విశ్వసనీయతే మా డీఎన్‌ఏ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విశ్వసనీయతే మా డీఎన్‌ఏ

విశ్వసనీయతే మా డీఎన్‌ఏ

Written By news on Wednesday, July 3, 2013 | 7/03/2013

-విశ్వసనీయతే మా డీఎన్‌ఏ
-‘మరో ప్రజాప్రస్థానం’లో షర్మిల
- జగనన్నది కాంగ్రెస్ డీఎన్‌ఏ కానే కాదు
- ఆ మాట అనడానికి సిగ్గుండాలి
- కాంగ్రెస్ డీఎన్‌ఏ పేరు వెన్నుపోటు
- సోనియాగాంధీది ఏ లిమిటెడ్ కంపెనీయో కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పాలి
- చంద్రబాబు అండతోనే మైనారిటీ
- ప్రభుత్వం అధికారంలో కొనసాగుతోంది


ఒక మాటఇస్తే ఊపిరి ఉన్నంత వరకు మాట కోసం నిలబడే విలువలు, విశ్వసనీయత ఉన్న నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి. ఆ విశ్వసనీయతే వైఎస్సార్‌సీపీ డీఎన్‌ఏ. కాంగ్రెస్ పార్టీ డీఎన్‌ఏ పేరు వెన్నుపోటు. జగన్‌మోహన్‌రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ నేతలకు అసలు పొంతనే లేదు. వైఎస్సార్‌కు వెన్నుపోటు పొడిచి, ఆయన కుటుంబానికి తీరని ద్రోహం చేసి... జగన్‌మోహన్‌రెడ్డిది కాంగ్రెస్ డీఎన్‌ఏ అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి.
‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘జగన్‌మోహన్‌రెడ్డి గారిది కాంగ్రెస్ డీఎన్‌ఏ అని ఢిల్లీ నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్‌సింగ్ గారు చెప్పారు. కానే కాదు.. జగన్‌మోహన్‌రెడ్డి గారిది ముమ్మాటికీ కాంగ్రెస్ డీఎన్‌ఏ కాదు. ఒక మాట ఇస్తే ఊపిరి ఉన్నంత వరకు ఆ మాట కోసం నిలబడే విలువలు, విశ్వసనీయత ఉన్న నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి గారు. ఆ విశ్వసనీయతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డీఎన్‌ఏ. కాంగ్రెస్ పార్టీ డీఎన్‌ఏ పేరు వెన్నుపోటు. జగన్‌మోహన్‌రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అసలు పొంతనే లేదు.

వైఎస్సార్‌కు వెన్నుపోటు పొడిచి, ఆయన కుటుంబానికి తీరని ద్రోహం చేసి.. జగన్‌మోహన్‌రెడ్డి గారిది కాంగ్రెస్ డీఎన్‌ఏ అని చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు సిగ్గుండాలి’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర మంగళవారం విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో సాగింది. సబ్బవరంలో భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే...

‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 30 ఏళ్లు సేవ చేశారు. రెండుసార్లు కాంగ్రెస్ పార్టీని రాష్ర్టంలోనే కాకుండా కేంద్రంలోనూ అధికారంలో నిలబెట్టారు. అలాంటి వైఎస్సార్ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. చనిపోయిన వ్యక్తిని కూడా మళ్లీ హత్య చేయవచ్చని నిరూపించింది. వైఎస్సార్ చనిపోయినప్పుడు, 600 మంది గుండె ఆగిపోతే.. నా ఆత్మ బంధువుల కోసం నేను వస్తాను, పరామర్శిస్తాను, ఓదారుస్తానని జగనన్న మాటిచ్చారు.

ఒక మాటిస్తే ఊపిరి ఉన్నంత వరకు ఆ మాట తప్ప కూడదు, మడమ తిప్ప కూడదు, అందుకోసం ఎన్ని కష్టాలు వచ్చినా భరించాలనే విలువలు, విశ్వసనీయత ఉన్న నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి గారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని కిరణ్‌కుమార్‌రెడ్డి గారు అంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే మరి సోనియాగాంధీ గారిది ఏ లిమిటెడ్ కంపెనీ అని ఆయన్ను అడుగుతున్నాం. మీ తమ్ముడు మిమ్మల్ని చూసుకొని చేస్తున్న అరాచకాలు ఏ లిమిటెడ్ కంపెనీవి అని అడుగుతున్నాం. పన్నుల మీద పన్నులు వేసి ప్రజల నెత్తిన మోయలేని భారం మోపి, వాళ్ల సంక్షేమాన్ని గాలికి వదిలేసి సొంత ఇమేజ్‌ను పెంచుకోవడంలో కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబులు ఇద్దరూ అన్ లిమిటెడే. దొందూ దొందే. మొన్నేమో పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. నిన్ననేమో రూ.543 కోట్ల కరెంటు చార్జీల భారం ప్రజల నెత్తిన మోపుతున్నట్లు చెప్పారు. ఈ రోజు పేపర్లో ఆర్టీసీ చార్జీలు, ఎరువుల ధరలు పెరిగిన వార్తలున్నాయి. ప్రజల నెత్తిన ఏకంగా రూ.711 కోట్ల భారం మోపబోతోంది ఈ కిరణ్ సర్కారు. ఎరువుల ధరలు ఇంతలా పెంచుతున్న సర్కారు పంటకు మద్దతు ధర మాత్రం పెంచడం లేదు.

బాబును నాయకుడు అంటారా? ఊసరవెల్లి అంటారా?
దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈ కరెంటు బాదుడుకు వ్యతిరేకంగా అనేక ప్రతిపక్ష పార్టీలు కలిసి అవిశ్వాస తీర్మానం పెడితే విచిత్రంగా మన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు గారు రెండు చేతులు అడ్డంపెట్టి సర్కారును కాపాడారు. అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 294 మంది. పాలక పక్షానికి అందులో సగం కంటే ఎక్కువ ఎమ్మెల్యేల బలం ఉండాలి. అంటే 148 మంది సభ్యులు ఉండాలి.

ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల బలం 146 మంది మాత్రమే. మైనార్టీలో ఉన్న ఈ ప్రభుత్వం ఇంకా అధికారంలో ఎలా కొనసాగుతోంది? కేవలం చంద్రబాబు అండదండలతో కాదా? అని ప్రశ్నిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కత్తులు, గొడ్డళ్లతో చంపేయాలన్న చంద్రబాబు గారు తీరా చేతలకు వచ్చేసరికి రంగు మార్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోకుండా కాపాడారు. చంద్రబాబునాయుడును నాయకుడు అంటారా? ఊసరవెల్లి అంటారా? వైఎస్సార్ బతికే ఉంటే ఈ పాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తైరైతులకు నీళ్లు అందేవి. ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేసే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు కూడా పూర్తయ్యేది. కానీ మన దురదృష్టం కొద్దీ వైఎస్సార్ వెళ్లిపోయారు. ఆయన తరువాత ఈ ప్రాజెక్టులను పట్టించుకునే వారే లేరు’’.

15.2 కిలోమీటర్ల నడక: మంగళవారం 197వ రోజు.. ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గంలోని అయ్యన్నపాలెం నుంచి ప్రారంభమయ్యింది. గుల్లెపల్లి, పెదనాయుడిపాలెం మీదుగా సబ్బవరం చేరుకుంది. అక్కడినుంచి అసకపల్లి మీదుగా రాత్రి 8 గంటల సమయంలో పైడివాడ గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి షర్మిల చేరుకున్నారు. మొత్తం 15.2 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు మొత్తం 2622.1 కి.మీ యాత్ర పూర్తయ్యింది.

షర్మిల వెంట నడిచిన వారిలో మాజీ ఎమ్మెల్యే, పెందుర్తి సమన్వయకర్త గండి బాబ్జీ, మూడుగుల సమన్వయకర్తలు పూడి మంగపతిరావు, ముత్యాలనాయుడు, మాజీ ఎమ్మెల్యేలు చెంగల వెంకట్రావు, పిన్నింటి వరలక్ష్మి, నేతలు నందమూరి లక్ష్మీపార్వతి, కొణతాల లక్ష్మీనారాయణ, వివిధ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు కిడారి సర్వేశ్వర్‌రావు, బొడ్డేటి ప్రసాద్, పాడేరు సత్యవాణి, యూత్ నాయకుడు అన్నంరెడ్డి అదీప్‌రాజు, స్థానిక నాయకులు కొయ్య ప్రసాదరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాదయాత్ర కార్యనిర్వాహకులు లంకపోతు సుబ్బారెడ్డి, పొలసాని సురేష్, దోసపాటి నాగేశ్వర్‌రావుగౌడ్, గుత్తిరెడ్డి చంద్రహాస్‌రెడ్డి, గుండభాను ప్రసాద్‌గుప్తా, కలకొండ రవికుమార్, తాడి విజయభాస్కర్‌రెడ్డి, అంబటి రాఘవరెడ్డి, అశోక్ యాదవ్ తదితరులు ఉన్నారు.
Share this article :

0 comments: