వర్సిటీకి వైఎస్సార్ పేరుపెట్టినందుకే.. ఉద్యోగాలివ్వడంలేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వర్సిటీకి వైఎస్సార్ పేరుపెట్టినందుకే.. ఉద్యోగాలివ్వడంలేదు

వర్సిటీకి వైఎస్సార్ పేరుపెట్టినందుకే.. ఉద్యోగాలివ్వడంలేదు

Written By news on Tuesday, May 21, 2013 | 5/21/2013

షర్మిల వద్ద వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ విద్యార్థుల ఆవేదన
400 మంది హార్టికల్చర్ డిగ్రీలు పూర్తిచేసినా ఒక్కరికీ ఉద్యోగాలు రాలేదు
సీఎం కిరణ్‌కు మొరపెట్టుకుంటే.. నర్సరీలు పెట్టుకోమని సలహాలిస్తున్నారు
వర్సిటీకి వైఎస్సార్ పేరుపెట్టినందుకే.. ప్రభుత్వం మాకు ఉద్యోగాలివ్వడంలేదు
ఉద్యోగావకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే: షర్మిల
జగనన్న ప్రభుత్వంలో అందరి చదువులకు, ఉద్యోగాలకు సాయం అందుతుందని భరోసా

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘‘చదువు చెప్పించడం ఎంత ముఖ్యమో, చదివిన తర్వాత వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం కూడా అంతే ముఖ్యం. ఉద్యోగాలు కల్పించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలి. మరో ఆరు నెలలు లేదా ఏడాదిలో మన ప్రభుత్వం వస్తుంది. అప్పుడు అందరి చదువులకు, ఉద్యోగాలకు సాయం అందుతుంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల.. విద్యార్థులకు భరోసా ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలోని వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ విద్యార్థులు సోమవారం షర్మిలను కలిసి.. ‘‘యూనివర్సిటీ నుంచి ఇప్పటికి 400 మంది హార్టికల్చర్ డిగ్రీలు తీసుకుని బయటకు వెళ్లారు.

కానీ ఒక్కరికీ ఉద్యోగం రాలేదు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి యూనివర్సిటీకి వచ్చి మాతో మాట్లాడినపుడు ఈ విషయం చెబితే.. ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా నర్సరీలు పెట్టుకోమని సలహా ఇచ్చారు. ఈ వర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టడం వల్లే ప్రభుత్వం ఉద్యోగావకాశాలు కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తోంది’’ అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ప్రజలను గాలికొదిలేసిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర సోమవారం పశ్చిమగోదావరి జిల్లాలోని గోపాలపురం నియోజకవర్గం నుంచి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలోని వైఎస్సార్ యూనివర్సిటీ వద్ద విద్యార్థులు షర్మిలను కలిశారు.
ధర్నాలు చేసినా పట్టించుకోవడం లేదు..
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సలహా ఇచ్చినట్లు నర్సరీలు పెట్టుకుందామనుకున్నా.. అందులో చాలా నష్టాలు వస్తున్నాయని, ఆయన చెప్పింది ఎలా సాధ్యమని పి.సంతోష్ అనే విద్యార్థి షర్మిల వద్ద ఆవేదన వ్యక్తంచేశాడు. ‘‘దివంగత రాజశేఖర రెడ్డి యూనివర్సిటీని దేశంలోనే రెండోదిగా ఏర్పాటు చేశారు. ఇందులో చదువుకుని దేశానికి ఉపయోగపడదామనుకుంటే ఎవరూ సహాయం చేయడం లేదు. ధర్నాలు చేసినా పట్టించుకోవడంలేదు’’ అని వి.నాయక్ అనే మరో విద్యార్థి అన్నాడు. గత సంవత్సరం నెలరోజుల పాటు ధర్నా చేస్తే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చి పట్టించుకోలేదని తెలిపాడు. అన్ని శాఖల్లోనూ పోస్టులను భర్తీ చేస్తున్న ప్రభుత్వం ఉద్యాన శాఖలో మాత్రం కొన్నేళ్లుగా ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదని ఎం.సుందర్ రెడ్డి వాపోయాడు. హార్టికల్చర్ ఆనర్స్ కోర్సుకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందని యూనివర్సిటీ పీఆర్‌ఓ రత్నకిషోర్ షర్మిలకు వివరించారు. హార్టికల్చర్‌ను సివిల్స్‌లో ఒక సబ్జెక్టుగా పెట్టాలని ప్రతిపాదన కూడా పంపామని తెలిపారు. దీనిపై షర్మిల స్పందిస్తూ ‘ఈ చదువులకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు కదన్నా. మరి ఎందుకు ఉద్యోగాలు రావడంలేదు’ అని ప్రశ్నించారు. ఉద్యోగాలకు వచ్చే నెలలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని ఆయన సమాధానమిచ్చారు. దీనిపై ఎక్కడ ఉద్యోగావకాశాలు ఉన్నాయని ఆమె ప్రశ్నించగా గుజరాత్ తదితర రాష్ట్రాల్లో అవకాశాలు ఉన్నాయన్నారు. ‘‘మన విద్యార్థులు అక్కడికి వెళితే ఆ ప్రభుత్వం ఉద్యోగావకాశాలు ఇవ్వదుకదన్నా. వారి ఆశలు, ఆకాంక్షలకు తగినట్లుగా ప్రభుత్వం వారికి అవకాశాలు కల్పించాలి. జగనన్న వచ్చిన తర్వాతఅవన్నీ చేస్తారు’’ అని హామీ ఇచ్చారు.

