్షి అనేది నకిలీ ఇన్వెస్టర్లు తప్పుడు మార్గాల్లో సంపాదించిన డబ్బునుదాచుకునేందుకు.. రాత్రికి రాత్రి పుట్టించిన డమ్మీ కంపెనీ కాదు. ప్రారంభమైన ఐదేళ్లలోపే ‘సాక్షి’ 1.43 కోట్ల మంది పాఠకులను ఆకట్టుకుని.. ఈ రోజు దేశంలోనే ఏడో స్థానంలో నిలిచింది. ఇందులో పెట్టుబడులు పెట్టిన వారందరూ రెండింతలు లాభం పొందారు. వారి వాటా ధ్రువపత్రాలన్నీ కూడా వారి వద్దే ఉన్నాయి. వారికి నచ్చినప్పుడు నచ్చినవారికి తమ వాటాలను అమ్ముకునే స్వేచ్ఛ వారికుంది. రూ. 1,800 కోట్లకు పైగా నష్టాల్లో ఉన్న ‘ఈనాడు’ సంస్థ రూ. 100 విలువైన వాటాను రూ. 5.26 లక్షలకు విక్రయించినప్పటికీ.. ‘సాక్షి’ విలువను ‘ఈనాడు’ విలువలో సగానికే మదింపు చేశారు. అయినప్పటికీ ఇది తప్పన్నట్లు సీబీఐ ప్రశ్నిస్తోంది. వాటాదారులకు లాభాలు తెచ్చిపెట్టినందుకు, 40 వేల మందికిపైగా కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నందుకు నా భర్తను ఏకాకిని చేసి వేధిస్తున్నారన్నది సుస్పష్టం.

* సీబీఐ దర్యాప్తులో ముఖ్యమైన వాన్‌పిక్ ప్రాజెక్టు.. కాల్దర్-హిక్స్ ఎఫిషియెన్సీ సిద్ధాంతానికి(దీని గురించి మీకు బాగా తెలిసి ఉంటుందని నేను భావిస్తున్నాను) అద్దం పడుతోంది. ఇదే ప్రాజెక్టు గురించి మీకు రస్ అల్ ఖైమా ప్రభుత్వం లేఖ రాసింది కూడా. ఆంధ్రప్రదేశ్‌లోని బాగా వెనుకబడిన రెండు జిల్లాలను అభివృద్ధి చేయడానికి ఈ ప్రాజెక్టు దోహదం చేస్తుంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. కాకినాడ పోర్టు, గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టులను చంద్రబాబు నాయుడు ప్రైవేటు వ్యక్తులకు/ప్రభుత్వాలకు ఇచ్చిన ఉదంతాలు ఇంతకు ముందూ ఉన్నాయి. రస్ అల్ ఖైమా చంద్రబాబు హయాం నుంచీ కూడా రాష్ట్రంలో ప్రాజెక్టులు చేస్తోంది.

నేను బ్రిటిష్ పాలనలో లేని, చట్టం ముందు అంతా సమానమని నమ్మే సర్వసత్తాక, స్వతంత్ర భారతదేశంలో జన్మించాను. ఇక్కడ ప్రతి వ్యక్తికీ జీవించే స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు ఉన్నాయని విశ్వసిస్తున్నాను. దేశంలో రాజ్యాంగమే సమున్నతమని, న్యాయం ఉందని, చట్టం ముందు అంతా సమానమేనని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను.

నా భర్తకు ఏ ప్రభుత్వ నిర్ణయాలతోనూ సంబంధం లేదు. ఆయన ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా జీతంగా పొందలేదు. వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పించారు. తన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వాటాదారులకు లాభాలు తెచ్చిపెట్టారు. అలాంటి వ్యక్తిని దర్యాప్తు పేరుతో గత ఏడాది కాలంగా జైల్లో పెట్టారు. ప్రభుత్వంతో సంబంధం లేని ప్రైవేటు వ్యక్తులు అన్న కారణంగా రాబర్ట్ వాద్రా, డింపుల్ యాదవ్‌లపై దర్యాప్తులను నిలిపివేశారు. మరి జగన్‌కు, వారికి తేడా ఏమిటని నేను అడుగుతున్నా. జగన్ కూడా ప్రైవేటు వ్యక్తే అయినప్పుడు ఇలా ఎందుకు వేధిస్తున్నారు? కాంగ్రెస్ పార్టీని వీడినందుకేనా?

