శ్రీకాకుళం: సమన్యాయం లేదా సమైక్యాంధ్ర అన్న నినాదంతో వైఎస్సార్ కాంగ్రెస్ చేపడుతున్న ఆందోళనల్లో భాగంగా జిల్లాలో వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న బస్సుయాత్రకు అనూహ్య స్పందన లభిస్తోంది. శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజవకర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ యాత్ర చేపట్టిన జిల్లా పార్టీ నాయకత్వం నాలుగు నియోజకవర్గాల్లో పర్యటన పూర్తి చేసింది. సోమవారం పాతపట్నం నియోజకవర్గంలో జరిగింది. సమైక్యాంధ్ర విషయంలో మొదటి నుంచీ వైఎస్ఆర్సీసీ విధానాన్ని సమర్థిస్తున్న ప్రజలు బస్సుయాత్రకు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. రోజుకో నియోజవర్గంలోని అన్ని మండలాల్లోనూ పార్టీ నాయకులు బస్సు యాత్ర సాగిస్తూ ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, రాష్ట్ర విభజన వల్ల కలిగే నష్టాలు, ఈ పరిస్థితికి కారణమైన కాంగ్రెస్, టీడీపీల తీరును సమగ్రంగా వివరిస్తున్నారు.
సాయంత్రం నియోజకవర్గ కేంద్రంలో జరిగే సభల్లో ముఖ్య నాయకులు ప్రసంగించి పార్టీ అనుసరిస్తున్న విధానాలను, సమన్యాయం కోసం పోరాడుతున్న తీరును వివరిస్తున్నారు. ఇప్పటివరకు నరసన్నపేట, ఆమదాలవలస, పలాస, పాతపట్నం నియోజకవర్గాల్లో యాత్ర పూర్తయ్యింది. టెక్కలి, శ్రీకాకుళం, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో జరగాల్సి ఉంది. దీనిపై పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ ప్రజల శ్రేయస్సే వైఎస్ఆర్సీపీ ధ్యేయమని అన్నారు. కాంగ్రెస్, టీడీపీలు స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజలను దారుణంగా హింసిస్తున్నారన్నారు. ఒకే భాష మాట్లాడే ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకునే పరిస్థితిని తీసుకువచ్చారని విమర్శించారు.
రాష్ట్రంలో ప్రస్తుత సంక్షోభానికి కారణమైన ఆ రెండు పార్టీలను జనం తిరస్కరించాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ ఎల్లవేళలా ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు. జరుగుతున్న పరిణామాలను ప్రజలకు వివరించేందుకే బస్సుయాత్ర చేపట్టినట్లు చెప్పారు. రాష్ట్రంలోనే వినూత్నంగా శ్రీకాకుళం జిల్లాలో యాత్ర ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు జరిగిన నాలుగు నియోకవర్గాల యాత్రలోనూ ప్రజలు పార్టీని ఎంతగానో ఆదరించారని చెప్పారు. సోమవారం పాత పట్నం నియోజకవర్గంలో జరిగిన సభలో వేల మంది మహిళలు పాల్గొన్నారన్నారు. బస్సుయాత్రను వినియోగించుకొని వైఎస్ఆర్సీపీ శ్రేణులు జనబాహుళ్యంలోకి చొచ్చుకుపోవాలని కోరారు.
0 comments:
Post a Comment