ఈ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డూ ఇవ్వలేదు..
ఆ తర్వాత సాయంత్రం ఏడు గంటలకు వెంకట్రామన్నగూడెంలో షర్మిల రచ్చబండ నిర్వహించారు. ప్రజల సమస్యలు విన్న అనంతరం ఆమె మాట్లాడుతూ ‘‘ఈ ప్రభుత్వం ఇప్పటివరకూ ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఒక్క కొత్త పక్కా ఇల్లు కూడా కట్టించలేదు. ఆరోగ్యశ్రీ కార్డులను చెత్తబుట్టలో వేసుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఆ పని చేయకుండా తన భుజస్కంధాలపై మోస్తోంది’’ అని విమర్శించారు. సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్, టీడీపీలకు గట్టిగా బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు.

12.4 కిలోమీటర్ల పాదయాత్ర
‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 154వ రోజు సోమవారం పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్లలో ప్రారంభమైంది. అక్కడి నుంచి షర్మిల నడచుకుంటూ ప్రకాశరావుపాలెం చేరుకుని పోలవరం కుడి కాలువను పరిశీలించారు. నర్సాపురం మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కాలువకు సంబంధించిన అంశాలను ఆమెకు వివరించారు. తర్వాత షర్మిల తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని వెంకట్రామన్నగూడేనికి చేరుకుని అక్కడ ఉద్యాన వర్సిటీ విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. సాయంత్రం ఇదే ఊళ్లో రచ్చబండ నిర్వహించారు. అక్కడి నుంచి సమీపంలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 7.35 నిమిషాలకు షర్మిల చేరుకున్నారు. సోమవారం మొత్తం 12.4 కిలోమీటర్లు నడిచారు. పాదయాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మైసూరారెడ్డి, చేగొండి హరిరామ జోగయ్య, ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, తానేటి వనిత, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు చెరకువాడ శ్రీరంగనాథరాజు, ముదునూరి ప్రసాదరాజు, చిర్ల జగ్గిరెడ్డి, స్థానిక నాయకులు తలారి వెంకట్రావు, డి.సువర్ణరాజు, తోట గోపి పాల్గొన్నారు.

షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’
సోమవారం యాత్ర ముగిసేనాటికి
రోజులు: 154
కిలోమీటర్లు: 2,051
Share this article :

0 comments: