ఎవరు ఎవరితో కుమ్మక్కు అయ్యారో ఇంతకన్నా వేరే చెప్పాలా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎవరు ఎవరితో కుమ్మక్కు అయ్యారో ఇంతకన్నా వేరే చెప్పాలా?

ఎవరు ఎవరితో కుమ్మక్కు అయ్యారో ఇంతకన్నా వేరే చెప్పాలా?

Written By news on Wednesday, September 18, 2013 | 9/18/2013

సాక్షి, హైదరాబాద్: న్యాయస్థానాలలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్ పెట్టుకున్న ప్రతిసారీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేతలు స్వయంగా వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో, దర్యాప్తు అధికారులతో సమావేశమవడం పరిపాటిగా మారిందని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు విమర్శించారు. కచ్చితంగా ఏదో ఒక సెన్సేషన్ వచ్చేలా.. న్యాయస్థానాలను ప్రభావితం చేసేలా.. ఏదో ఒక నోటీసు ఇప్పిస్తున్నారని, బెయిల్‌ను అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలు పరాకాష్టకు చేరాయని మండిపడ్డారు. ఈ మేరకు పార్టీ శాసనసభాపక్ష ఉపనేత మేకతోటి సుచరిత, సీఈసీ సభ్యురాలు ఉప్పులేటి కల్పన, అధికార ప్రతినిధి ఆర్‌కే రోజా సంయుక్తంగా మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
 
 ప్రకటన పూర్తి పాఠమిదీ..
 ‘‘ఏ నేరమూ చేయకపోయినా 16 నెలలుగా నిర్బంధంలో ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీద చంద్రబాబు నాయుడు, ఆయన ఎల్లో మీడియా మళ్లీ దుష్ర్పచారం ప్రారంభించాయి. సుప్రీంకోర్టు విధించిన గడువు ముగిసిన నేపథ్యంలో జగన్ బెయిల్ కోసం అభ్యర్థించారు. సీబీఐ చార్జిషీట్లు వేస్తోంది. ఈ రెండూ గమనించిన చంద్రబాబు, ఎల్లో మీడియా తమదైన శైలిలో దుష్ర్పచారాన్ని అందుకున్నాయి. ఒక పరిశ్రమ వారు విస్తరణ చేపట్టి అందుకోసం నీరు వాడుకున్నా, వారే నీరు అడిగినా, ప్రభుత్వం ఆ  నీరు ఇచ్చినా దాన్ని తప్పు పడుతున్నారు. నీరు, కరెంటు వంటివి కూడా పరిశ్రమలకు ఇవ్వకపోతే ఎక్కడైనా, ఏ రాష్ట్రంలో అయినా పరిశ్రమలు వస్తాయా? అలాంటి అంశాలను కూడా తప్పుపట్టే అన్యాయమైన పరిస్థితిని ఈ రోజు మనమంతా చూస్తున్నాం. నిజానికి వారు ఇలా జగన్ మీద ఎక్కడా, ఏ కేసూ లేకపోయినా దీన్ని ఒక కేసులా చూపిస్తున్నారు.
 
 బాబు దుర్నీతికి నిదర్శనం..: ఒక వ్యక్తి తన సొంత భూమిలో తన సొంత డబ్బుతో హోటల్ కట్టుకొన్నా, సర్వ సాధారణంగా అందరికీ ఇచ్చే అనుమతినే ఆ హోటల్‌కు ఇచ్చినా తప్పులుపట్టే దారుణమైన పరిస్థితులలో ఈ రోజు ఈ విచారణ జరుగుతున్న తీరును చూస్తున్నాం. ఇరికించడానికి ఇక ఏమీ లేదన్నా, కొన్ని ఆరోపణల్లో ఏమీ లేదన్నా అది కూడా చంద్రబాబుకు, ఎల్లో మీడియాకు నచ్చడం లేదు. ఇంకా దర్యాప్తు  కొనసాగించాలి.. ఏమీ లేకపోయినా జగన్‌మోహన్‌రెడ్డి మీద దర్యాప్తు కొనసాగించాలి..  నేరం రుజువు కాకపోయినా, చట్ట ప్రకారం మూడు నెలల్లో రావాల్సిన బెయిల్ ఇవ్వకపోయినా... రాజకీయంగా జగన్‌మోహన్‌రెడ్డిని అణగదొక్కవచ్చని, ఆయన్ను ఇంకా ఎక్కువ రోజులు నిర్బంధించేలా చేయొచ్చన్న దుర్నీతి బాబుది, ఎల్లో మీడియాది, ఈ కుమ్మక్కు రాజకీయాలది.
 
 బాబుపై దర్యాప్తే ఉండదు..: ఎందుకు ఎమ్మార్ కేసులో శెనక్కాయలకు, పప్పులకు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న భూమిని చంద్రబాబు కట్టబెట్టారు? ఎందుకంటే.. విలాసవంతమైన బంగ్లాలు కట్టుకొని అమ్ముకునేందుకు... శ్రీమంతులు ఆడుకునే గోల్ఫ్ కోర్స్ కట్టుకునేందుకు! అన్ని నిబంధనలూ అతిక్రమించి చంద్రబాబు ఆ భూముల్ని పప్పు బెల్లాల్లా పంచి ఇచ్చినా దర్యాప్తు చేస్తున్న సీబీఐకి అది కనపడదు. ఐఎంజీ కేసు అయితే ఇంకా దారుణం. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉంటూ, ఆ నిర్ణయం కేబినెట్ ముందుకే వెళ్ళకపోయినా ఒక బోగస్ కంపెనీకి చంద్రబాబు రాజధాని నడిబొడ్డున చిల్లర పైసలకు 850 ఎకరాల భూమిని ఇచ్చేశారు.
 
  దీనిపై విచారణ చేయండి అని హైకోర్టు సీబీఐకి గడువు ఇస్తే, ఇదే సీబీఐ నెలరోజులు గడువు దొరికినా కనీసం చంద్రబాబును పిలవను కూడా పిలవలేదు. ఒక్కొక్కరికి ఒక న్యాయంగా ఈ వ్యవస్థలో నడుస్తున్నప్పుడు, దొంగే ‘దొంగ.. దొంగ...’ అని అరుస్తూ, చీకట్లో చిదంబరాన్ని కలుస్తూ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నప్పుడు, విభజన గొడవ ఇంతగా జరుగుతున్నప్పుడు, ఆ విభజన ప్రస్తావన పక్కదారికి మళ్ళించడం కోసం ఇలాంటి నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నప్పుడు... ఏమనుకోవాలి ఈ చంద్రబాబును, ఈ తెలుగుదేశం పార్టీని, ఈ ఎల్లో మీడియాను చూసి! కాంగ్రెస్ (శంకర్‌రావు), టీడీపీ (అశోక్ గజపతిరాజు, ఎర్రన్నాయుడు తదితరులు)- ఈ రెండు పార్టీలవారూ కలిసి కోర్టులకు వెళతారు! కోర్టులలో ఇద్దరూ కలిసి ఒక వ్యక్తి చనిపోయిన తరువాత, చనిపోయిన దాదాపుగా ఏడాదిన్నర తరువాత, ఆ వ్యక్తి లేనప్పుడు... ఆ వ్యక్తి మీద కేసులు వేస్తారు. అది కూడా, ఆ వ్యక్తి కొడుకు ఒక మాట కోసం కాంగ్రెస్ పార్టీని వీడిన తరువాత ఆ కేసు వేస్తారు!
 
 ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు?: హైకోర్టు 1 నుంచి 12 దాకా ప్రభుత్వానికి సంబంధించిన శాఖలను ప్రతివాదులుగా చేస్తూ జవాబు ఇమ్మని కోరితే, జగన్‌మోహన్‌రెడ్డి 52వ ప్రతివాది అయినా, కోర్టు అడిగిన దానికి సమాధానం చెబితే అంతా కరెక్టుగా జరిగింది అని చెప్పాల్సి వస్తుంది కాబట్టి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించలేదు. స్పందించాల్సిన ప్రభుత్వం స్పందించకపోయినా చనిపోయిన వ్యక్తి మీద కోర్టు విచారణకు ఆదేశించింది. రాజీవ్ గాంధీ చనిపోయిన తరువాత ఆయనమీద ఉన్న బోఫోర్స్ కేసు నుంచి రాజీవ్ గాంధీ పేరును తీసేయడం, రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులు అంటూ రాబర్ట్ వాద్రాను, డింపుల్ యాదవ్‌ను కేసుల నుంచి తీసేయడం అందరికీ కనిపిస్తూనే ఉంది.
 
 కానీ జగన్‌మోహన్‌రెడ్డి విషయానికి వచ్చేసరికి, ఆయన 2009 మే ముందు వరకు రాజకీయాలలో లేకపోయినా, తాను అసలు హైదరాబాద్‌లోనే నివాసం ఉండకుండా బెంగుళూరులో ఉంటున్నా.. మహానేత రాజశేఖరరెడ్డి మరణించి అప్పటికి ఏణ్నర్థం అవుతున్నా.. ఈ వాస్తవాలన్నింటినీ పక్కన పెట్టి, జగన్‌మోహన్‌రెడ్డిని కేసులలోకి తీసుకువచ్చారు. ఎప్పుడు అంటే, 10 నెలలు మౌనంగా ఉండి, ఆ సమయంలో పిలవను కూడా పిలవకుండా, 3 చార్జిషీట్లు వేసేసిన తరువాత, ఎన్నికల్లో బురదజల్లేందుకు ఎన్నికలకు కేవలం 15 రోజుల ముందు అరెస్టులు చేస్తారు.
 
 బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారు: సీబీఐ విషయాలను కో ఆర్డినేట్ చేస్తూ అత్యున్నత స్థానంలో ఉన్న సాక్షాత్తూ జాయింట్ డెరైక్టరే దాదాపుగా ఐదారువందల ఫోన్ కాల్స్ ఎల్లో మీడియాకు చేస్తారు.. అదీ తాను ఎంచుకున్న మీడియా సంస్థలకు! తాను ఎంచుకున్న నెగెటివ్ వార్తలను నాణేనికి రెండవ కోణం చూపకుండా, ఒక మనిషిని అభాసు పాలు చేయాలి అన్న దురుద్దేశంతో సీబీఐ రూల్స్‌ను అతిక్రమించి దురుద్దేశంతో లీకులు ఇస్తారు. 3 నెలల్లో దర్యాప్తు పూర్తి కాకపోయినట్టయితే బెయిల్ ఇవ్వాలి అని చట్టం స్పష్టంగా చెపుతున్నా, బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారంటూ, ప్రతిపక్ష ఎంపీ అన్న సంగతిని కూడా పక్కన పెట్టి, అధికారంలో లేడు అన్న సంగతిని కూడా పక్కన పెట్టి.. ఆయనకు బెయిల్ ఇవ్వటానికి వీల్లేదంటారు.
 
 నాలుగేళ్లుగా కుమ్మక్కు కుట్రలు: నాలుగేళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు ఎలా ఉన్నాయి అంటే, కాంగ్రెస్, తెలుగుదేశం  పార్టీల వారు కలిసి కుమ్మక్కయి కేసులు వేస్తారు, మరోవంక తమ మీద మాత్రం విచారణ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆర్టీఐ కమిషనర్ల పదవులు పంచుకొంటారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఎలక్షన్స్‌లో కూడా కుమ్మక్కయి కలిసి పోటీ చేస్తారు. ఎఫ్‌డీఐ ఓటింగ్‌ల్లో రైతులను, చిన్న వర్తకులను గాలికి వదిలేసి చంద్రబాబు కుమ్మక్కై తన ఎంపీలను కాంగ్రెస్‌కు అనుకూలంగా రాజ్యసభలో గైర్హాజరయ్యేలా చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 32,000 కోట్ల రూపాయల మేరకు ప్రజలపై కరెంటు చార్జీల్ని బాదితే... రాష్ట్రంలో ప్రతిపక్షాలు అన్నీ ఒక్కటై, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే, చంద్రబాబు మాత్రం ఏకంగా విప్‌నే జారీ చేసి.. ఈ మైనార్టీలో ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడతారు.
 
 కుమ్మక్కుకు నిదర్శనం..: చివరికి ఈ కుమ్మక్కు రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయంటే, కోట్ల మంది ప్రజలకు శాశ్వతంగా అన్యాయం చేస్తూ ఓట్లూ సీట్ల కోసం రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంటే, అన్యాయం జరుగుతోందని స్పష్టమైన మరుక్షణం, కాలర్ పట్టుకుని వ్యతిరేకించాల్సిన చంద్రబాబు, విభజనకు మద్దతు తెలుపుతారు. తానిచ్చిన లేఖను వెనక్కు తీసుకోని చంద్రబాబు, తాను రాజీనామా చేయకుండా, తన ఎమ్మెల్యేలు, ఎంపీల చేత రాజీనామా చేయించకుండా, తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్నే తాకట్టు పెడుతున్న ఈ పెద్ద మనిషి కాంగ్రెస్‌తో కుమ్మక్కు అయ్యారా? లేక నిజాయితీతో కూడిన రాజకీయాలు చూపిస్తూ కష్టాల్లో ఉండి కూడా జైల్లో ఉన్నా, ప్రతి సందర్భంలోనూ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు విరుద్ధంగా ఉద్యమిస్తున్న జగన్ కాంగ్రెస్‌తో కుమ్మక్కు అయ్యారా? ఎవరు ఎవరితో కుమ్మక్కు అయ్యారో ఇంతకన్నా వేరే చెప్పాలా?’’
Share this article :

0 comments: