సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్రెడ్డి సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారంలో సీబీఐ మరో మూడు చార్జిషీట్లు దాఖలు చేసింది.
* మూడు రోజుల్లో మరో చార్జిషీట్ దాఖలు చేస్తామన్న సీబీఐ
* దర్యాప్తుపై సోమవారంతో ముగిసిన సుప్రీంకోర్టు గడువు
సీబీఐ డీఐజీ, ఈ కేసు ప్రధాన దర్యాప్తు అధికారి హెచ్.వెంకటేష్ మంగళవారం మూడు చార్జిషీట్లను సీల్డ్ కవర్లో సీబీఐ రెండో అదనపు ప్రత్యేక జడ్జి ఎం.వి.రమేష్కు అందజేశారు. ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్రావు అనారోగ్యంతో రెండురోజులు సెలవులో ఉండడంతో... ఇన్చార్జిగా ఉన్న రెండో కోర్టు న్యాయమూర్తికి ఈ చార్జిషీట్లు సమర్పించారు. జగన్ సంస్థల్లో పెన్నా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్ పెట్టుబడులు పెట్టాయి. వీటికి సంబంధించి రెండు చార్జిషీట్లు వేయటంతో పాటు జగన్కు చెందిన భారతి సిమెంట్స్లోకి వచ్చిన పెట్టుబడులపై మరో చార్జిషీటు వేశారు.
ఈ చార్జిషీట్లకు అనుబంధంగా ఉండే డాక్యుమెంట్లు, సాక్షుల వాంగ్మూలాలను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి వచ్చిన తర్వాత సమర్పిస్తామని నివేదించారు. అలాగే రెండు మూడురోజుల్లో మరో చార్జిషీట్ దాఖలు చేస్తామని వెంకటేష్ కోర్టుకు తెలిపారు. ఈ చార్జిషీట్లలోని నిందితులపై ప్రధానంగా ఐపీసీ 120(బి), రెడ్విత్ 420, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)(డి), 13(2)లను చేర్చినట్లు తెలుస్తోంది. చార్జిషీట్ల దాఖలు సందర్భంగా కోర్టు హాల్లో ఉన్న మీడియా ప్రతినిధులను బయటకు వెళ్లిపోవాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు.
నిందితుల వివరాలు తెలపండి...
‘‘గతంలో విచారణ సందర్భంగా ఈ కేసు దర్యాప్తు పూర్తి చేసేందుకు సుప్రీంకోర్టు సీబీఐకి నాలుగు నెలలు గడువిచ్చింది. ఆ గడువు ఈ నెల 9తో ముగిసింది. గడువు తరవాత జగన్మోహన్రెడ్డి తరఫున మేం బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని కూడా సుప్రీం చెప్పింది. సుప్రీం తీర్పు ప్రకారం జగన్మోహన్రెడ్డికి బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేస్తాం. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ల వివరాలు మాకు తెలిస్తే తప్ప బెయిల్ పిటిషన్లో ఆ విషయాలను పేర్కొనలేం. అందుకే చార్జిషీట్లలో నిందితుల వివరాలను మాకు తెలియజేయండి. చార్జిషీట్ చూసుకునేందుకు ఐదు నిమిషాలు అనుమతించండి’’ అని జగన్ తరఫు న్యాయవాది అశోక్రెడ్డి న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు స్పందించిన న్యాయమూర్తి... మూడు చార్జిషీట్లలో ఉన్న నిందితుల వివరాలను తెలపాలని డీఐజీకి సూచించారు. దీంతో ఆయన నిందితుల వివరాలను అశోక్రెడ్డికి తెలియజేశారు. గతంలో వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బెయిల్ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు.... నాలుగు నెలల్లో దర్యాప్తు పూర్తిచేయాలని ఈ ఏడాది మే నెల మొదటి వారంలో సీబీఐని ఆదేశించింది. ఆ గడువు సోమవారంతో ముగిసింది. సోమవారం సెలవు కావటంతో మంగళవారం సీబీఐ ఈ చార్జిషీట్లు దాఖలు చేసింది.
ప్రజలు ఇది గమనించాలి: సీబీఐ
చార్జిషీట్లలోని వివరాలు తెలియజేసిన సీబీఐ... తన ప్రకటనలో చివర ఒక అంశాన్ని పొందుపరిచింది. ఈ వివరాలన్నిటికీ తమ దర్యాప్తులో వెల్లడైన అంశాలు, దర్యాప్తులో భాగంగా సేకరించిన సాక్ష్యాలే ఆధారమని ప్రజలు గమనించాలని స్పష్టం చేసింది. ‘‘భారతీయ చట్టాల ప్రకారం తుది విచారణలో వారు నేరం చేశారో లేదో తేలేదాకా నిందితులు ఏ నేరమూ చేయలేదనే భావించాలి. ఇది ప్రజలు గమనించాలి’’ అని పేర్కొంది.
0 comments:
Post a Comment