సార్వత్రిక ఎన్నికల వరకు నా భర్తను జైల్లోనే ఉంచాలని కేంద్ర ప్రభుత్వం చేతిలోని సీబీఐ భావిస్తోంది. ఇదంతా రాజకీయ లబ్ధి కోసమేనని విశ్వసించడానికి సహేతుక కారణాలు ఉన్నాయి. ఇటీవల కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డితో పాటు మీ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఏడాది కిందట ఎన్డీటీవీలో చర్చ సందర్భంగా కాంగ్రెస్‌కు రాజకీయ అస్త్రాలు ఉన్నాయని వీరప్ప మొయిలీ అన్నారు. అందుకు నేను స్పందిస్తూ.. ఆ అస్త్రాల్లో సీబీఐ కూడా ఉందా అని ప్రశ్నించా. ఈ విషయంలో దేశంలో ఈరోజు ఎవ్వరికీ అనుమానం లేదన్నది వాస్తవం.

దురదృష్టవశాత్తూ, కుటిల రాజకీయాల కారణంగా నేను, నా పిల్లలు త్యాగాలు చేయాల్సి వస్తోంది. తన తండ్రి చనిపోయిన చోట జగన్ ఒక మాటిచ్చారు. ఆ మాటకే కట్టుబడి ముందుకు నడిచారు. తన తండ్రి మరణాన్ని తట్టుకోలే కన్నుమూసినవారి కుటుంబాలకు ధైర్యం చెప్పేందుకు జగన్ ఓదార్పు యాత్ర చేపట్టారు. ఇది కాంగ్రెస్ పార్టీకి నచ్చలేదు. వెంటనే సీబీఐని రంగంలోకి దించింది. జగన్ నిర్ణయానికి మా కుటుంబం మద్దతుగా నిలిచింది. అయితే మా కుటుంబ పెద్దను మాకు దూరంగా ఉంచేందుకు సీబీఐ చేస్తున్న ప్రయత్నాలన్నింటినీ మౌనంగా చూస్తూ నిలవాల్సి వచ్చినందుకు శోకిస్తున్నాం. ఆయన రాజకీయ నేత అయినప్పటికీ.. మాకు ప్రశాంతంగా జీవించే హక్కుంది. తండ్రి సంరక్షణలో పెరిగే హక్కు మా పిల్లలకు ఉంది.

ఈ పరిస్థితుల నేపథ్యంలో మీకు ఒక విన్నపం చేస్తున్నా. ఈ విషయంలో మీరు చొరవ చూపడం ద్వారా న్యాయానికి, సమానత్వానికి దేశం దన్నుగా నిలుస్తుందన్న నమ్మకాన్ని దేశ పౌరులు, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కలిగేలా చేయాలని కోరుతున్నాను. ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకొని వేధింపులకు పాల్పడరాదన్న సందేశాన్ని ఇవ్వాలని కోరుతున్నాను.

సర్, ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. ప్రజల హక్కుల కోసం నిలబడిన నేతగా మిమ్మల్మి ఈ దేశం గుర్తుంచుకునేలా చేయండి. మూడు దశాబ్దాలుగా దేశానికి సేవ చేసిన వ్యక్తికి, మీ పార్టీ కోసం ముందుండి పోరాడిన సైనికుల్లో ఒకరైన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అన్యాయం జరుగుతుంటే మౌనం దాల్చిన వ్యక్తిగా మిగిలిపోకండి.

కృతజ్ఞతలతో...

ఇట్లు
వైఎస్ భారతీరెడ్డి

అశోక్‌భాన్‌కు ఆదేశాలిచ్చిందెవరు?
కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) డెరైక్టర్‌కు వైఎస్ భారతీ రెడ్డి రాసిన లేఖలోని ముఖ్యాంశాలు.

‘‘నా భర్త వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై నమోదైన కేసు (ఆర్.సి 19 ఎ/2011)ను సీబీఐ దర్యాప్తు చేస్తున్న తీరును, దర్యాప్తు క్రమంలో సంస్థ అవలంబిస్తున్న అన్యాయమైన పద్ధతుల్ని, ఈ కారణంగా నా భర్తతో పాటు ఆయనకు ఆప్తులైనవారు ఎదుర్కొంటున్న సమస్యలను మీ దృష్టికి తెచ్చేందుకు ఈ లేఖ రాస్తున్నాను. మీ సంస్థ చేస్తున్న దర్యాప్తు.. కేసులోని వాస్తవాంశాల ఆధారంగా కాకుండా.. మొదట్నుంచీ కొన్ని స్వార్థ ప్రయోజనాలు ఆశిస్తున్న శక్తుల నియంత్రణలో, వారి ప్రేరేపణతో, పూర్తి వివక్షతో కొనసాగుతోందని నేను విశ్వసిస్తున్నా. ఇందుకు బలమైన కారణాలే ఉన్నాయి. ఈ కేసు దర్యాప్తును నాలుగు నెలల్లో పూర్తి చేయాల్సిందిగా ఇటీవల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశించింది. 

ఆ తర్వాత కొద్దిసేపటికే సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలపై ఏమాత్రం గౌరవం లేకుండా మీ న్యాయవాదులు మీడియానుద్దేశించి మాట్లాడారు. కేసు దర్యాప్తులో తాము గడువుకు కట్టుబడి ఉండాల్సిన పని లేదన్నట్టుగా వారు మాట్లాడారు. అంతేకాదు దర్యాప్తు కోసం మరింత సమయం ఎలా కోరాలో కనుగొంటామని కూడా చెప్పారు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ వారు చేసిన ఈ వ్యాఖ్యల వీడియో దృశ్యాలు కలిగిన ఓ డీవీడీని మీ తక్షణ పరిశీలన నిమిత్తం ఈ లేఖకు జత చేస్తున్నాను. నా భర్త గత ఏడాది మే 27వ తేదీ నుంచి జైలు నిర్బంధంలో ఉన్నారు. గత 22 నెలలుగా దర్యాప్తు కొనసాగుతోంది. 2012 అక్టోబర్‌లో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్థాయీ నివేదికలో.. దర్యాప్తు పూర్తి చేసేందుకు 3 నెలల సమయం కావాలని సీబీఐ కోరింది. మళ్లీ ఇదే సుప్రీంకోర్టులో 2013 మార్చి 31 నాటికల్లా తప్పకుండా తుది చార్జిషీటు దాఖలు చేస్తామని సీబీఐ చెప్పింది. 2012 అక్టోబర్ తర్వాత ఎనిమిది నెలలకు 2013 మేలో, బెయిల్ కోసం నా భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు కూడా దర్యాప్తు పూర్తి చేసేందుకు మరో నాలుగు నెలల సమయం కావాలని దర్యాప్తు సంస్థ కోరింది. 

ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్ 2011 ఆగస్టు 17న నమోదైంది. నా భర్త అన్నివిధాలా సహకరించారు. దీంతో దర్యాప్తు ఎలాంటి అవాంతరాలు లేకుండా ముందుకు సాగింది. 2012 మే 7వ తేదీ నాటికే మూడు చార్జిషీట్లు దాఖలయ్యాయి. ఆ తర్వాత అకస్మాత్తుగా 2012 మే 27న.. ఓ పార్టీకి అధ్యక్షుడైన నా భర్త కీలకమైన 18 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఓ లోక్‌సభా నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో ఉండగా అరెస్టు చేశారు. ఆయన్ను అరెస్టు చేసిన సమయం కూడా ఓ పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. అరెస్టు చేసిన సమయం అనుమానాలకు తావిస్తోందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సైతం వ్యాఖ్యానించింది. 

దర్యాప్తు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమనేది సుస్పష్టం. నా భర్తను జైల్లోనే ఉంచాలన్న ఏకైక లక్ష్యంతో కేసు దర్యాప్తులో జాప్యం చేస్తున్నారు. వచ్చే సాధారణ ఎన్నికల వరకు ఆయన్ను జైల్లోనే ఉంచి తన బాసులకు రాజకీయ లబ్ధి చేకూర్చాలన్నదే కాంగ్రెస్ అధీనంలోని సీబీఐ ఉద్దేశంగా కనిపిస్తోంది. ఏదో ఒక నెపంతో నా భర్తకు బెయిల్ రాకుండా చేసేందుకే.. ‘తుది’ చార్జిషీటు వేసేందుకు గడువు పొడిగించాల్సిందిగా ఎప్పటికప్పుడు దర్యాప్తు సంస్థ కోరుతోంది.

దర్యాప్తు అధికారి, సీబీఐ జాయింట్ డెరైక్టర్ ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తుండటాన్ని నా భర్తకు చెందిన రాజకీయ పార్టీ ఎండగడుతూనే ఉంది. ఇతర అంశాలతో పాటు నా భర్తకు, ఆయన పార్టీ ప్రతిష్టకు గరిష్టస్థాయిలో నష్టం వాటిల్లేలా.. దర్యాప్తునకు సంబంధించిన తప్పుడు, ఏకపక్ష సమాచారాన్ని ప్రత్యేకంగా ఎంపిక చేసుకున్న మీడియాకు లీక్ చేయడంపై కూడా నా భర్త పార్టీ ఎప్పటికప్పుడు నిరసన వ్యక్తం చేస్తూనే ఉంది. సీబీఐ దురుద్దేశపూర్వక చర్యలపై మేం గతంలోనే సీవీసీకి ఫిర్యాదు చేశాం. తప్పుడు సమాచారంతో నా భర్త ప్రతిష్టను దిగజార్చడానికి యత్నిస్తున్న పలు మీడియా సంస్థలకు సీబీఐ జేడీ 500 సార్లకు పైగా ఫోన్లు చేయడానికి సంబంధించిన కాల్ లిస్టును కూడా ఆ ఫిర్యాదుతో పాటు సమర్పించాం. 

దర్యాప్తులో కీలకమైన, కింద పేర్కొన్న అంశాలపై విచారణ జరిపించాల్సిందిగా కోరేందుకే ఈ లేఖ రాస్తున్నా.. 
* ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేయడానికి మరో నాలుగు నెలల సమయం పడుతుందంటూ సుప్రీంకోర్టులో చెప్పాల్సిందిగా సీబీఐ న్యాయవాదికి ఆదేశాలిచ్చిందెవరు? నాలుగు నెలల గడువు కోరడానికి ప్రాతిపదిక ఏమిటి? (నా భర్తను జైల్లోనే ఉంచేలా చూసేందుకే అలా సమయం కోరారని నేను గట్టిగా నమ్ముతున్నా..)
* ఈ నెల 9న సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే.. సీబీఐ తరఫున మీడియాతో మాట్లాడాల్సిందిగా, గడువును నిర్ధారిస్తూ ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా ప్రకటనలు చేయాల్సిందిగా మీ న్యాయవాది అశోక్ భాన్‌ను ఆదేశించిందెవరు?

* సుప్రీంకోర్టు చెప్పిన నాలుగు నెలల గడువుకు సీబీఐ కట్టుబడాల్సిన అవసరం లేదని, మరింత గడువును ఎలా కోరాలో కనుగొంటామని చెప్పేలా అశోక్‌భాన్‌కు ఎందుకు ఆదేశాలిచ్చారు? పరస్పర ప్రయోజనాల కోసం దర్యాప్తును జాప్యం చేస్తున్నారనే విషయాన్ని ఇది స్పష్టం చేయడం లేదా?

నా సమస్యలన్నిటినీ సీబీఐలోనే అత్యున్నతాధికారులకు తెలియజేయవచ్చునంటూ నాకందిన సలహా మేరకు.. సీబీఐ డెరైక్టర్ అయిన మీకు ఈ లేఖ రాస్తున్నాను. అంతేగాకుండా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)కున్న పర్యవేక్షణాధికారం దృష్ట్యా, ఎలాంటి నేర నిర్ధారణ ఉత్తర్వు లేనప్పటికీ దాదాపు ఏడాదిగా జైల్లో ఉన్న నా భర్త ప్రాథమిక హక్కులు, ఆయన సహచర్యానికి దూరంగా ఉన్న నాతో పాటు నా పిల్లల హక్కులు కాపాడేలా తగిన చర్యలు చేపట్టేందుకూ.. సీవీసీకి కూడా ఈ లేఖ ప్రతిని అందజేస్తున్నాను.ప్రజలకు సేవ చేసే బృహత్తర బాధ్యతను మీకు అప్పగించింది ఈ దేశమే తప్ప.. ప్రేరేపిత, వివక్షాపూరితమైన ఏదైనా రాజకీయ పార్టీయో లేక వ్యక్తో కాదని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను..’’
Share this article :

0 comments: