రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న ఉద్దేశంతో వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలను కలుస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అందులో భాగంగానే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో భేటీ అయ్యారు. ఆయనకు విమానాశ్రయంలో అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. నవీన్ పట్నాయక్ ను కలవడానికి ముందు పై-లీన్ ప్రభావంతో నష్టపోయిన కళింగాంధ్రులను జగన్ కలిశారు. తుఫానపు నష్ట తీవ్రత గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని జగన్ ఎదుట కళింగాంధ్రులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ఒడిశా పర్యటనపై రాజకీయవర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఇరు పార్టీల మధ్య ఎన్నికల పొత్తు ఉంటుందా అంటూ ఒడిశా మీడియా పదే పదే జగన్ ను ప్రశ్నించింది.
సంకుచిత రాజకీయ లబ్ధికోసం రాష్ట్రాన్ని విడదీయరాదని నవీన్పట్నాయక్ అన్నారు. రాష్ట్ర విభజన సమస్యను వైఎస్ జగన్ తనతో చర్చించారని, రాష్ట్ర విభజన అనేది సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా చాలా సున్నితమైన అంశమని ఆయన తెలిపారు. ఏ నిర్ణయం తీసుకునేముందు అయినా ఏకాభిప్రాయం సాధించడం చాలా అవసరమని, అంతేతప్ప కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసం రాష్ట్రాలను విడదీయడం సరికాదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియలో రాజకీయవర్గాలతో నిశిత చర్చను పూర్తిగా గాలికి వదిలేశారని ఆయన మండిపడ్డారు.
కాగా, సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను వైఎస్ జగన్ కలుస్తారు. అలాగే మధ్యాహ్నం 3.30 గంటలకు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రేతో కూడా భేటీ అవుతారు. సమైక్య రాష్ట్రానికి మద్దతు ఇవ్వాల్సిందిగా వారిద్దరినీ కూడా జగన్ కోరనున్నారు.
0 comments:
Post a Comment