తెలుగువాళ్లందరికీ సమన్యాయం చేసే సత్తాలేకుంటే.. హక్కూ ఉండదు: షర్మిల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తెలుగువాళ్లందరికీ సమన్యాయం చేసే సత్తాలేకుంటే.. హక్కూ ఉండదు: షర్మిల

తెలుగువాళ్లందరికీ సమన్యాయం చేసే సత్తాలేకుంటే.. హక్కూ ఉండదు: షర్మిల

Written By news on Monday, August 5, 2013 | 8/05/2013

తెలుగువాళ్లందరికీ సమన్యాయం చేసే సత్తాలేకుంటే.. హక్కూ ఉండదు: షర్మిల
 ‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నిప్పులు చెరిగారు. రాష్ట్ర విభజనంటూ జరిగితే తెలుగువాళ్లందరికీ న్యాయం జరిగేలా ఉండాలని ఆమె డిమాండ్ చేశారు. ‘‘కాంగ్రెస్ పార్టీని సూటిగా ఒకటే మాట అడుగుతున్నాం. మీరు న్యాయం(తెలుగువాళ్లందరికీ) చేయలేకపోతే, ఆ(విభజన) బాధ్యతనుకానీ, ఆ అధికారాన్ని కానీ ఎందుకు తీసుకున్నారు? అని అడుగుతున్నాం. మీపాటికి మీరు ఒక నిర్ణయం తీసేసుకొని ఇక ‘మీ ప్రాప్తం ఇంతే, మీ ఖర్మ ఇంతే’ అని మీ నిర్ణయాన్ని కోట్ల మంది ప్రజల మీద రుద్దితే అది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా?’’ అని ఆమె నిలదీశారు. ‘‘వైఎస్సార్ రాష్ట్రాన్నంతా సమానంగా ప్రేమించారు. 
 
 ప్రతి తెలుగు కుటుంబం సంతోషంగా ఉండాలని తపించారు. రాజశేఖరరెడ్డి పేరు మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన జగన్‌మోహన్‌రెడ్డి కూడా తెలుగు ప్రజలంతా తన కుటుంబమేనని ఎన్నోసార్లు చెప్పారు. తెలుగు ప్రజల్లో ఏ ఒక్కరికి అన్యాయం జరుగుతున్నా చూస్తూ ఊరుకునే వ్యక్తి కాదు జగన్‌మోహన్‌రెడ్డి. ఆయన ఉద్దేశం ఒకటే ఒకటి.. తెలుగువాడు అనే ప్రతివాడూ సంతోషంగా ఉండాలి. తెలుగువాళ్లందరికీ సమాన న్యాయం ఉండాలి. తెలుగువాళ్లందరికీ సమాన హక్కులు ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి మళ్లీ చెప్తున్నాం.. తెలుగువాళ్లందరికీ న్యాయం చేసే సత్తా మీకు లేకపోతే, ఆ బాధ్యతను, ఆ అధికారాన్ని తీసుకునే హక్కు మీకు ముమ్మాటికీ లేదు’’ అని ఆమె ఉద్ఘాటించారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర ఆదివారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగిసింది. ముగింపు సభకు భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ఈ ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..
 
 రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ ఎత్తుగడ..
 ‘‘కాంగ్రెస్ పార్టీ కేవలం వాళ్ల రాజకీయ లబ్ధి కోసం మన రాష్ట్రాన్ని తలకాయ ఒకరికి, మొండెం ఒకరికి అని విడగొట్టడానికి ప్రయత్నిస్తోంది. ఇలా పైభాగం ఒకరికి, కింది భాగం ఒకరికి అని ఇస్తే, కిందిభాగం వారికి సాగునీరు కాదు కదా.. కనీసం తాగునీరు కూడా దిక్కుండదని తెలిసి కూడా ఈ పాపానికి పూనుకుంది. ఇప్పటికే మహారాష్ట్రలో వాళ్ల అవసరాలు తీరాక, కర్ణాటకలో ఆల్మట్టి డ్యాం నిండితే తప్ప కింద ఉన్న మన రాష్ట్రానికి నీళ్లు ఇవ్వని తీరును చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఏమార్పులూ చేయకుండానే మధ్యలో ఇంకొక రాష్ట్రాన్ని సృష్టిస్తే ఇక శ్రీశైలం పాజెక్టుకు, నాగార్జున సాగర్‌కు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పిస్తామని అంటున్నారు. కానీ ఆ పోలవరానికి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో చెప్పడం లేదు. శ్రీకాకుళం నుంచి కుప్పం దాకా సముద్రం నీళ్లు తప్ప మంచి నీళ్లు ఎక్కడున్నాయి? ఇలా సీమాంధ్రను విడగొడితే ఈప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుందో, అసలు ఈ ప్రాంతం ఒక మహా ఎడారిగా అయిపోతుందనే కనీస ఇంగితం ఈ నాయకులకు లేదు అనుకోవాలా? లేకపోతే సీమాంధ్ర ఎడారి అయిపోయినా ఫర్వాలేదు, తమకు తెలంగాణలో 15 సీట్లు వస్తే చాలు అనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నారు అనుకోవాలా?
 
 రాజధానిలో భాగం ఎందుకు ఉండకూడదు?
 గతంలో మద్రాసును తీసేసుకున్నారు, తరువాత హైదరాబాద్‌ను అందరూ కలిసి కట్టుకుంటే 60 ఏళ్ల తర్వాత ఇప్పుడు దాన్ని కూడా తీసేసుకుంటారా? హైదరాబాద్ ఇంతగా అభివృద్ధి అయిందంటే అందులో సీమాంధ్రుల కృషి లేదా? మరి సీమాంధ్రులకు హైదరాబాద్‌లో ఎందుకు భాగం ఉండకూడదు? విభజన జరక్కముందే కేసీఆర్ సీమాంధ్ర వాళ్లు వెళ్లిపోవాలి అంటున్నారంటే, ఇక విభజన జరిగిన తరువాత హైదరాబాద్‌లో సీమాంధ్రులు బతకడం అంటే పాకిస్థాన్‌లో బతికినంత కష్టం అయిపోదా? విశాల భారతదేశంలో ఏ పౌరునికైనా, ఎక్కడైనా బతికే హక్కులేదా? ఇలా నీళ్లూ ఇవ్వక, హైదరాబాద్ ఇవ్వక ప్రతి విషయంలో అన్యాయం చేస్తే కింది ప్రాంతం వాళ్లు ఎలా బతుకుతారు అనుకున్నారు?
 
 గాజులు తొడుక్కున్నారా? గాడిదలు కాస్తున్నారా?
 ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు ఇంత మంది సీమాంధ్రులుగా ఉండి కూడా.. సీమాంధ్రులకు జరుగుతున్న అన్యాయం మీద ఒక్క మాట కూడా మాట్లాడలేదూ అంటే పదవుల కోసం వీళ్లు ఢిల్లీలో తెలుగు ఆత్మగౌరవాన్ని ఎలా తాకట్టు పెట్టారో స్పష్టంగా అర్థమవుతోంది. ఈ మొత్తం విషయంలో ప్రజల పక్షాన ఎవరైనా నిలబడ్డారు అంటే అది కేవలం జగనన్న నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ల నిరసన తెలియజేయటానికి రాజీనామాలను ఎప్పుడో ఇచ్చారు. కానీ ఎంత మంది కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు ఇచ్చారు? ఎంత మంది కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సీమాంధ్రకు అన్యాయం జరుగుతుందని గొంతెత్తారు? వీళ్లందరూ ఏం చేస్తున్నారు? గాజులేసుకొని కూర్చున్నారా? లేక గాడిదలు కాస్తున్నారా? అని ప్రజలు అడుగుతున్నారు. ప్రజలకంటే వీళ్లకు పదవులే ముఖ్యమని మళ్లీ నిరూపించుకున్నారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలకు వెన్నుపోట్లు పొడిచిన ఇలాంటి వారిని నాయకులు అనాలా? లేక రాక్షసులు అనలా? ఈ తరం కాదు కదా.. భవితరాలు, తరతరాలు ఎప్పటికైనా క్షమిస్తాయా అంటే ఎప్పటికీ క్షమించరు.
 
 అబద్ధాలకు మారుపేరు చంద్రబాబు..
 మోసం, వెన్నుపోట్ల నుంచి పుట్టిన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఈయన రైతులను మంచి హైటెక్ ముఖ్యమంత్రి అనిపించుకొని ఆనందించారు. పన్నుల మీద పన్నులు పెంచి ప్రజలను కాల్చుకుతిన్నారు. శాకాహారిగా మారానని చెబుతూ.. చెరువులో ఒంటికాలు మీద జపం చేసి ఆ చెరువులో ఉన్న చేపలన్నిటినీ తినేసిన మాయకొంగ లాంటి వాడు ఈ చంద్రబాబు నాయుడు. వేల కొద్దీ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, లక్షలాది మంది పొట్టచేత పట్టుకొని వలసలు పోతుంటే ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న చంద్రబాబు ఏ ఒక్కరోజూ కారణాలు వెతకలేదు. తలతిప్పి వారి వైపు చూడలేదు. ఇప్పుడు మన రాష్ర్టం రెండు ముక్కలైపోతున్నా, ప్రతి విషయంలో అన్యాయం జరుగుతున్నా చంద్రబాబునాయుడు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదంటే ఈయనను నాయకుడు అనలా? లేక ఖల్‌నాయకుడు అనుకోవాలా? రూ.4 లక్షల కోట్లు ఇవ్వండీ, హైదరాబాద్‌ను తీసేసుకోండని, హైదరాబాద్‌ను కూడా అమ్మకానికి పెట్టారు అంటే ఈయన్ను ఏమనుకోవాలి? కోట్ల మంది సీమాంధ్రులకు అన్యాయం జరుగుతుంటే ఒక ప్రతిపక్ష నాయకునిగా కాంగ్రెస్ పార్టీని ఏమీ అనటం లేదూ అంటే, కనీసం ఒక్కసారంటే ఒక్కసారి కూడా వారి పక్షాన నోరు విప్పలేదు అంటే ఆయన కాంగ్రెస్ పార్టీతో ఏ స్థాయిలో కుమ్మక్కయ్యారో అర్థమైపోతోంది.
 
 చంద్రబాబుకి అధికారమివ్వడమంటే..
 తెలుగుదేశం పార్టీ బతికే ఉందో చనిపోయిందో పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. 2009 నుంచి ఇప్పటి వరకు 50 అసెంబ్లీ స్థానాల్లో, రెండు పార్లమెంటు స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగితే వాటిలో ఈ పార్టీ ఒక్కటంటే ఇక్క స్థానం గెలుచుకోలేదు. ఇదీ చంద్రబాబు సత్తా. వేరే ఏదైనా రాజకీయ పార్టీ అయితే ఇన్ని వరుస ఓటములకు అధ్యక్షుడిని ఎప్పుడో ఇంటికి పంపేసేవారు. కానీ టీడీపీ, ఎల్లో మీడియాకు చంద్రబాబు కంటే వేరే దిక్కేలేదు. అందుకనే ఈ బాబును ఇంకా భుజాన వేసుకొని మోస్తున్నారు. హరిశ్చంద్రుడు ఎప్పటికీ అబద్ధం చెప్పడు అన్నది ఎంత వాస్తవమో, చంద్రబాబు నిజం చెప్పరు అన్నది కూడా అంతే వాస్తవం. ఇలాంటి చంద్రబాబు తనకు అధికారం ఇస్తే మన రాష్ట్రాన్నే కాదు.. దేశాన్నే గాడిలో పెడతాను అంటున్నారు. ఈ చంద్రబాబుకు అధికారం ఇవ్వడం అంటే ఒక నరకాసురునికో, హిట్లర్‌కో మళ్లీ అధికారం ఇచ్చినట్టే. బాబుకు మళ్లీ అధికారం ఇవ్వడం అంటే మన గొయ్యి మనమే తవ్వుకున్నట్లే.
 
 టీఆర్‌ఎస్ విలీనమంటే.. క్విడ్ ప్రో కో కాదా?
 2009లో వైఎస్సార్ ఎలా మరణించారు అన్నది ఈ రోజు వరకు అంతుపట్టని విషయం. ఆలాగే జగన్‌మోహన్‌రెడ్డి ఎందుకు అరెస్టు అయ్యారో ఈ రోజు వరకు అంతు పట్టని విషయమే. నిజానికి ఏ నేరం జరుగలేదు, నేరాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. అభియోగాలు మోపారు, అబద్ధపు కేసులు పెట్టారు. 26 జీవోల కేసులో కోర్టు నోటీసులు ఇచ్చినపుడు జగన్‌మోహన్‌రెడ్డి 52వ రెస్పాండెంటు. మంత్రులు, అధికారులు 1 నుంచి 15 వరకు రెస్పాండెంట్లుగా ఉన్నారు. ఆశ్చర్యం ఏమిటంటే 52వ రెస్పాండెంటు జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్టు చేశారు. 1 నుంచి 15 రెస్పాండెంట్లుగా ఉన్న మంత్రులు, అధికారులు ఇంకా స్వేచ్ఛగా పదవులు అనుభవిస్తున్నారు. ఈ కేసులో జగన్‌మోహన్‌రెడ్డి ఏ1గా ఉంటారని, ఆడిటర్ సాయిరెడ్డి ఏ2గా ఉంటారని ఏ విచారణాప్రారంభం కాకముందే సీబీఐ అధికారి చెప్పారు. అంటే ఈ సీబీఐ కేసును ఎలా నడపదలుచుకుందో ఆ రోజే అర్థమయింది. దీన్ని దర్యాప్తు అంటారా? లేక దిక్కు మాలిన కుట్ర రాజకీయాలు అంటారా? 26 జీవోలు ప్రభుత్వం ఇస్తే జగన్‌మోహన్‌రెడ్డి క్విడ్ ప్రో కోకు పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది. జగన్‌మోహన్‌రెడ్డి మీద శంకర్రావు కేసు పెట్టిన తరువాత ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. ఇది క్విడ్ ప్రో కో కాదా? చంద్రబాబు ఈ ప్రభుత్వాన్ని కాపాడినందుకు ప్రతిఫలంగా ఆయన మీద ఏ కేసుల్లో కూడా విచారణ జరుపకపోవడం క్విడ్ ప్రో కో కాదా? ఇన్నేళ్ల తరువాత ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో కలుపుకోవడం కోసం తెలంగాణ ఇస్తున్నామని చెప్తున్నారే ఇది క్విడ్ ప్రో కో కాదా? అని ప్రశ్నిస్తున్నాం.’’
Share this article :

0 comments: