నాలుగో రోజుకు చేరిన జగన్ దీక్ష - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నాలుగో రోజుకు చేరిన జగన్ దీక్ష

నాలుగో రోజుకు చేరిన జగన్ దీక్ష

Written By news on Tuesday, October 8, 2013 | 10/08/2013

నాలుగో రోజుకు చేరిన జగన్ దీక్ష
* పరీక్షలు నిర్వహించిన వైద్యులు
 నీరసంగా ఉన్నారని వెల్లడి
* నాలుగో రోజుకు చేరిన సమైక్య దీక్ష
* జగన్‌ను కలసి మద్దతు ప్రకటించిన పలువురు నేతలు

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుతూ  వైస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సమైక్య దీక్ష నేటికి నాలుగోరోజుకు చేరింది. గత నాలుగు రోజులుగా ఆయన ఆహారం తీసుకోకపోవడంతో కాస్త నీరసపడినట్లు వైద్యులు తెలిపారు. ఫ్లూయిడ్స్‌ ఎక్కించాలని డాక్టర్లు సూచించగా జగన్‌ ఆ సూచనను తిరస్కరించారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుతూ జగన్‌ మోహన్‌ రెడ్డి చేస్తున్న దీక్ష కొనసాగుతోంది.

వైద్యులు సోమవారం రాత్రి ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. జగన్ కొంత నీరసంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. స్వల్పంగా వెన్నునొప్పితో కూడా ఆయన బాధపడుతున్నట్లు చెప్పారు. జగన్ రక్తపోటు 130/90, పల్స్ రేటు 60, రక్తంలో చక్కెర 68 ఎంజీ, మూత్రంలో కిటోన్ బాడీస్ నెగటివ్‌గా ఉన్నట్లు వైద్య పరీక్షల్లో వెల్లడైందని ఉస్మానియా వైద్యులు తెలిపారు.

 వెల్లువెత్తిన జనం
 సోమవారం దీక్షలో ఉన్న జగన్‌ను చూడటానికి జనం మేళతాళాలతో తరలి రావడంతో ఆయన క్యాంపు కార్యాలయ పరిసరాల్లో కోలాహలం నెలకొంది. వృద్ధులు, మహిళలు, యువత, విద్యార్థులు శిబిరానికి తరలి వచ్చి ‘జై సమైక్యాంధ్ర.. జై జగన్.. వైఎస్సార్ అమర్హ్రే’ అంటూ నినదించారు. ఎండ, ఉక్కపోత ఉన్నప్పటికీ జగన్‌ను కలిసి ఆయనతో కరచాలనం చేయాలని గంటల తరబడి వేచి ఉన్నారు. కొంత నీరసించినట్లు కనిపించినా జగన్ తన వద్దకు వచ్చిన వారందరినీ పలకరించారు.
చంటిపిల్లలను తీసుకుని వచ్చిన తల్లుల నుంచి పిల్లలను తన చేతుల్లోకి తీసుకుని ముద్దాడినపుడు వారు ఆనందపరవశులయ్యారు. పలువురు వృద్ధ మిహ ళలైతే దీక్షలో కూర్చున్న జగన్‌ను చూసి చలించి పోయి ఏడ్చేశారు. కొందరు మహిళలు ఆయనకు రక్షలు కట్టగా, మరి కొందరు పెద్దమ్మతల్లి ఆశీర్వాదంతో తెచ్చిన తాడును చేతికి కట్టారు. కుత్బుల్లాపూర్ నుంచి ఓ బాలిక తెలుగుతల్లి వేషధారణతో, మరికొందరు బాలలు గాంధీతాతతో పాటు పలువురు జాతీయ నేతల వేషధారణతో వచ్చి జగన్‌ను కలుసుకున్నారు.
ముస్లిం యువకులు ఆయనకు దట్టీలు కట్టారు. ముస్లిం మహిళలు పెద్ద సంఖ్యలో రావడం కనిపించింది. ఓ జంట తమ కుమారుడికి వై .ఎస్.ఆర్ అనే అక్షరాలతో అక్షరాభ్యాసం చేయించాల్సిందిగా కోరారు. సమైక్యాంధ్ర అడ్వొకేట్స్ జేఏసీ నాయకులు జగన్‌ను కలిసి తమ మద్దతు ప్రకటించారు. ఇంకా ఆయనను కలుసుకున్న ప్రముఖుల్లో పినతండ్రి వైఎస్ వివేకానందరెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు మేకతోటి సుచరిత, తెల్లం బాలరాజు, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, బి.గురునాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మద్దాలి రాజేష్, వై.బాలనాగిరెడ్డి, జోగి రమేష్, కొమ్మి లక్ష్మయ్యనాయుడు, మాజీ ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్‌రెడ్డి, ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి, పార్టీ నేతలు జ్యోతుల నెహ్రూ, బి.జనక్ ప్రసాద్, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ వడ్డేపల్లి నర్సింగ్‌రావు, పార్టీ డాక్టర్ల విభాగం కన్వీనర్ డాక్టర్ గోసుల శివభారత్‌రెడ్డి, వైఎస్సార్ టీఎఫ్ రాష్ట్ర కన్వీనర్ ఓబుళపతి, మాజీ మంత్రి దివంగత కోటగిరి విద్యాధర్‌రావు కుమారుడు శ్రీధర్ ఉన్నారు.
Share this article :

0 comments: