కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని షర్మిల అన్నారు. కిరణ్ హయాంలో అన్ని ధరలు పెరిగిపోయాయని అన్నారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా విశాఖపట్నం జిల్లా చోడవరంలో ఈ సాయంత్రం జరిగిన బహిరంగ సభలో షర్మిల ప్రసంగించారు. ధరల పోటుతో కుదేలయిన సామాన్యుడిపై కాంగ్రెస్ సర్కారు తాజాగా 'పెట్రో'బాంబు వేసిందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంపుతో నిత్యావసర ధరలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
కిరణ్ పాలనలో ప్రతి రైతు అప్పులపాలయ్యారని అన్నారు. అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా అధికార పక్షంలో ఏమాత్రం చలనం లేదన్నారు. ఈ నాలుగేళ్లలో వ్యవసాయ వ్యయం భారీగా పెరిగినా మద్దతు ధరలు పెరగాల్సినంతగా పెరగలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులంటే పగ లేక చిన్నచూపా అని ప్రశ్నించారు. వైఎస్సార్ బతికుంటే వ్యవసాయానికి 9 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చేవారని చెప్పారు. కిరణ్ ప్రభుత్వం కనీసం 3 గంటలు కూడా ఉచిత్ ఇవ్వడం లేదని ఆరోపించారు. కరెంట్ కోతలతో 20 లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కష్టాలు పట్టించుకోనివారిని పాలకులు అనలా, రాక్షసులు అనలా అని ప్రశ్నించారు.
ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఈగ కూడా వాలనీయకుండా కాపాడుతున్నారని ధ్వజమెత్తారు. స్వప్రయోజనాల కోసం పార్టీని తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. ఏ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీని స్థాపించారో అదే పార్టీతో ఆయన కుమ్మక్కయ్యారని అన్నారు. కాంగ్రెస్ తో జగన్ కుమ్మక్కయారని అబద్దపు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. జగన్ కుమ్మక్కయివుంటే ఈ రోజు జైల్లో ఉండేవారా అని షర్మిల ప్రశ్నించారు.
సీబీఐని అడ్డం పెట్టుకుని జగనన్నను జైలుపాల్జేశారని అన్నారు. జగనన్నఏ తప్పు చేయలేదని, అందుకే ధైర్యంగా ఉన్నారని అన్నారు. జగనన్నను ఆపడం చంద్రబాబు, కాంగ్రెస్ వల్ల కాదన్నారు. రాజన్న రాజ్యాన్ని జగనన్న తప్పకుండా స్థాపిస్తాడని అప్పటివరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలపర్చాలని కోరారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలకు గట్టిగా గుణపాఠం చెప్పాలన్నారు.
0 comments:
Post a Comment