సమైక్య కాంగ్రెస్ పేరుతో సర్కస్ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సమైక్య కాంగ్రెస్ పేరుతో సర్కస్ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు

సమైక్య కాంగ్రెస్ పేరుతో సర్కస్ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు

Written By news on Tuesday, October 29, 2013 | 10/29/2013

* సమైక్య కాంగ్రెస్ పేరుతో సర్కస్ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు
* కాంగ్రెస్ అధిష్టానం డెరైక్షన్.. కిరణ్ అండ్ కో యాక్షన్
* కుమ్మక్కు మిత్రుడు చంద్రబాబుతో కలసి అతితెలివి ఎత్తుగడ
* వైఎస్సార్‌సీపీ ప్రభంజనాన్ని అడ్డుకోవడమే ‘షాడో కాంగ్రెస్’ లక్ష్యం
 
 
** వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ కుదేలైంది
** ఈ నేపథ్యంలో కనీసం ఒక ప్రాంతంలోనైనా కొన్ని సీట్లు సాధించేందుకు రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది
 *కానీ ఈ నిర్ణయంతో సీమాంధ్ర ప్రాంతంలో ఉవ్వెత్తున ఎగసిన ప్రజాగ్రహం దెబ్బకు అక్కడ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా నూకలు చెల్లిపోయాయి

*దాంతో తన కుమ్మక్కు మిత్రుడైన టీడీపీ సహకారంతో అతి తెలివి ఎత్తుగడలకు కాంగ్రెస్ అధిష్టానం దిగుతోంది
** సీమాంధ్రలో ప్రస్తుతానికి తన అవతారాన్ని చాలించాలని, ముఖ్యమంత్రి కిరణ్ సహా కొందరు కాంగ్రెస్ నేతలకే సమైక్యవాదులుగా వేషం వేసి, వారితో ‘షాడో కాంగ్రెస్’ను స్థాపించాలని వ్యూహరచన చేస్తోంది
     
** ఈ ‘నయా సమైక్య కాంగ్రెస్’ నేతలకే వీరసింహాలు, ఊరసింహాలు అంటూ భుజకీర్తులు తగిలిస్తారు. కొత్త పార్టీకి వీర లెవల్లో ప్రచారం చేసి పెట్టే బాధ్యతను ఎప్పట్లాగే ఎల్లో మీడియా-కాంగ్రెస్‌కు నమ్మకమైన మిత్రుడైన టీడీపీ సంయుక్తంగా తీసుకుంటాయి
     
** జనంలో బలంగా వేళ్లూనుకున్న వైఎస్సార్‌సీపీ విశ్వసనీయతను ఎంతోకొంత తగ్గించడంలో భాగంగా, ‘కాంగ్రెస్‌తో జగన్ కుమ్మక్కయ్యారు’ అంటూ ఎల్లో మీడియా సహకారంతో ఈ ‘కొత్త కాంగ్రెస్+కన్నుమూసే కాంగ్రెస్+టీడీపీ’ కలసికట్టుగా మోతమోగిస్తాయి
     
** ఈ తప్పుడు ప్రచారాన్ని రక్తి కట్టించేందుకు అవసరమైతే తమ అధినేత్రి సోనియాపైనా కొన్ని విమర్శలు చేసుకునే సావకాశం ఈ మిత్ర త్రయానికి ఎప్పుడూ ఉంటుంది
     
** లగడపాటి వంటి వారు కూడా ప్రెస్‌మీట్లు పెట్టి మరీ కాంగ్రెస్ అధిష్టానాన్ని విమర్శించే సాహస విన్యాసాలు చేయడం ఈ సదుపాయంలో భాగమే
     
** అవిధేయతను సహించే అలవాటు అణుమాత్రం కూడా లేని కాంగ్రెస్ అధిష్టానం, తనకు వ్యతిరేకంగా లగడపాటి వంటి అంగుష్ఠమాత్రులు వేస్తున్న కుప్పిగంతులను మురిపెంగా చూస్తుండటమే కుయుక్తులకు నిదర్శనం
 
** ప్రజలకిచ్చిన మాట కోసం తాను చెప్పినట్లు వినలేదన్న ఏకైక కారణంతో జగన్‌ను ఏకంగా 16 నెలలు జైల్లో పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం... అలాంటి స్వల్ప కారణంతోనే యూపీఏ మద్దతుదారని కూడా చూడకుండా ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌నూ జైలుపాలు చేసిన అధిష్టానం.. వేలకోట్ల రూపాయల మేరకు బ్యాంకులకు టోకరా వేసి, ఆ వ్యవహారంలో అడ్డంగా దొరికే అవకాశం పుష్కలంగా ఉన్న లగడపాటి లాంటి వారి విమర్శలనూ ఓపిగ్గా సహిస్తోందంటే... ఇదంతా అధిష్టానం డ్రామాయేననేందుకు ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి?
 
** ఇక సీఎం హోదాలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తనకు అందుబాటులో ఉన్న అవకాశాలన్నింటినీ ఒక్కొక్కటిగా ఉద్దేశపూర్వకంగానే ‘జారవిడుస్తూ’, విభజనకు రాచబాట వేస్తూ వస్తున్న కిరణ్‌కే ‘సమైక్య సింహం’గా ముస్తాబు చేయడానికి అధిష్టానం పూనుకోవడం విడ్డూరాల్లోకెల్లా విడ్డూరం!
 
** కేబినెట్ నోట్‌కు ముందే అసెంబ్లీని పిలిచి సమైక్య తీర్మానం చేసి పంపితే కేంద్రం సంకట స్థితిలో పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నా, అలా చేయాలంటూ వైఎస్సార్‌సీపీ ఎంతగా విజ్ఞప్తి చేసినా ఏ మాత్రమూ లెక్క చేయకుండా, విభజన ప్రక్రియ సాఫీగా సాగడానికి పూర్తిగా సహకరిస్తున్నది సీఎం కిరణే. కేంద్రంపై, కేంద్రంలోని రాజకీయ పార్టీలపై ఒత్తిడి లేకుండా ఉద్యోగుల సమ్మెను విరమింపజేసిన ఘనత కూడా ఈ ‘సమైక్య’ సింహానిదే
 
** ఇటువంటి డూప్ సింహాలతోనే ‘సమైక్య కాంగ్రెస్’ అనే సర్కస్ పార్టీ పెట్టించేందుకు కాంగ్రెస్ అధిష్టానం అన్ని సన్నాహాలూ చేస్తోంది
** వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓట్లకు వీలైనంత మేరకు గండి కొట్టడం, వీలును బట్టి టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నో కొన్ని సీట్లు సంపాదించడం, బతికి బట్టకడితే ఎన్నికల అనంతరం మాతృ సంస్థలో విలీనం కావడం... ఇదే రాబోయే ఈ కొత్త పార్టీ లక్ష్యం!
 
సాక్షి, హైదరాబాద్:  అదేదో జానపద సినిమాలో తన గుట్టు రట్టయి కథానాయకుని చేతిలో చావుదెబ్బ తినగానే టక్కరి మాంత్రికుడు టక్కున బిచాణా ఎత్తేస్తాడు. ప్రస్తుత వేషంతో ఎంతమాత్రమూ పప్పులుడకవని గ్రహించి, రాకుమారిని సాధించేందుకు సాధువు వేషమెత్తి కథను కొత్త మలుపు తిప్పుతాడు. ఓట్ల వేటలో భాగంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు సరిగ్గా అలాంటి టక్కరి వేషమే వేయబోతోంది! వైఎస్సార్‌సీపీ ఆవిర్భావంతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిలపడటం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయంతో సీమాంధ్రలో ఏకంగా చావుదెబ్బ తినడం తెలిసిందే. ఇక ఏం చేసినా అక్కడ బతికి బట్టకట్టే సూచనల్లేవని తేలిపోవడంతో కాంగ్రెస్ అధిష్టానం తన చావు తెలివితేటలకు పదును పెట్టి మరీ సరి‘కొత్త’గా ఒక ఎత్తుగడ వేసింది.

రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తూ తాను తీసుకున్న నిర్ణయంపై సొంత పార్టీ నేతలతోనే వ్యతిరేక గళం విన్పిస్తూ, వారికి సమైక్య ముసుగు తొడిగి, వారితోనే కొత్త పార్టీ పెట్టించేలా స్క్రిప్టు రూపొందించింది. తద్వారా వైఎస్సార్‌సీపీ ప్రాభవానికి వీలైనంతగా గండి కొట్టడంతో పాటు సీమాంధ్రలో ఎన్నో కొన్ని ఓట్లు, సీట్లు సాధించడమే లక్ష్యంగా పథక రచన చేస్తోంది. పైకి కరడుగట్టిన సమైక్యవాదిగా కలరింగ్ ఇస్తూ లోలోపల మాత్రం విభజన ప్రక్రియలో అధిష్టానానికి మొదటినుంచీ అన్నివిధాలా సహకరిస్తూ వస్తున్న సీఎం కిరణే ప్రధాన పాత్రధారిగా ఈ కొత్త పార్టీ నాటకం అతి త్వరలో రాష్ట్ర రాజకీయ యవనికపై అందరినీ అలరించనుంది. ఇక నాలుగేళ్లుగా అన్నింటా అధికార పార్టీతో అంటకాగుతూ వస్తున్న ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, షరామామూలుగా ఈ నయా ‘తోలుబొమ్మలాట’కు కూడా శాయశక్తులా తోడ్పాటునందిస్తూ తరిస్తున్నారు...

రాష్ట్ర రాజకీయాల్లో ఇదో కొత్త నాటకం. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొత్త పార్టీ, విభజన నిర్ణయాల నేపథ్యంలో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్, సార్వత్రిక ఎన్నికలు శరవేగంగా సమీపిస్తుండటంతో అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి కొత్త డ్రామా మొదలుపెట్టింది. సీమాంధ్రలోనూకలు చెల్లిపోయిన తన పార్టీని తనకు తానుగానే నామరూపాల్లేకుండా పాతరేస్తూ, ఆ స్థానంలో మరో కొత్త పార్టీకి జీవం పోస్తున్న విచిత్రమైన వైనమిది. సొంత పార్టీ నేతలకే సమైక్య ముసుగు తొడిగి వారితో సరికొత్త రాజకీయ పార్టీకి పురుడు పోయాలని కాంగ్రెస్ సంకల్పించింది. ఈ రాజకీయ డ్రామాకు సూత్రధారి కాంగ్రెస్ అధిష్టానమే కాగా, పాత్రధారులు సీఎం కిరణ్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.

రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదిగిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా దెబ్బ తీయడానికి ఈ దిశగా హస్తిన పెద్దల మస్తిష్కంలో ఊపిరి పోసుకున్న ఈ స్క్రిప్ట్ త్వరలోనే తెరపైకి రానుందని అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్ర విభజన నిర్ణయంతో కోస్తా, రాయలసీమ ప్రజల్లో కాంగ్రెస్, టీడీపీల పట్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. దాంతో అక్కడి కాంగ్రెస్, టీడీపీ నేతలకు ఏం చేయాలో పాలుపోక అయోమయంలో పడ్డారు. ఈ నేపథ్యంలో అధిష్టానమే ‘సరికొత్త’ ప్రణాళికను సిద్ధం చేయడంతో సీమాంధ్ర నేతలంతా చల్లబడ్డట్టు సమాచారం. అందులో భాగంగా రాష్ట్ర విభజన ప్రక్రియ చివరి అంకంలోకి అడుగుపెట్టగానే కొత్త పార్టీ ఆవిష్కరణ తెర మీదికి రావడం, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరుగా అందులో చేరిపోవడం వెంటవెంటనే జరిగిపోయేలా ఏర్పాట్లు జరిగాయి.

అయితే ఇదంతా అధిష్టానం కనుసన్నల్లోనే జరుగుతోందన్న అనుమానం, విమర్శలు రాకుండా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు సొంత పార్టీపైనే గాక నేరుగా అధినేత్రి సోనియాను కూడా తిట్టిపోస్తారు. తద్వారా తాము సమైక్యాంధ్రకు కట్టుబడ్డామనే భ్రమలు కల్పిస్తారు. లోలోపల మాత్రం విభజన ప్రక్రియ పూర్తయ్యే దశకు వచ్చేదాకా అందుకు పూర్తిగా సహకరిస్తారు. తెలంగాణ ఏర్పాటు బిల్లును అసెంబ్లీ అభిప్రాయానికి రాష్ట్రపతి పంపే సమయానికి కొత్త పార్టీ పురుడు పోసుకుంటుంది. బిల్లు పార్లమెంట్ ముందుకు వెళ్లడానికి ముందే కొందరు కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా తమ నాయకత్వంపై దుమ్మెత్తిపోస్తారు. పార్టీకి రాజీనామాలు చేసి బయటికొచ్చి ‘కొత్త కాంగ్రెస్’ పార్టీలో చేరిపోతారు.

సీమాంధ్రలో సోనియాగాంధీని నమ్మే పరిస్థితి లేనందున, ‘సమైక్యం కోసం త్యాగం చేశాం’ అని చెప్పుకుంటూ కొత్త పార్టీ జెండాతో ఎన్నికలకు వెళతారు. తద్వారా ఎన్నో కొన్ని ఓట్లు, సీట్లు సాధించడంతో పాటు.. సమైక్యం కోసం చిత్తశుద్ధితో నిలిచిన వైఎస్సార్‌సీపీ ఓట్లకు గండికొట్టాలన్నది కాంగ్రెస్ పెద్దల లక్ష్యం. కాంగ్రెస్‌తో వైఎస్సార్‌సీపీ కుమ్మక్కయిందంటూ ఇటు సొంత పార్టీ నేతలతోనూ, అటు టీడీపీతోనూ అధిష్టానం చేయిస్తున్న ప్రచారంలోని మతలబు కూడా ఇదేనని తెలుస్తోంది. ఎన్నికలు పూర్తయ్యాక ‘కొత్త కాంగ్రెస్’లోకి వెళ్లిన వాళ్లంతా తిరిగి కాంగ్రెస్‌లో చేరడమో, లేక దాన్ని గంపగుత్తగా కాంగ్రెస్‌లో విలీనం చేయడమో... ఇదీ ప్రణాళిక! ఇందులో టీడీపీ కూడా ముఖ్య పాత్రధారే. అవసరాన్ని, అవకాశాన్ని బట్టి కొత్త పార్టీతో టీడీపీ అవగాహన, లేదా పొత్తు పెట్టుకోవచ్చని కూడా తెలుస్తోంది.
 
వి‘భజనే’ కిరణ్ లక్ష్యం...
మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం గేమ్‌ప్లాన్‌లో భాగంగా రాష్ట్ర విభజనకు కిరణ్ అన్నివిధాలా సహకరిస్తున్నారని సీడబ్ల్యూసీ ప్రకటన వెలువడ్డ నాటి నుంచి జరుగుతున్న ప్రతి పరిణామమూ చెప్పకనే చెబుతోంది. నిజానికి విభజనతో పాటు కొత్త పార్టీ నాటకాన్ని రక్తి కట్టించే బాధ్యతను కూడా అధిష్టానం కిరణ్ నెత్తినే పెట్టినట్టు విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర విభజనకు అధిష్టానం నిర్ణయం తీసుకున్న విషయం ఆయనకు ముందే తెలుసు.

ఈ విషయాన్ని స్పష్టం చేసిన కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీలో కిరణ్ కూడా ఉన్నా, దానిపై ఆయన కనీసం అభ్యంతరం కూడా వ్యక్తం చేయలేదని పీసీసీ ముఖ్య నేత ఒకరు గుర్తు చేశారు. ఆయనే గనుక రాజీనామా చేస్తానంటే అధిష్టానం పునరాలోచనలో పడేది. లేదంటే కేబినెట్ నోట్‌కు ముందే అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయించి కేంద్రానికి పంపినా అది దాని ముందరి కాళ్లకు బంధంగా మారేది. కానీ ఆ అవకాశం పూర్తిగా తన చేతిలోనే ఉండి కూడా, వైఎస్సార్‌సీపీ ఎంతగా డిమాండ్ చేసినా కిరణ్ పట్టించుకోలేదు.

నిజానికి రాష్ట్ర విభజన, సీమాంధ్రలో కొత్త పార్టీ ఏర్పాటుతో కూడిన ‘భావి కార్యాచరణ’కు సంబంధించి సమగ్రమైన ఎజెండాను కోర్ కమిటీ భేటీ రోజే కిరణ్‌కు అధిష్టానం అప్పగించినట్టు తెలుస్తోంది. ఆ మేరకే దాన్నాయన తు.చ. తప్పకుండా పాటిస్తూ వస్తున్నారు. అందుకే... రాష్ట్రాన్ని విభజించాల్సిందిగా కేంద్రానికి సిఫార్సు చేస్తూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రకటన చేసినా, దానిపై సీమాంధ్ర భగ్గుమన్నా, ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడ్డా కిరణ్ కిమ్మనలేదు. తొమ్మిది రోజుల తర్వాత తీరిగ్గా మీడియా ముందుకొచ్చి ‘విభజనతో సమస్యలే’నంటూ సన్నాయినొక్కులతో సరిపెట్టారు.

విభజనపై భగ్గుమంటూ తన వద్దకు వచ్చిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలతో కూడా నాటకాలాడారు. రాజీనామాలతో రాజకీయ సంక్షోభం సృష్టిద్దామని వారన్నా అధిష్టానం గేమ్ ప్లాన్ బెడిసికొడుతుందనే ఉద్దేశంతో వారిని వారించారు. తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం ఉంటుంది గనుక దాన్ని ఓడిద్దామంటూ కొంతకాలం నెట్టుకొచ్చారు. తాను సీమాంధ్ర చాంపియన్‌ననే భ్రమలను వారిలో కల్పించారు. సీఎం శైలిపై కొందరు సీమాంధ్ర నేతల్లో అనుమానాలు తలెత్తినా, అధిష్టానం కనుసన్నల్లో పురుడు పోసుకునే పార్టీకి సంబంధించి సంకేతాలందడంతో వారు కూడా మిన్నకున్నారు. సీమాంధ్ర ప్రజలు, ఉద్యోగుల ఆందోళనలతో కేంద్రానికి ఇబ్బందికర పరిస్థితి తలెత్తినప్పుడు కూడా కిరణే రంగప్రవేశం చేశారు.

తెలంగాణ తీర్మానాన్ని అడ్డుకుంటామన్న సాకు చూపి ఉద్యోగుల సమ్మెను విరమింపజేశారు. తద్వారా అది రాజకీయ మలుపు తిరగకుండా జాగ్రత్త పడ్డారు. విభజన నిర్ణయం తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన 50 రోజులకు తీరిగ్గా మరోసారి విలేకరుల ముందుకొచ్చి, ‘విభజిస్తే సమస్యలే’నంటూ మరోసారి పలు అంశాలను వల్లెవేశారు. తద్వారా, ‘స్వయంగా ముఖ్యమంత్రే విభజనను అడ్డుకుంటున్నారు’ అన్న భావనను జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. తెలంగాణపై అసెంబ్లీ తీర్మానం ఉండదని తేలిపోవడంతో కొత్తగా ఉద్యోగ నియామకాలకు సంబంధించిన 371 (డి) అధికరణాన్ని సాకుగా చూపుతూ, ‘నేనున్నంత వరకు విభజన జరగదు’ అంటూ కొత్త రాగం అందుకున్నారు.

నిజానికి అసెంబ్లీ ఇప్పటికీ ప్రొరోగ్ కాలేదు. కాబట్టి కిరణ్ తలచుకుంటే... విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం తన సిఫార్సులను కేంద్రానికి అందజేయడానికి ముందే అసెంబ్లీని సమావేశపరిచి, సమైక్య తీర్మానం చేయించే అవకాశం ఆయన చేతుల్లోనే ఉంది. కానీ అధిష్టానం ఆదేశానుసారం నడుస్తున్న ఆయన దాన్ని అసలే పట్టించుకోవడం లేదు. కేవలం వైఎస్సార్‌సీపీని వీలైనంత దెబ్బ తీసేందుకు తెర తీసిన పనికిమాలిన పథకాన్ని అమలు చేసే ప్రయత్నంలో మునిగితేలుతున్నారు.
 
 కిరణ్ సారథ్యంలోనే కొత్త పార్టీ
 విభజనకు పూర్తిగా సహకరించి, అంతా అయిపోయాక, చివరికి ‘సమైక్య సింహం’ ముసుగులో కొత్త పార్టీకి కిరణే నేత ృత్వం వహిస్తారని సమాచారం. ఇందుకు సంబంధించి పార్టీ నేతలందరితో ఆయన ఇప్పటికే అంతర్గతంగా చర్చలు సాగిస్తున్నారు. కొత్త పార్టీకి అవసరమైన ప్రచార సామగ్రిని కూడా సిద్ధం చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సమైక్యాంధ్ర సింహం పేరుతో ముఖ్యమంత్రి తన బొమ్మతో పలు కరపత్రాలను ముద్రించి పంపిణీ చేయిస్తున్నారు. అయితే విభజన ప్రక్రియకు రాష్ట్ర స్థాయి నుంచి ఎలాంటి ఆటంకాలూ లేకుండా మొత్తం వ్యవహారం నడిపించిన తర్వాతే సమైక్యాంధ్ర ఎజెండాగా కొత్త పార్టీ తెరమీదకొచ్చేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ వ్యవహారం ఎంతకాలం సాగితే అంతవరకు కిరణ్ సీఎం పదవిలో కొనసాగుతారు. ‘‘కిరణ్‌తో పార్టీ పెట్టించాలన్న ఆలోచన పూర్తిగా ఢిల్లీ పెద్దలదే. నిజానికి కిరణ్‌లో నాయకత్వ లక్షణాలు ఒక్కటీ లేవు. అధికారం చేతిలో ఉండగానే పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలే ఆయనకు దూరంగా ఉంటున్నారు. అలాంటి వ్యక్తి పార్టీ పెడితే నమ్ముకుని ఎవరూ వెళ్లే పరిస్థితే లేదు. కానీ ఇదంతా కాంగ్రెస్ అధిష్టానమే ఆడిస్తున్న డ్రామా గనుక కొత్త పార్టీలోకి వెళ్లినా మళ్లీ కాంగ్రెస్‌లోకే తిరిగి వచ్చేస్తామన్న ధీమా మా నేతల్లో ఉంది’’ అని సీమాంధ్రకు చెందిన పీసీసీ నేత ఒకరు వివరించారు.
 
 
అంటకాగుతున్న చంద్రబాబు...
జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బయటకొచ్చిన తర్వాత ఆయనపై హైకోర్టులో కేసులు వేయడం మొదలుకుని నాలుగేళ్లుగా అన్ని విషయాల్లోనూ కాంగ్రెస్‌కు చంద్రబాబు పూర్తిగా సహకరిస్తూ వస్తున్న వైనం బహిరంగ రహస్యమే. రాజ్యసభలో ఎఫ్‌డీఐలపై ఓటింగ్ నుంచి టీడీపీ ఎంపీలను గైర్హాజరు చేయించడం ద్వారా ఆ బిల్లు నెగ్గేలా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారుకు బాబు సహకరించారు. రాష్ట్రంలో పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనమయ్యే దాకా ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టకుండా దాన్ని చేజేతులా కాపాడారు. పైగా టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీతో పాటు మిగిలిన పార్టీలు అవిశ్వాసం ప్రతిపాదించినా, మైనారిటీలో పడిన ప్రభుత్వం పడిపోకుండా చూసే బాధ్యతను తన భుజానికెత్తుకున్నారు.

టీడీపీ ఎమ్మెల్యేలు అవిశ్వాసంపై ఓటింగ్‌లో పాల్గొనకుండా విప్ జారీ చేసి మరీ కాంగ్రెస్‌ను గట్టెక్కించారు. అందుకు బదులుగా కాంగ్రెస్ అధిష్టానం కూడా బాబును పలు కేసుల బారి నుంచి కాపాడుతూ వచ్చిందన్నది టీడీపీ వర్గాల నుంచే విన్పిస్తున్న మాట. కాంగ్రెస్‌తో కుమ్మక్కులో భాగంగా ఇప్పుడు జగన్‌ను రాజకీయంగా అప్రతిష్టపాలు చేయడానికి పథకం ప్రకారం గోబెల్స్ ప్రచారానికి మరోసారి బాబు తెర తీశారు.

కాంగ్రెస్‌తో జగన్ కుమ్మక్కయ్యారంటూ ఇటు టీడీపీ, అటు కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేయడం ప్రారంభించారు. నాలుగేళ్లుగా అన్ని విషయాల్లోనూ అధికార పార్టీతో అంటకాగుతున్న, విభజనకు అనుకూలంగా తాజాగా ఏకంగా ఢిల్లీలో దీక్ష చేసిన చంద్రబాబు చేస్తున్న ఈ ప్రయత్నాలన్నీ నిజానికి దొంగే ‘దొంగా, దొంగా’ అని అరిచిన చందంగా ఉన్నాయని టీడీపీ నేతలే వాపోతున్నారు.
 
నిదర్శనాలు కోకొల్లలు...
‘కొత్త పార్టీ’ అనేది పూర్తిగా కాంగ్రెస్ అధిష్టానం మానస పుత్రికేననేందుకు లెక్కలేనన్ని నిదర్శనాలు కన్పిస్తున్నాయి. తనను ధిక్కరించడం మాట దేవుడెరుగు, కనీసం విభేదించిన వారిని కూడా వదిలిపెట్టే తత్వం కాంగ్రెస్ పార్టీ రక్తంలోనే లేదు. మాట వినలేదన్న కారణంతో విమానాశ్రయం నుంచే ముఖ్యమంత్రులను క్షణాల మీద మార్చేసిన చరిత్ర ఆ పార్టీది. ఇచ్చిన మాట కోసం ఓదార్పు యాత్ర చేస్తానన్నందుకు, దానిపై నిలబడ్డందుకు జగన్‌ను 16 నెలల పాటు కాంగ్రెస్ జైల్లో పెట్టించడం, తమ మాట విననందుకేమిత్రపక్షమైన మజ్లిస్ నేత అక్బరుద్దీన్‌ను కూడా జైలుపాలు చేయడం అందరూ చూసిందే.

అలాంటి పార్టీ... ఇప్పుడు సొంత నేతలే రోజుకొకరుగా ఇష్టారాజ్యంగా తనపై తీవ్ర విమర్శలు చేస్తున్నా చిద్విలాసంగా చూస్తోందంటే ఇదంతా తన గేమ్‌ప్లాన్‌లో భాగం కావడం వల్లేనని స్పష్టమవుతోంది. అందుకే సీఎమ్మే కాకుండా కాంగ్రెస్‌లోని పలువురు నేతలు అధిష్టానాన్ని, ఏకంగా సోనియానూ దుమ్మెత్తిపోస్తున్నా ఢిల్లీ పెద్దలెవరూ కిమ్మనడం లేదు. రాష్ట్రంలో పార్టీని సోనియా భూస్థాపితం చేశారని మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. శైలజానాథ్, టీజీ వెంకటేశ్, గంటా శ్రీనివాసరావు, పితాని సత్యనారాయణ, కాసు క ృష్ణారెడ్డి, సి.రామచంద్రయ్య వంటి మంత్రులు కూడా పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలుమార్లు విమర్శించారు.

ఇక వేల కోట్ల రూపాయలను బ్యాంకులకు, ఇతరత్రా సంస్థలకు ఎగవే శారన్న ఆరోపణలు లగడపాటిపై ఉన్నాయి. దీనికి సంబంధించి ఆయా శాఖల నుంచి పలు నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఇలాంటి నేతలు తనపై విమర్శలు గుప్పిస్తే కాంగ్రెస్ అధిష్టానం ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరికే వదిలిపెట్టదు. అయినా తనను విమర్శిస్తున్న వారెవరినీ అధిష్టానం పల్లెత్తు మాట కూడా అనడం లేదు. ఇలా కాంగ్రెస్‌ను తిట్టడం ద్వారా వీరంతా సీమాంధ్రలో చాంపియన్లుగా నిలుస్తారని, ఆనక వారంతా ‘కొత్త పార్టీ’లో చేరినా ఎవరికీ అనుమానాలు రావన్నదే దీని అంతరార్థమని పార్టీలోనే గట్టిగా వినిపిస్తోంది.
 
 కాంగ్రెస్ నైజమే అంత...
తన పుట్టి మునుగుతుందనుకునే చోట అవసరం, అవకాశాలను బట్టి సామదాన భేద దండోపాయాలతో కూడిన ఎలాంటి ఎత్తులైనా వేయడం కాంగ్రెస్‌కు కొత్తేమీ కాదు. ఇలాంటి వ్యవహారాలను గతంలో ఇతర రాష్ట్రాల్లోనూ అది నడిపింది. కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీని ఓడించడానికి ఆ పార్టీ నేత యడ్యూరప్పతో చేతులు కలిపింది. బీజేపీకి వ్యతిరేకంగా ఆయన కొత్త పార్టీ పెట్టడంలో తెర వెనక ఉన్నది కాంగ్రెసేనన్న ప్రచారం అప్పట్లో గట్టిగానే సాగింది.

యడ్యూరప్ప పార్టీ దెబ్బకు ఎన్నికల్లో బీజేపీ కుదేలవడం, కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టడం తెలిసిందే. అదే తరహాలో ఇప్పుడు రాష్ట్రంలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీయడానికి కాంగ్రెస్ కొత్త ఎత్తులు వేస్తోంది. కాకపోతే సొంత నేతలతోనే కొత్త పార్టీ పెట్టించబోతోంది! పైగా అందుకోసం పేరుకు మాత్రమే ప్రధాన ప్రతిపక్షమైన, ఆచరణలో తన మిత్రపక్షమైన టీడీపీ సహాయసహకారాలను పూర్తిగా తీసుకుంటోంది.
Share this article :

0 comments: