రాజన్న రాజ్యానికి ఓటేయాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాజన్న రాజ్యానికి ఓటేయాలి

రాజన్న రాజ్యానికి ఓటేయాలి

Written By news on Monday, July 22, 2013 | 7/22/2013

రాజన్న రాజ్యానికి ఓటేయాలి: విజయమ్మ
ఓటర్లకు వైయస్ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలి వినతి
హైదరాబాద్ 22 జూలై 2013:
 మీ అనుభవాల్ని దృష్టిలో ఉంచుకుని పంచాయతీ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆమె సోమవారం ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. లేఖ పూర్తి పాఠం ఇలా ఉంది.

నాలుగేళ్ళ క్రితం మీరు, మీ కుటుంబం  ఎలా ఉన్నారు? ఇప్పుడెలా ఉన్నారు? ఈ ప్రశ్నకు ఎవరిని అడిగినా సమాధానం చెబుతారు. నాలుగేళ్ళుగా వ్యవసాయం దెబ్బతింది. ఎరువుల ఖర్చులు 300 నుంచి 800 శాతం పెరిగాయి. వ్యవసాయ పెట్టుబడులు పెరిగాయి. గిట్టుబాటు, మద్దతు ధరలు లభించటం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం పల్లెల్ని మరిచిపోయింది. పంచాయతీ ఎన్నికలను నిర్వహించే ధైర్యం ప్రభుత్వానికి లేకపోయింది. నోడల్ ఆఫీసర్లను పెట్టి గతంలో పంచాయతీలను, అధికారాలనూ నాశనం చేసిన చరిత్ర చంద్రబాబు గారిది. ఈ విషయాన్ని ప్రపంచ బ్యాంకే చెప్పింది. పల్లె బాగుండాలంటే రైతులు, కూలీలు బాగుండాలి. వ్యవసాయానికి అనుబంధంగా కుల వృత్తులు, గ్రామీణ వృత్తులు శతాబ్దాలుగా చేసుకుంటున్న అన్ని సామాజిక వర్గాలూ బాగుండాలి. చంద్రబాబు హయాంలో ఈ పరిస్థితి లేదు. రాయితీ మీద బియ్యమే ఇవ్వడానికి వీలులేదని వాదించిన చరిత్ర ఆయనది. రెండు రూపాయల బియ్యాన్ని రూ. 5.25 కు పెంచిన చరిత్ర కూడా ఆయనదే. నీటి ప్రాజెక్టులు కడితే ఖర్చు ఎక్కువ, రాబడి తక్కువ అని చెప్పిన చరిత్ర చంద్రబాబుగారికి మాత్రమే ఉంది. మీ గ్రామంలో రోడ్డు వేసుకోవాలన్నా.. చెరువు బాగు చేసుకోవాలన్నా, బడిలో తరగతి గదులు బాగుచేసుకోవాలన్నా ప్రజలే చందాలు వేసుకుని.. లేదా పలుగు పారా చేత పట్టుకుని చేసుకోవాలని చంద్రబాబు చెప్పారు. అదీ ఆయన రూపొందించిన విజన్ 2020. అదీ ఆయన గారి గ్రామ స్వరాజ్యం. చివరికి మనిషి చచ్చిపోతుంటే.. ఒక 108, 104 ఆరోగ్యశ్రీ లేకపోవటమే కాదు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రతి సేవకీ యూజర్ చార్జీలంటూ.. పేదల నుంచి డబ్బులు పిండిన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి ఈరోజు గ్రామాలకు ఏదో చేశానంటారు. ఆయన పాలనలో రైతులకు రుణ మాఫీ లేదు. ఉచిత విద్యుత్తు లేదు. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు తీసివేయటమే తప్ప నియామకాలు లేవు. గ్రామాల్లో కరెంటు కోత తప్ప కరెంటే లేదు. ఏటా ఆర్టీసీ చార్జీల భారం. ఏటా విద్యుత్తు చార్జీల భారం.. ఇలా ప్రతీదీ ప్రజల మీద బరువు వేసి బిల్ క్లింటన్, టోనీ బ్లెయిర్ తో ఫొటోలు దిగి రాష్ట్రంలో గ్రామాల్ని సర్వనాశనం చేశారు. చంద్రబాబు.

గత నాలుగేళ్ళలో, మహానేత, వైయస్ రాజశేఖరరెడ్డిగారు మరణించిన తర్వాత.. మళ్ళీ చంద్రబాబుగారి పాలనలో ఎలాగైతే చార్జీలు విధించటమే ఏటా పనిగా పెట్టుకున్నారో.. ఇప్పుడూ అలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. ఈ రెండు పార్టీలూ వాటి అభ్యర్థులను మీ గుమ్మం ముందుకు వచ్చినప్పుడు ప్రజలుగా ఒక్క ప్రశ్న అడగాలి. మీరు మాకేం చేశారు అని ప్రశ్నించండి... ఏదో చేశాం.. అని చెబితే కుదరదు. మా ఇంటికి, ఇందులో కుటుంబ సభ్యులకు మీరేం ప్రయోజనం చేశారో చెప్పండి.. అని నిలదీయండి. కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం కానీ మద్యాన్ని పంచగలవు. పచ్చ నోట్టను వెదజల్లగలవు. కానీ అభిమానాన్ని, ఆప్యాయతల్ని పంచలేవు. వంచనకు మారు పేరుగా మారిన ఈ రెండు పార్టీల కూటమి మంచి పరిపాలన ద్వారా కాకుండా ప్రలోభాల ద్వారా మాత్రమే పరువు దక్కించుకోవాలనుకుంటోంది. వారి కుట్రల్ని పటాపంచలు చేయండి. ఎన్నికల క్షేత్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తలపడలేక, జన నేతను తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయించిన వారిని తిరస్కరించండి.

తన ఎనిమిదేళ్ళ ఎనిమిది నెలల పదమూడు రోజుల పాలనను మళ్ళీ తీసుకువస్తాం.. అని చంద్రబాబుగారే ఎందుకు చెప్పలేకపోతున్నారు? అలాగే, రాజశేఖరరెడ్డిగారు 5 ఏళ్ళ 3 నెలల పరిపాలనలో ఏ ఒక్క చార్జీ పెంచకుండా సువర్ణయుగాన్ని అందిస్తే, కాంగ్రెస్ వారు ఈ నాలుగేళ్ళలో కరెంటు చార్జీలు, ఆర్టీసీ చార్జీలు ఇంతగా పెంచారు కదా? వారు ఎలా ఓట్లు అడగటానికి వస్తున్నారు? కేవలం రెండే రెండు వాగ్దానాలు 2009 కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఉన్నాయి. 9 గంటల ఉచిత విద్యత్తు, 30 కిలోల బియ్యం- ఈ రెండు కూడా అమలుచేయలేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామంటే ఎవరు నమ్ముతారు? చంద్రబాబు-రాజశేఖరరెడ్డిగారు-కిరణ్.. ఈ ముగ్గురి పాలనల గురించి ప్రజలకు ఎవరో చెప్పాల్సిన పనిలేదు. ఈ ముగ్గురి ప్రభుత్వాల్లో కష్టసుఖాలేమిటో ప్రజలు నేరుగా అనుభవించారు. కాబట్టే అధికారం ఎవరి చేతిలో పెట్టాలి-ఎవరిని అధికారానికి దూరంగా పెట్టాలన్న విషయంలో ప్రజలే సరైన నిర్ణేతలు.

అధికారంలోకి రాగానే రాజశేఖరరెడ్డిగారి పారిపాలనను జగన్మోహన్ రెడ్డిగారు అందిస్తారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గర్వంగా చెబుతోంది. అలాంటి పరిస్థితి మిగిలిన పార్టీల్లో లేదు. కాబట్టి మీ సంక్షేమం, మీ బిడ్డల సంక్షేమం మొత్తంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీ ఓటును ఆయుధంగా మలచుకోండి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే కాకుండా- ప్రజల కష్టాలు, నష్టాలు తెలుసుకుని తనకు తానే పథకాలు అమలు చేసిన రాజశేఖరరెడ్డిగారి సువర్ణ యుగానికి మరోసారి పునాదులు వేయండి. పంచయతీ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరిగేవి కావు. ఇవి మీ సంక్షేమాన్ని మీరే నిర్ణయిచుకోవటంలో మొదటి మెట్టులాంటివి. సంక్షేమాన్ని వ్యతిరేకించి చార్జీల భారాన్ని ప్రజల నెత్తిన వేసి గ్రామ సీమల్ని స్మశానాలుగా మార్చిన చరిత్ర గల పార్టీలను ఈ ఎన్నికల్లోనే తిరస్కరించటం అవసరం. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ పంచాయతీ ఎన్నికల్లోనూ వైయస్ఆర్ అభిమానుల్ని వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా ఎన్నుకోవటం ద్వారా రాజన్న రాజ్యాన్ని మళ్ళీ తెచ్చుకునేందుకు బాటలు పరవండి. ఇది తన వినమ్ర విజ్ఞప్తని శ్రీమతి విజయమ్మ ఆ లేఖలో తెలిపారు.
http://www.ysrcongress.com/news/top_stories/vijayamma-appeals-to-voters.html

Share this article :

0 comments: