ఇంత దారుణమా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇంత దారుణమా?

ఇంత దారుణమా?

Written By news on Saturday, June 8, 2013 | 6/08/2013


* చంచల్‌గూడ జైలు, నాంపల్లి కోర్టు వద్ద జగన్ అభిమానులపై లాఠీచార్జి
* చంచల్‌గూడ జైలు, సీబీఐ కోర్టు వద్ద అభిమానులకు అడ్డంకులు
* విజయమ్మ, భారతి సహా కుటుంబ సభ్యులనూ అడ్డుకున్న పోలీసులు
* ఖాకీ జులుంపై అభిమానుల నిరసన

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరైన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరు పలు విమర్శలకు తావిస్తోంది. ఆయన్ను చూడ్డానికి వచ్చిన అభిమానులను అడుగడుగునా అడ్డుకుంటూ, లాఠీలు ఝళిపిస్తూ పోలీసులు భయభ్రాంతులకు గురిచేశారు. చంచల్‌గూడ జైలు వద్ద, నాంపల్లి కోర్టు వద్ద ప్రత్యేకంగా భారీ బారికేడ్లు ఏర్పాటు చేసి అభిమానులను అడ్డుకున్నారు. ‘‘జగనన్నను కళ్లారా చూసి ఆరు నెలలైంది.. ఒక్కసారి చూడనీయన్నా’’ అంటూ కొందరు అభిమానులు ఎంత మొరపెట్టుకున్నా పోలీసు గుండె కరగలేదు. పైగా చంచల్‌గూడ జైలు వద్ద అభిమానులపై స్వల్ప లాఠీచార్జి చేశారు.

నాంపల్లి కోర్టు వద్ద లాఠీలతో నెట్టివేశారు. జగన్ కుటుంబీకులను సైతం ఆయన దరికి రానివ్వకుండా పోలీసులు తమ కర్కశత్వాన్ని చాటుకున్నారని అభిమానులు మండిపడ్డారు. నాంపల్లి కోర్టుకు రెండు వైపుల నుంచి వెళ్లే మార్గాలను బారికేడ్‌లతో మూసివేయడంతో ఆ వైపుగా వెళ్లే వాహనదారులు, కోర్టులో వివిధ కేసుల నిమిత్తం హాజరయ్యే వారు కూడా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. సుమారు ఆరు నెలల తరువాత వైఎస్ జగన్ జైలు బయటకు వస్తున్నారనే విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఉదయం నుంచే జైలు వద్దకు చేరుకున్నారు. అయితే వీరందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్య నిర్వాహక మండలి సభ్యురాలు విజయారెడ్డితోపాటు కొందరు కార్యకర్తలను కూడా అరెస్టు చేశారు.

చెదరని చిరునవ్వుతో జగన్..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆడిటర్ విజయసాయిరెడ్డిని పోలీసులు వేర్వేరు వాహనాల్లో నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు తరలించారు. జగన్‌మోహన్‌రెడ్డిని ఉదయం 9.55 గంటలకు చంచల్‌గూడ జైలు నుంచి బయటకు తీసుకువచ్చారు. లేత గులాబీ రంగు హాఫ్ హ్యాండ్స్ షర్ట్.. గచ్చకాయ రంగు ప్యాంటు ధరించి ఉన్న ఆయన చెదరని చిరునవ్వుతో కనిపించారు. అక్కడ వేచి ఉన్న ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం ఆయన కోసం సిద్ధంగా ఉన్న వాహనంలో ఎక్కారు. అప్పటికే ఆ బులెట్‌ప్రూఫ్ వాహనాన్ని బాంబ్‌స్క్వాడ్ బృందం తనిఖీలు చేసింది. వెనకాముందూ పోలీసు వాహనాల భద్రతతో ఆయన్ను నాంపల్లి కోర్టుకు తీసుకువచ్చారు. కాగా డబీర్‌పురా వైపు నుంచి వస్తున్న అభిమానులను పోలీసులు అక్కడే అడ్డుకుని వెనక్కు పంపించివేశారు. జగన్‌మోహన్‌రెడ్డి వాహనం నాంపల్లికి వెళ్లే క్రమంలో చంచల్‌గూడ చౌరస్తా వద్ద పెద్ద సంఖ్యలో వేచి ఉన్న కార్యకర్తలు ఒక్కపెట్టున నినాదాలు చేశారు. జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు ముందుకు కదిలారు. దీంతో పోలీసులు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలపై లాఠీచార్జి చేయడంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. లాఠీచార్జి జరుగుతున్నా కార్యకర్తలు జై జగన్ అనే నినాదాలు ఆపలేదు. దీనిపై వైఎస్‌ఆర్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా సమన్వయకర్త జనార్దన్‌రెడ్డి తదితరులు నిరసన వ్యక్తం చేశారు.

కుటుంబీకులనూ అడ్డుకున్న పోలీసులు
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, వైఎస్ భారతితోపాటు జగన్ కుటుంబ సభ్యులను కూడా నాంపల్లి కోర్టు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కోర్టుకు ఫర్లాంగు దూరం నుంచే బారికేడ్లు ఏర్పాటుచేసి ఉండటంతో విజయమ్మ, భారతితోపాటు జగన్ కుటుంబ సభ్యులు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష ఉప నాయకురాలు శోభానాగిరెడ్డి.. నాంపల్లి కోర్టు ఆవరణ వరకూ నడిచేవచ్చారు. కోర్టు ఆవరణలోకి వెళుతుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. వారంతా తమ కుటుంబ సభ్యులేనని, కోర్టు ఆవరణలోకి వెళ్లేందుకు అనుమతించాలని విజయమ్మ, భారతి సర్దిచెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ పోలీసులు వినలేదు. దీనిపై విజయమ్మ, భారతి ఆవేదన వ్యక్తంచేశారు. కోర్టులో విచారణ పూర్తయిన అనంతరం విజయమ్మ, భారతి బయటకు వెళ్లే క్రమంలో వారి వాహనాన్ని కార్యకర్తలు వెంబడిస్తూ జై జగన్ అంటూ నినాదాలు చేశారు. అలాగే జగన్‌మోహన్‌రెడ్డి వాహనం కోర్టు ఆవరణ నుంచి బయల్దేరగానే ఆయనను చూసేందుకు భారీ ఎత్తున కార్యకర్తలు ఎగబడ్డారు. దీంతో కోర్టు ఆవరణ నుంచి మెయిన్ రోడ్డులోకి వాహనం వెళ్లేందుకు చాలా సమయం పట్టింది. కార్యకర్తలు మాత్రం జై జగన్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూనే ఉన్నారు.

నల్ల జెండాలతో నిరసనలు..
జైలుకు తరలించే సమయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వెల్లాల రామ్మోహన్ నేతృత్వంలో మహిళా కార్యకర్తలు కోర్టు వద్దకు భారీగా చేరుకుని జగన్ అక్రమ నిర్బంధానికి నిరసనగా నినాదాలు చేశారు. నల్ల జెండాలను పట్టుకుని పెద్ద పెట్టున నినాదాలు చేస్తుండగా పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టుచేశారు. జగన్‌మోహన్‌రెడ్డిని నాంపల్లి కోర్టు నుంచి తరలించే క్రమంలో వైఎస్‌ఆర్ సీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి నేతృత్వంలో కార్యకర్తలు వాహనానికి అడ్డుపడ్డారు. దీంతో కొద్ది నిమిషాలు జగన్ వాహనం ముందుకు సాగలేదు. దీంతో పోలీసులు వారందర్నీ లాఠీలతో పక్కకు నెట్టి వాహనాన్ని పంపించివేశారు. జగన్‌మోహన్‌రెడ్డి కోర్టుకు హాజరయ్యే సమయంలో, కోర్టు నుంచి తిరిగి వెళుతున్న సమయంలోనూ కొందరు న్యాయవాదులు జై జగన్ అంటూ నినాదాలు చేశారు.

ఇంత దారుణమా?
వైఎస్ భారతి ఆవేదన
నాంపల్లి కోర్టు ఆవరణలోకి వెళ్లేందుకు తమ కుటుంబ సభ్యులను కూడా అనుమతించకపోవడం దారుణమని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి భారతి అన్నారు. కోర్టు వద్ద ఆమె విలేకరులతో మాట్లాడారు. కోర్టు ఆవరణలోకి వెళుతున్న తమను అడ్డుకున్న పోలీసుల తీరును ఆమె తప్పుపట్టారు. తమ ప్రాథమిక హక్కులకు కూడా భంగం కలిగించేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని, రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? వేరే ఎక్కడైనా ఉన్నామో అర్థం కావడంలేదని నిరసన వ్యక్తంచేశారు. తమకే ఇలాంటి పరిస్థితి ఉంటే... ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి కోర్టుకు హాజరవుతున్న సమయంలో ఇంత పోలీసు నిర్బంధం అవసరమా అని వైఎస్ విజయమ్మ ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నించారు. కోర్టు ఆవరణలోకి వెళుతున్న తమ కుటుంబీకులను కూడా పోలీసులు అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. జగన్ కుటుంబీకులను కోర్టు ఆవరణలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంపై న్యాయవాదులు కూడా నిరసన వ్యక్తంచేశారు.
Share this article :

0 comments: