కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, సీబీఐ, ఈడీ... వీటికితోడుగా కొన్ని ఎల్లో పత్రికలు, వాటి యజమానులు పనిగట్టుకుని జగన్కు వ్యతిరేకంగా దుష్ర్పచారం చేస్తున్నారు. కాబట్టే న్యాయవ్యవస్థ మీద ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. జగన్ మీద టీడీపీ నాయకులు, కాంగ్రెస్ మాజీమంత్రి శంకర్రావు ఇద్దరూ కలిసి కేసు పెట్టిన వెంటనే సీబీఐ రంగంలోకి దిగింది. చంద్రబాబుని విచారించేందుకు సీబీఐ దగ్గర లేని సిబ్బంది... రాత్రికి రాత్రే జగన్ని అరెస్టు చేయడానికి ఎక్కడి నుంచి ఊడిపడ్డారు! జగన్ని విచారణ పేరుతో తమ అధీనంలోకి తీసుకోడానికి ఆయన ఎలక్షన్ ప్రచారంలో ఉన్నప్పుడే సీబీఐకి సమయం దొరికిందా?
ప్రచారం ముందో, ప్రచారం తర్వాతో కూడా ప్రశ్నించవచ్చు కదా. అయినా జగన్చేసిన తప్పేంటి? తండ్రి మరణాన్ని తట్టుకోలేక వందలాదిమంది అభిమానులు చనిపోయారు. వారి కుటుంబాలను చూసి తల్లడిల్లిన జగన్ నల్లకాలువలో ఒకే ఒక్క మాట ఇచ్చారు. ‘స్వయంగా నేనే మీ ఇంటికి వచ్చి ఓదార్చుతాను’ అని చెప్పారు. ఇదే తప్పయితే - చనిపోయిన వారి కుటుంబ సభ్యులను భారతీయ సంప్రదాయం ప్రకారం పరామర్శించడానికి వెళ్లిన వారిది కూడా ఇక నుంచీ తప్పనుకోవాలా? అధిష్టానం అభీష్టానికి వ్యతిరేకంగా ఓదార్పుయాత్రకు వెళ్లారని సాకుగా చూపించిన కాంగ్రెస్ నాయకులు... టీడీపీతో కుమ్మక్కై, కుట్ర రాజకీయాలకు తెర తీసి జగన్పై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారు. సీబీఐ కూడా తన వంతు పాత్రను పోషిస్తోంది. జగన్ బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తాడట, అందుకే ఆయనకు బెయిల్ ఇవ్వకూడదట!
అధికారంలో ఉన్న మంత్రులు బయట ఉన్నారు. మరి వాళ్లు సాక్షులను ప్రభావితం చేయరా? అసలు విషయం ఏంటంటే... జగన్ బయట ఉంటే, ప్రజల్లో తిరుగుతుంటే... తమ దుకాణాలు బంద్ అవుతాయన్న భయంతో కాంగ్రెస్, టీడీపీలకు చెమటలు పడుతున్నాయి. జగన్ను అవినీతిపరుడు అంటున్న కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ లీడర్ ఆజాద్గారు, ‘జగన్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఈ పాటికి మంత్రి అయి ఉండేవారనీ, తర్వాత ముఖ్యమంత్రి అయ్యేవారనీ’ అన్నారు. దీనినిబట్టి ప్రజలకు ఏం అర్థమౌతోందీ అంటే... కాంగ్రెస్ పార్టీని వీడినందుకే, ఓదార్పుయాత్ర తలపెట్టడం ద్వారా హైకమాండ్ను ఎదిరించినందుకే అవినీతిపరుడు అనే ముద్రవేశారు కానీ, నిజంగా కాదని!
చంద్రబాబులాగ పూటకొక మాట, రోజుకొక వేషం వేసి చీకట్లో చిదంబరాన్ని కలిస్తే ఎల్లో పత్రికలు ఆ విషయాన్ని విశ్లేషించవు. ఉదయించే సూర్యుడిలాగా పార్టీని పెట్టి అస్తమించే సూర్యుడిలాగా మంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయిన చిరంజీవి గురించి అవి రాయవు. త్వరలోనే ఈ కుటిల రాజకీయ నాయకులకు, తప్పుడు రాతలు రాసే ఎల్లో అధినేతలకు ప్రజలు బుద్ధి చెబుతారు. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు, నాయకులకు, భరోసా ఇస్తూనే... ఎంత కష్టం వచ్చినా, నష్టం వచ్చినా చివరకు జైలుకెళ్లినా ధైర్యంగా ఉండి... తల్లి, చెల్లిని ప్రజల్లోకి పంపారు. ప్రజల సమస్యలను తెలుసుకొమ్మన్నారు. ప్రజా సమస్యలపై పోరాడమని చెప్పారు. ఇదీ రాజకీయం అంటే ఇది. ఇదీ విశ్వాసం అంటే, ఇదీ విశ్వసనీయత అంటే.
- లాలూ, నిజామాబాద్
0 comments:
Post a Comment