రైతును జగనన్న రాజులా చూసుకుంటారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రైతును జగనన్న రాజులా చూసుకుంటారు

రైతును జగనన్న రాజులా చూసుకుంటారు

Written By news on Thursday, May 30, 2013 | 5/30/2013

* వైఎస్ మరణం తర్వాత ఆధునీకరణ పనులను ఈ ప్రభుత్వం గాలికొదిలేసింది
* కాలువలను బాగు చేయించేందుకు వైఎస్ రూ.1,464 కోట్లతో పనులు ప్రారంభించారు
* ఆయన ఉన్నంతకాలం పనులు వేగంగా సాగాయి.. ఆ తర్వాత పట్టించుకున్న వారే లేరు
* పనులు పూర్తి చేస్తే వైఎస్‌పై జనం ఇంకా అభిమానం పెంచుకుంటారని, అది జగన్‌కు అనుకూలంగా మారుతుందని ఈ పాలకులు అనుకుంటున్నారు
* ఇలాంటి ప్రభుత్వం ఉంటే ఎంత.. ఊడితే ఎంత.. అని రైతన్నల ఆగ్రహం
* రైతును జగనన్న రాజులా చూసుకుంటారు: షర్మిల భరోసా 

మరో ప్రజాప్రస్థానం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర ధాన్యాగారమైన గోదావరి డెల్టా వట్టిపోతోంది.. పాలకుల నిర్లక్ష్యం, కుట్రలతో నిండా మునుగుతోంది.. అన్నం పెట్టాల్సిన ‘అన్నపూర్ణ’ అన్నమో రామచంద్రా అని అలమటిస్తోంది. ఐదేళ్లుగా పంట వేయడమే కానీ ఆ పంట చేతికి అందింది లేదు. పంట కోసే వేళ వరదలొచ్చి పంటంతా నీటిపాలైపోతోంది. ఆక్వా, అరటి, కొబ్బరి, వరి... ఇలా ప్రతి రైతు అప్పుల పాలైపోయారు. 150 ఏళ్ల కిందట ధవళేశ్వరం, విజ్జేశ్వరం వద్ద ఆనకట్టలతో పాటు సాగునీటి కాల్వలు కట్టించిన కాటన్‌దొరను ఇక్కడి ప్రజలు దేవుడిలా కొలిస్తే.. ఆ కాలువల్లో పూడిక తీయించి నీటిని ఉరకలెత్తించిన దివంగత నేతను గుండెల్లో పెట్టుకున్నారు. ఈ కాల్వల్లో పూడిక తీయించి ఆధునీకరించడం కోసం వైఎస్సార్ రూ.1,464 కోట్లు కేటాయించి పనులు ప్రారంభించారు. ఆయన బతికి ఉన్నంత కాలం పనులు శరవేగంగా సాగాయి. 

అందుకే తీర వాసులు తమ పల్లెల్లో కాటన్‌దొర విగ్రహం పక్కనే వైఎస్సార్ విగ్రహం పెట్టుకున్నారు. ఈ అభిమానాన్ని చూసి పాలకులు ఓర్చుకోలేకపోయారు. పనులు పూర్తై తీరప్రాంతమంతా వైఎస్సార్‌పై ఇంకా అభిమానం పెంచుకుంటారని, అది వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అనుకూలంగా మారుతుందన్న ఉద్దేశంతో ఏవేవో సాకులు చూపుతూ డెల్టా ఆధునీకరణ పనులను నిలిపివేసే కుట్రలు చేస్తున్నారు. వైఎస్సార్ మరణించిన తర్వాత డెల్టా ఆధునీకరణ పనులు ఒక్క అంగుళం కూడా ముందుకు కదలకపోవడమే ఇందుకు నిదర్శనం. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి, ఆ ప్రభుత్వంతో అంటకాగుతున్న చంద్రబాబు వైఖరికి నిరసనగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరోప్రజాప్రస్థానం బుధవారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో సాగింది. పలుచోట్ల షర్మిలను కలిసిన రైతులు.. డెల్టా ఆధునికీకరణ పనులు జరగకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. 

ఈ ప్రభుత్వం ఉంటే ఎంత.. ఊడితే ఎంత?
వేసిన పంట చేతికందే సమయంలో వరదొచ్చి పంటను ముంచేస్తోంది. మూడేళ్ల నుంచి ఇదే పరిస్థితి. తుపాను వస్తే పంటల సంగతి దేవుడెరుగు.. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని బతకాల్సిన పరిస్థితి ఉంది. కాల్వల్లో పూడిక తీస్తే ఈ సమస్య ఉండేది కాదు. కానీ ఈ పాలకులకు చేతగాక, వ్యవసాయం మీద అవగాహన లేక, రైతుల అవసరాలు గుర్తించలేక డెల్టాను ఏటా ముంచేస్తున్నారు. డెల్టా ఆధునీకరణ కోసం వైఎస్సార్ ఇచ్చిన నిధులను కూడా ఖర్చుపెట్టలేని ఈ ప్రభుత్వం ఉంటే ఎంత? ఊడితే ఎంత? డెల్టా ప్రాంతంలోని కాలువలు, డ్రెయిన్ల వ్యవస్థను బాగుచేసి, పూడికలు తీయించి ఉంటే ఇప్పుడీ సమస్య వచ్చి ఉండేదే కాదు. - కుంజం సత్యనారాయణ, రైతు, పాలకొల్లు

వైఎస్ ఉన్నప్పుడు చేసిన పనులే
భారీ వర్షాలు పడితే డ్రెయిన్లలో నీరు పారే అవకాశం లేక ఎగదన్ని పొలాలు మునిగిపోవడం డెల్టాలో నిత్యకృత్యమైంది. ఈ పరిస్థితిని నివారించి రైతులను ఆదుకునేందుకు వైఎస్ 2007లో డెల్టా ఆధునీకరణకు శ్రీకారం చుట్టారు. 5.30 లక్షల ఎకరాలకు నీరందించే కాలువలు, డ్రెయిన్ల అభివృద్ధికి రూ.1,464 కోట్లను కేటాయించారు. పనులు పూర్తవడానికి నిర్దేశించిన ఐదేళ్ల కాలపరిమితి పూర్తి అయ్యింది. వైఎస్సార్ ఉన్నప్పుడు చేసిన పనులే గానీ.. ఈ ప్రభుత్వం ఇప్పటి వరకూ ఏ పనీ చేయలేదు.
- మేడపాటి గొల్లారెడ్డి, మట్టపర్రు నీటితీరువా సంఘం అధ్యక్షుడు

జగనన్నపై అభిమానం చూపెడతారనే..
ఆధునీకరణ పనులు చేయాలంటే కాలువలకు నీరు విడుదల చేయకుండా ఆపాలని ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారమ్మా! పనులు పూర్తిచేయడానికి 2012 ఖరీఫ్ సీజన్‌కు పంట విరామం ఇచ్చాం. ఆ సమయంలో కూడా పనులు సరిగ్గా చేయలేదు. అసలు వీళ్ల మనసులో ఉన్న ఉద్దేశం వేరే ఉందమ్మా.. నాన్నగారు కాల్వలు, డ్రెయిన్‌ల ఆధునీకరణ కోసం నిధులిచ్చారు. 30 శాతం పనులు చేశారు. ఈ పనులు పూర్తై జనమంతా జగనన్న మీద అభిమానం చూపెడతారని కిరణ్‌కుమారెడ్డి కుట్ర చేసి పనులు పక్కన పెట్టిస్తున్నాడమ్మా..
- సత్తి వెంకటరెడ్డి, రైతు, మార్టేరు - See more at: http://www.sakshi.com/main/FullStory.aspx?catid=608502&Categoryid=1&subcatid=33#sthash.TPGYlmfl.dpuf
Share this article :

0 comments: