రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే లక్ష్యంతో ఈనెల 16వ తేదీ నుంచి 26వ తేదీ వరకు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన రాష్ట్రాల్లో పర్యటించనున్నట్లు జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. సమైక్యాంద్రకు మద్దతు కూడగట్టేందుకు తాను పశ్చిమబెంగాల్ తో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పర్యటించాల్సి ఉందని, అందువల్ల బెయిల్ షరతులను ఆ మేరకు సడలించాలని కోరుతూ ఈ నెల 6న జగన్ పిటిషన్ దాఖలు చేశారు.
తన బెయిల్ షరతులను గత నెల 30న సీబీఐ ప్రత్యేక కోర్టు సడలించిన విషయాన్ని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగాను, ఢిల్లీ వెళ్లేందుకు మాత్రమే అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీచేసిందని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని, రాష్ట్రాన్ని విభజించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా జాతీయ పార్టీల నేతలను, పార్లమెంట్ సభ్యులను కలిసి మద్దతు కూడగట్టాల్సి ఉందని వివరించారు. పార్లమెంట్ సభ్యునిగా నియోజకవర్గంతో పాటు పార్టీ అధ్యక్షునిగా ప్రజలకు సేవలు అందించే హక్కును కాలరాయకూడదని పేర్కొన్నారు.
తనపై సీబీఐ మోపినవన్నీ ఆరోపణలేనని, నేరం రుజువు కాలేదని తెలిపారు. కోర్టు విధించిన షరతులను పాటిస్తానని, రాజకీయ కారణాల రీత్యా ఇతర రాష్ట్రాల్లో పర్యటించేందుకు వీలుగా బెయిల్ షరతులు సడలించాలని విజ్ఞప్తి చేశారు. పిటిషన్ పై విచారణను సీబీఐ కోర్టు ఈ రోజుకు వాయిదా వేసింది. ఈరోజు వాదనలు ముగిసిన తరువాత తీర్పు కోర్టు 15వ తేదీకి వాయిదా వేసింది.
0 comments:
Post a Comment