తెలంగాణ వచ్చినా, రాకున్నా ఈ ప్రాంతంలో రాజకీయాలను శాసించబోయేది వైఎస్ఆర్ సీపీయేనని పార్టీ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. గురువారం వైరాలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమది తెలంగాణ కోసమో, సీమాంధ్ర కోసమో పుట్టిన పార్టీ కాదన్నారు. దివంగత మహానేత వైఎస్ఆర్ సంక్షేమ ఫలాలను రాష్ట్ర ప్రజలందరికీ అందించాలనే లక్ష్యంతో ఆయన కుమారుడు వైఎస్ జగన్ పార్టీని స్థాపించారని చెప్పారు. తెలంగాణ ఏర్పడితే వైఎస్సార్ సీపీకి మనుగడ ఉండదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా పార్టీకి ఎలాంటి ఢోకా ఉండదని చెప్పారు. రాష్ట్రం ఎన్ని ముక్కలైనా అన్నిచోట్లా వైఎస్ఆర్ సీపీ ఉంటుందన్నారు. జిల్లాలో పార్టీకి ఎదురులేదని, ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ బలపర్చిన అభ్యర్థుల విజయమే ఇందుకు నిదర్శనమని అన్నారు.
రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్రెడ్డిని దూరం చేసేందుకే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ అంశాన్ని తెరమీదకు తెచ్చింది తప్ప, ఈ ప్రాంతంపై చిత్తశుద్ధితో కాదని విమర్శించారు. పార్టీ వైరా నియోజకవర్గ సమన్వయకర్త బాణోత్ మదన్లాల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూడాలన్నదే జగన్ అభిమతమన్నారు. దివంగత వైఎస్ఆర్ సంక్షేమ పథకాలతో తెలంగాణ వాసులే ఎక్కువగా లబ్ధి పొందారని చెప్పారు. చంద్ర బాబు రెండు కళ్ల సిద్ధాంతం అవలంబిస్తున్నారని, అయినా తెలంగాణలో టీడీపీ ఉన్నప్పుడు తమపార్టీ ఎందుకు ఉండదని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికలను స్ఫూర్తిగా తీసుకుని మిగితా ఎన్నికల్లోనూ సమష్టిగా పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అంతకుముందు మహానేత వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
0 comments:
Post a Comment