వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత, ఎంపి జగన్మోహన రెడ్డి ప్రజల పక్షం నిలిస్తే, ప్రధాన పత్రిపక్షం తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పక్షాన నిలుస్తున్నారు. రైతులు, చేనేత కార్మికులు, విద్యార్థుల కోసం జగన్ దీక్షలు చేసి, పోరాడి ప్రజలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. అన్ని వర్గాల ప్రజలకు దగ్గరయ్యారు. పోరాటాలు, ఉద్యమాలతో అద్వితీయమైన ప్రజాస్పందనని కూడగట్టుకున్నారు. రైతులు, చేనేత కార్మికులు, విద్యార్థులు, మహిళలో చైతన్యం తీసుకువచ్చారు. ఆయన రాజకీయాలలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే జననేతగా ఎదిగారు.
2010 డిసెంబరులో విజయవాడలో రైతుల కోసం జగన్మోహన రెడ్డి భారీ లక్ష్యదీక్ష చేపట్టారు. ధర్మవరంలో చేనేత కార్మికులు చేపట్టిన దీక్షకు మద్దతు పలికారు. 2011 మేలో గుంటూరులో రైతు సమస్యలపై దీక్ష చేశారు. 2011 జనవరిలో రైతులతో ఢిల్లీలో భారీ ధర్నా నిర్వహించారు. దేశ రాజధాని పార్లమెంటు వీధిలో ఒక రోజంతా నిరశన దీక్ష పాటించారు. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా
విశాఖపట్నంలో 2011 జనవరి 22న జగన్ జనదీక్ష చేపట్టారు. రైతులకు విద్యుత్ సక్రమంగా అందించకపోవడంతో 2011 ఏప్రిల్ 3న విద్యుత్ సబ్ స్టేషన్లను ముట్టడించాలని పిలుపు ఇచ్చారు. 2012 జనవరిలో తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో మూడు రోజుల పాటు రైతుల సమస్యలపై విజయవంతంగా దీక్ష నిర్వహించారు. ఈ విధంగా ప్రజలకు చేరువయ్యారు. ప్రజాదరణ పొందారు. ప్రధాన ప్రతిపక్షం ప్రభుత్వానికి తొత్తుగా మారటంతో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే నాధుడే లేడు. ఈ పరిస్థితులలో జగన్ పార్టీ పెట్టింది మొదలు ప్రజా సమస్యలపైనే పోరాడుతూ వారికి అత్యంత చేరువయ్యారు.
అన్ని ప్రాంతాలలో అన్ని వర్గాల ప్రజల నుంచి జగన్ కు లభించిన అపూర్వ ఆదరణ, ఆయన పాల్గొన్న బహిరంగ సభలకు వచ్చే జనవాహినిని చూసి తలలు పండిన రాజకీయ విశ్లేషకులు సైతం విస్మయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇంతటి ప్రజాదరణ గల నేత యువకులలో గానీ, సీనియర్లలో గాని మరొకరు లేరని తేల్చేశారు. ఈ ప్రజాదరణని చూసి తట్టుకోలేక, ఈర్ష్య, కుళ్లుతో అధికార, ప్రధాన ప్రతిపక్షం కలిసి కక్ష గట్టాయి. కుట్ర పన్నాయి. జన నేతగా ఎదిగిన జగన్ చూసి ఓర్వలేకపోయారు. జైలులో పెట్టించారు. జగన్ జైలులో ఉన్నా రాష్ట్ర ప్రజల గురించే ఆయన ఆలోచిస్తున్నారు. తండ్రిలాగా రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, వికలాంగులకు, వితంతువులకు, పేదలకు, అన్ని వర్గాల వారికి మేలు చేయాలన్న తలంపుతో ఉన్నారు.
జగన్ ఓ పక్క ప్రజల కోసం, ప్రజాసమస్యలపై పోరాడితే, ప్రధాన ప్రతిపక్ష నేత, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన ఘోరంగా విఫలమయ్యారు. ప్రజా సమస్యల పట్ల, రైతులు, చేనేత కార్మికులు, విద్యార్థుల సమస్యల పట్ల సరైన రీతిలో స్పందించలేదు. మన రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఎప్పుడూ ఇంత హీనమైన స్థితిలో లేదు. తనపై వచ్చిన ఆరోపణలు, సిబిఐ విచారణను తప్పించుకోవడానికే చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కేంద్ర మంత్రి చిదంబరాన్ని రహస్యంగా కలిసినట్లు వార్తలు కూడా వచ్చాయి. చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్ డిఐ)ను మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చి చివరకు పార్లమెంట్ లో ఓటింగ్ కు వచ్చేసరికి టిడిపి సభ్యులు ప్రభుత్వానికి అనుకూలంగా నాటకీయంగా వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు దేవేందర్ గౌడ్, సుజనా చౌదరి(యలమంచిలి సత్యనారాయణ చౌదరి), గుండు సుధారాణిలు ఓటింగ్ కు గైర్హాజరయ్యారు. కేంద్రంతో చేసుకున్న చీకటి ఒప్పందం ప్రకారంమే ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడుతూ వస్తున్నారు. పాదయాత్ర పేరుతో జనం మధ్యకు వెళ్లి ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ అసమర్థ ప్రభుత్వానికి ఒక్క క్షణం కూడా పాలించే అర్హతలేదన్నారు.
చివరకు ప్రభుత్వాన్ని దించే అవకాశం వచ్చినప్పుడు దానికి అండగా నిలిచారు. శాసనసభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ఇష్టపడలేదు. టిఆర్ఎస్, వైఎస్ఆర్ సిపి మద్దతు ఇస్తామన్నా ప్రభుత్వాన్ని కాపాడటానికే సిద్ధపడ్డారు. టిఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం పెడితే మద్దతు ప్రకటించలేదు. దాంతో చంద్రబాబు వ్యవహారం ప్రజలకు అర్ధమైపోయింది. పార్టీ నేతలు కూడా ఇబ్బంది పడ్డారు. బాబు విధానాల వల్ల పార్టీ బ్రష్టుపట్టిపోయిందని బాధపడ్డారు. పదవీ వ్యామోహంతో ఆయన చేసే చేష్టలు ప్రజలకు రోతపుట్టిస్తున్నాయి. ఆయన తీరు నచ్చక దాడి వీరభద్రరావు, కడియం శ్రీహరి వంటి వారు పార్టీని వీడి వెళ్లిపోయారు. పార్టీ పెట్టిననాటి నుంచి అంటిపెట్టుకొని ఉన్న సీనియర్ నేతలు, ఎన్టీఆర్ వీరాభిమానులు, ఎమ్మెల్యేలు పార్టీని వదిలి వెళ్లిపోతున్నారు. పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. అయినా చంద్రబాబు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడటమే ధ్యేయంగా పెట్టుకొని ముందుకు సాగిపోతున్నారు. ఆ రకంగా ఆయన కాంగ్రెస్ పక్షం వహిస్తున్నారు.
సిబిఐ పని తీరును ప్రతిపక్షాలతోపాటు యుపిఏ మిత్రపక్షాలు కూడా తీవ్రస్థాయిలో తప్పుపట్టాయి. సిబిఐని కాంగ్రెస్ తన జేబు సంస్థగా వాడుకుంటుందని విమర్శించారు. ఎఫ్ డిఐల బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వం సిబిఐని అడ్డుపెట్టుకొని పార్లమెంట్ లో నెగ్గిందని ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. సుప్రీం కోర్టు కూడా సిబిఐ వ్యవహారశైలిపై మండిపడింది. అయినా చంద్రబాబు సిబిఐని ఒక్క మాట కూడా అనలేదు. ఈ విషయాలన్నింటినీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. వారు అమాయకులు కారు. గతంలో వారు ఇచ్చిన తీర్పులే అందుకు నిదర్శనం. సమయం వచ్చినప్పుడు ఏం చేయాలో వారికి తెలుసు!
0 comments:
Post a Comment