వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే భూమన ధ్వజం పైగా ఇప్పుడు తానే దాన్ని పరిపుష్టం చేశానని అబద్ధాలాడుతున్నారు స్వపరిపాలనపై బాబు ‘మనసులో మాట’ ఏంటి?
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ వ్యవస్థను, పంచాయతీరాజ్ పరిపాలననూ తన తొమ్మిదేళ్ల పరిపాలనలో అన్ని రకాలుగా చిదిమేసి, గ్రామాలనే ఖాళీ చేయించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై అభాండాలు వేయడం దుర్మార్గమని వైఎస్సార్ కాంగ్రెస్ సీజీసీ సభ్యుడు, ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్ను ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో గ్రామాలను నిర్లక్ష్యం చేసినందువల్ల ఇక అక్కడ బతకలేమని, గ్రామాలకు గ్రామాలు ఖాళీ అయి పొట్ట చేతబట్టుకుని వలసలు పోయారని భూమన గుర్తు చేశారు. గ్రామాలకు తాగునీరు, సాగునీరు గాని, విద్యుత్గాని ఇవ్వాలన్న సృ్పహ లేకుండా పాలించిన చంద్రబాబు ఇపుడు గ్రామాలకు తానే అన్నీ చేశానని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. చంద్రబాబు హయాంలో గ్రామాలు వదిలి వెళ్లిన వారు వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక సగర్వంగా మళ్లీ సొంత ఊళ్లకు వచ్చి పనులు చేసుకున్నారని అన్నారు. వైఎస్ తన హయాంలో వ్యవసాయరంగానికి ఉచిత విద్యుత్ సహా అనేక వసతులు కల్పించారన్నారు. గ్రామీణ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చిందీ, పేద గ్రామీణ విద్యార్థులు ఉన్నత విద్య చదువుకోవడానికి ఫీజుల రీయింబర్స్మెంట్ను ప్రవేశ పెట్టింది, గ్రామాల్లో ఐదేళ్లలో 48 లక్షలకుపైగా ఇళ్లు కట్టించింది వైఎస్ కాదా అని ఆయన ప్రశ్నించారు. నిజంగా చంద్రబాబు పంచాయతీరాజ్ వ్యవస్థను కాపాడి ఉంటే 2004లో మళ్లీ ఎన్నికయ్యే వాడు కదా అని ఆయన అన్నారు.
ఇదీ..! ‘మనసులో మాట’
చంద్రబాబు తాను భగవద్గీతగా భావించే ‘మనసులో మాట’ పుస్తకంలో పంచాయతీరాజ్ వ్యవస్థ సంప్రదాయ సిద్ధమైన ఒక భారతీయ ఆలోచన అని తేలిగ్గా తీసి పారేస్తూ రాసుకున్నారని, అలాంటి వ్యక్తి తానే దీనిని పరిపుష్టం చేశానంటే ప్రజాస్వామ్యాన్ని ఇంతకంటే పరిహాసం చేయడం ఏముంటుందని భూమన ప్రశ్నించారు. ప్రజలే చందాలు వేసుకుని గ్రామాల్లో పనులు చేసుకోవాలని బాబు ఈ పుస్తకంలో రాసుకున్నందు వల్ల అసలు టీడీపీకి పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి మాట్లాడే నైతిక హక్కే లేదని ఆయన విమర్శించారు. ‘మనసులో మాట’ పుస్తకంలోని 199, 200, 201, 203, 204 పేజీల్లో బాబు రాసుకున్న అంశాల ప్రతులను కరుణాకర్ రెడ్డి ఈ సందర్భంగా విడుదల చేశారు.
పర్యటనలు, ఖర్చు వివరాలు కావాలి..
రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి, ఆయన మంత్రి మండలిలో పనిచేస్తున్న మంత్రులు 2011 జనవరి 1 నుంచి 2013 జూలై 15 వరకూ ఇతర రాష్ట్రాల్లో జరిపిన అధికారిక పర్యటనల వివరాలు ఇవ్వాలని సాధారణ పరిపాలన శాఖ పౌర సమాచారాధికారిని భూమన కరుణాకర్రెడ్డి సమాచారహక్కు చట్టం కింద కోరారు.
|
0 comments:
Post a Comment