గుంటూరు :వెనుకబడిన వర్గాల నేత, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్లో చేరనుండడంతో ఆ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాక ఆయన చేరిక శుభపరిణామమని, రేపల్లె నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ మరింత బలోపేతం కాగలదని భావిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో రాజధానిలో పార్టీలో చేరిన అనంతరం మోపిదేవి శనివారం నియోజకవర్గానికి రానున్నారు. కాంగ్రెస్ కుటిల రాజకీయాల కారణంగా 18 నెలలపాటు నియోజకవర్గ ప్రజలకు, కుటుంబానికి దూరమైన మోపిదేవికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.
ఆరు నెలల నుంచి ఆయనచేరికపై ఊహాగానాలు వినపడుతూనే ఉన్నాయి. ఇందుకు అనుగుణంగానే మోపిదేవి సోదరుడు హరనాథబాబు, కుమారుడు రాజీవ్, అనుచరులు జూలై ఐదున హైదరాబాద్లో వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో మంత్రి అనుచరులుగా కొనసాగుతున్న నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ కమిటీ అడ్డగోలు నిర్ణయాన్ని తీసుకుందంటూ అందుకు నిరసనగా తాను పదవితోపాటు కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నట్టు మోపిదేవి ఆగస్టు నెలలో ప్రకటించారు. హైదరాబాద్ చంచల్గూడ జైలులో ఉన్న ఆయన స్పీకర్ ఫార్మేట్లో తన రాజీనామా లేఖను జైలు సూపరింటెండెంట్కు అందజేశారు. అదే విధంగా రాష్ట్ర ప్రజలకు సమన్యాయం చేయలేని పక్షంలో .. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఉద్యమిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, ఆ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్రెడ్డి చేపట్టిన దీక్షలకు సంపూర్ణ మద్దతిస్తున్నట్లు తెలిపారు.
రాజధానికి ముఖ్యనేతలు
మోపిదేవి పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆయనను కలిసి అభినందించేందుకు జిల్లాకు చెందిన పలువురు సీనియర్లు రాజధానికి పయనమయ్యారు. పార్టీ కృష్ణా, గుంటూరు జిల్లాల కోఆర్టినేటర్ ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), కేంద్ర కార్యనిర్వాహక సభ్యులు రావి వెంకట రమణ, గుంటూరు సిటీ కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు గురువారం రాత్రి బయలుదేరారు.
స్వాగత ఏర్పాట్లు
మోపిదేవితోపాటు పార్టీలో చేరేందుకు రేపల్లె నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు గురువారం రాత్రి హైదరాబాద్ పయనమయ్యారు. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు పార్టీలో చేరి శనివారం సాయంత్రం నియోజకవర్గానికి రానున్నారు. 200 కార్లు, ద్విచక్ర వాహనాలతో గన్నవరం విమానాశ్రయం నుంచి రేపల్లె నియోజకవర్గం వరకు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కృష్ణాజిల్లాలోని ప్రసిద్ధ దేవాలయం మోపిదేవి నందు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వెంకట రమణ రేపల్లె చేరుకుంటారు. నె హ్రూ బొమ్మ సెంటర్ వద్ద జరిగే భారీ బహిర ంగ సభలో ఆయన ప్రసంగిస్తారు.
0 comments:
Post a Comment