
కాంగ్రెస్ ఎం.పి. ఉండవల్లి అరుణ్కుమార్ బుధవారం రాజమండ్రిలో నిర్వహించిన సభలో జగనన్నను ఉద్దేశించి చేసిన విమర్శలపై శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని ఒక్క మాట కూడా అనలేదేమని ప్రశ్నించారు. ఆ సభలో జగనన్నను ఉండవల్లి అరుణ్కుమార్ అడ్డదిడ్డంగా విమర్శించారని శ్రీమతి షర్మిల తెలిపారు. చంద్రబాబును విమర్శించడానికి ఆయనకు సమయం చాల్లేదట అని ఎద్దేవా చేశారు.
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ మొన్న రాష్ట్రానికి వచ్చి.. శ్రీ జగన్మోహన్రెడ్డినే విమర్శించారు కాని ప్రత్యర్థి చంద్రబాబుని కాదని శ్రీమతి షర్మిల ప్రస్తావించారు. ఈ ప్రభుత్వాన్ని నిలబెడుతోందే చంద్రబాబు గనుక ఆయనను విమర్శించే ఉద్దేశం కిరణ్కుమార్రెడ్డి ఎప్పుడూ లేదన్నారు. విజయనగరం జిల్లాను భ్రష్టు పట్టించిన బొత్స ఒక్క మాట కూడా చంద్రబాబును విమర్శించరు.. అలాగే చంద్రబాబు కూడా బొత్సను, కాంగ్రెస్ పార్టీని పల్లెత్తు మాట అనరని అన్నారు. కానీ, వీళ్ళందరి టార్గెట్ కేవలం జగనన్నే అన్నారు.
రూ. 130 కోట్ల విద్యుత్ బకాయిలు, రూ. 1200 కోట్ల రుణ మాఫీలు చేసిన ఘనత దివంగత మహానేత వైయస్ఆర్దేనని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. పెన్షన్లు, సాగునీటి ప్రాజెక్టులు, నిరుపేదలకు పక్కాఇళ్ళు వంటి పథకాలు అమలు చేస్తూనే.. ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలు ఒక్క పైసా కూడా వైయస్ఆర్ పెంచలేదని శ్రీమతి షర్మిల తెలిపారు. ప్రస్తుత కిరణ్ ప్రభుత్వంలో రైతులకు కరెంటు లేదు, ఎరువులు లేవన్నారు. భీమసింగి చక్కెర కర్మాగారం పరిధిలో 12 వేల ఎకరాలున్నా చెరుకుకు మద్దతు ధర లేకపోవడంతో 8 వేల ఎకరాలకు పడిపోయిందని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు. కిరణ్ ప్రభుత్వం హయాంలో పంటలకు గిల్లుబాటు ధర లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
రాష్ట్రానికి అభివృద్ది లేదు, ప్రజలకు మనశ్శాంతి లేదు గానీ, మద్యం మాత్రం ఏరులై పారుతోందని కిరణ్ ప్రభుత్వం తీరును దుయ్యబట్టారు. మహాత్మా గాంధీ తమకు ఆదర్శం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ మద్యం మాఫియా డాన్ బొత్స సత్యనారాయణకు పిసిసి అధ్యక్షుడి పదవి కట్టబెట్టడం దారుణమని శ్రీమతి షర్మిల విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్నది గాంధేయా వాదమా లేక బ్రాందేయ వాదమా? అని ఎద్దేవా చేశారు. మద్యం వ్యాపారంలో బొత్సకు మించిన వారే లేరని ప్రజలందరికీ తెలుసన్నారు. ఈ ప్రభుత్వానికి మద్యం మీద ఉన్న శ్రద్ధలో పదో వంతైనా ప్రజల మీద ఉంటే ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడో బాగుపడేవారన్నారు. బొత్స కుటుంబానికి ప్రజల బాగోగులు పట్టలేదని దుయ్యబట్టారు. మద్యం మాఫియా నుంచి అన్ని మాఫియాల్లోనూ బొత్స కుటుంబమే ఉందని జిల్లాలోని ప్రతి ఒక్కరూ చెబుతున్నారన్నారు. దోచుకోవడం, దాచుకోవడమే బొత్స కుటుంబం తీరు అని స్థానిక ప్రజలే చెబుతున్నారన్నారు. వీళ్ళను నాయకులు అనాలా లేక ఖల్ నాయకులు అనాలా అని ప్రశ్నించారు. మన రాష్ట్రాన్ని మహానేత రాజశేఖరరెడ్డి హరితాంధ్రప్రదేశ్గా చేస్తే.. ఇలాంటి నీచమైన నాయకులు మద్యాంధ్రప్రదేశ్గా మారుస్తున్నారని శ్రీమతి షర్మిల విమర్శించారు.
ఈ దుర్మార్గమైన ప్రభుత్వంపై ప్రతిపక్షాలన్నీ కలిసి అవిశ్వాస తీర్మానం పెడితే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు మాత్రం విప్ జారీ చేసి మరీ కూలిపోకుండా కాపాడారని శ్రీమతి షర్మిల ఆరోపించారు. ఈ ప్రభుత్వం కూలిపోయి ఉంటే ఈ కరెంటు కోత, చార్జీల బాదుడు మన నెత్తిన పడేది కాదన్నారు. ప్రజల పక్షాన నిలబడకుండా కాంగ్రెస్కు అమ్ముడుపోయిన చంద్రబాబును నాయకుడనాలా లేక దుర్మార్గుడనాలా అని ప్రశ్నించారు. ప్రతి విషయంలోనూ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. కుమ్మక్కైన అధికార, ప్రధాన ప్రతిపక్షాలు ఒకదాన్ని మరొకటి విమర్శించుకోవడంలేదని, అవి రెండూ శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డిని, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నాయని అన్నారు.
లిక్కర్ కింగ్ సత్తిబాబు మీద కేసులు అనే ఆయుధాన్ని కిరణ్కుమార్రెడ్డి ప్రయోగించారు. కిరణ్కు వ్యతిరేకంగా శిబిరం పెట్టిన బొత్స వెంటనే వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుని బొత్స లొంగిపోయారని శ్రీమతి షర్మిల విమర్శించారు. అధికారులను బదిలీ చేసి తన మీద కేసులు లేకుండా చూసుకున్నారన్నారు. ఇదీ బొత్సగారి మార్కు రాజకీయం అని ఎద్దేవా చేశారు. కానీ బోనులో ఉన్నా సింహం సింహమే అన్నారు. ఉదయించే సూర్యుడ్ని ఆపలేనట్లే జగనన్ననూ ఎవ్వరూ ఆపలేరని ధీమాగా చెప్పారు.
త్వరలోనే జగనన్న వస్తారని, మనందర్నీ రాజన్న రాజ్యం దిశగా నడిపిస్తారన్నారు. జగనన్న నేతృత్వంలో రాజన్న రాజ్యం వచ్చాక రాజన్న ప్రతి కలనూ నెరవేరుస్తారన్నారు. రైతులు, విద్యార్థులు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఇలా ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో పయనించేలా చేస్తారన్నారు. జగనన్న సిఎం అయ్యాక అమలు చేసే సంక్షేమ పథకాల గురించి శ్రీమతి షర్మిల వివరించారు. రాబోయే రాజన్న రాజ్యం మళ్ళీ ఒక సువర్ణ యుగం అవుతుందని, అది ఒక్క జగనన్న వల్లే సాధ్యమవుతుందన్నారు. కొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు, మరి కొన్ని నెలల్లో సాధారణ ఎన్నికలు వస్తున్నాయని, ఏ ఎన్నికలు వచ్చినా ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి, దానితో కుమ్మక్కయిన చంద్రబాబుకు గట్టిగి బుద్ధి చెప్పి, జగనన్నను ఆశీర్వదించాలని, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని శ్రీమతి షర్మిల ప్రజలకు విజ్ఞప్తిచేశారు.
http://www.ysrcongress.com/news/top_stories/smt-sharmila-slamed-on-congress-tdp.html
0 comments:
Post a Comment