చూడడానికి పోటెత్తిన అభిమాన సందోహం
కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి రాకతో శనివారం పులివెందుల జన జాతరను తలపించింది. అక్రమ నిర్బంధంతో జైల్లో ఉన్న నేపథ్యంలో దాదాపు 20 నెలల తర్వాత జగన్మోహన్రెడ్డి స్వస్థలంలో అడుగుపెట్టారు. ఆయన్ను చూడ్డానికి అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చాలామంది అభిమానులు శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్లో జాగారం చేశారు. ఉదయం 6.20 గంటలకు వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో వైఎస్ జగన్, ఆయన భార్య భారతి దిగగానే ‘జై జగన్’ నినాదాలతో రైల్వేస్టేషన్ హోరెత్తింది. తనను చూసేందుకు వచ్చిన అభిమానులు, కార్యకర్తలకు జగన్కు అభివాదం చేశారు. ఆయనతో కరచాలనం చేసేందుకు, ఆటోగ్రాఫ్లకు అభిమానులు పోటీపడ్డారు. అనంతరం జగన్మోహన్రెడ్డి ఎర్రగుంట్ల నాలుగురోడ్ల కూడలి, వైకోడూరు, పెద్దనపాడు, ఉరుటూరు, వీరపునాయునిపల్లి మీదుగా వేంపల్లికి చేరుకున్నారు.
మార్గమధ్యంలో తనకోసం రోడ్లపై వేచి ఉన్న జనసందోహానికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. తర్వాత ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్కు చేరుకొని దివంగత నేతకు నివాళులర్పించారు. అప్పటికే జగన్ను చూసేందుకు ఇడుపులపాయకు భారీగా ప్రజలు తరలివచ్చారు. అందరినీ ఆప్యాయంగా పలకరించి 11.30 గంటలకు పులివెందులకు బయలుదేరారు.
పులివెందుల ప్రజలు కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న కల నెరవేరింది. ఇరవై నెలల తర్వాత తమ అభిమాన నాయకుడిని చూసి పులకించిపోయారు. చెదరని చిరునవ్వుతో వైఎస్ జగన్ వారందరినీ పలుకరించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. శనివారం ఉదయం 4గంటలకే ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్లో జగన్ దిగవలసి ఉండగారైలు ఆలస్యం కారణంగా 6.20గంటలకు చేరుకున్నారు. అప్పటికే వందలాది అభిమానులు రైల్వేస్టేషన్కు చేరుకున్నారు. వారందరికీ అభివాదం చేస్తూ పెద్దనపాడు, ఉరుటూరు, గంగిరెడ్డిపల్లె, వి.ఎన్.పల్లె, వేంపల్లె మీదుగా ఇడుపులపాయ చేరుకున్నారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ను సందర్శించి సతీమణి వైఎస్ భారతితో కలిసి నివాళులర్పించారు.
వివిధ జిల్లాలకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలతో మాట్లాడిన అనంతరం 11.45గంటలకు పులివెందులకు పయనమయ్యారు. 35కి.మీ దూరమున్న పులివెందుల చేరుకోవడానికి వైఎస్ జగన్కు సుమారు 2.30గంటల సమయం పట్టింది. తమ అభిమాన నాయకుడి కోసం పల్లె జనం ఎదురుచూశారు. వారంద రినీ ఏమాత్రం నిరుత్సాహపరచకుండా ప్రతి పల్లె వద్ద కాన్వాయ్ నిలుపుతూ కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ జగన్ను చూడగానే మహిళలు తీవ్ర ఉద్విగ్నతకు లోనయ్యారు. వారిని ఆత్మీయంగా నిమురుతూ ముందుకు సాగారు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేంతవరకు వైఎస్ జగన్ను చూడాలని వచ్చిన ప్రజలతో క్యాంపు కార్యాలయం కిటకిటలాడింది.
ఎర్రగుంట్లలో ఘనస్వాగతం
ఎర్రగుంట్ల: రెండురోజుల పులివెందుల పర్యటన కోసం శనివారం ఉదయం వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో ఎర్రగుంట్లలో దిగిన వైఎస్ జగన్కు అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. వైఎస్ఆర్ సీపీ యూత్ జిల్లా అధ్యక్షడు వైఎస్ అవినాష్రెడ్డి, రైతు విభాగం జిల్లా కన్వీనర్ సంబటూరు ప్రసాద్ రెడ్డి, అల్లెప్రభవతి, వ్యక్తగత కార్యదర్శి రవి, దేవిరెడ్డి శివశంకర్రెడ్డి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. జగన్తో కరచాలనం చేయటానికి ప్రజలు ఆరాటపడ్డారు. నాలుగు రోడ్ల కూడలిలోకి వైఎస్ జగన్ రాగానే స్థానిక వైఎస్ఆర్ సీపీ నాయకులు మల్లు గోపాల్రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు ర షీద్, కోగటం నారాయణరెడ్డి, అంకిరెడ్డి బాణ సంచా పేల్చారు.
వీఎన్పల్లెలో ఆత్మీయస్వాగతం
వీరపునాయునిపల్లె: వైఎస్ జగన్మోహన్రెడ్డికి వీరపునాయునిపల్లెలో శనివారం ఉదయం ఆత్మీయ స్వాగతం లభించింది. ఉదయం 7గంటల సమయంలో వైఎస్ జగన్ వీరపునాయునిపల్లెకు చేరుకున్నారు. తమ అభిమాన నాయకుడిని చూడగానే కార్యకర్తలు, అభిమానులలో ఆనందం కట్టలు తెంచుకొంది. ఈ సందర్భంగా వైఎస్ విగ్రహానికి జగన్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ మండల కన్వీనర్ రఘునాథరెడ్డి, నాయకులు బాలగంగిరెడ్డి, విశ్వనాథరెడ్డి, మిషన్ ప్రతాప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వేంపల్లెలో సాదరస్వాగతం
వేంపల్లె: జగన్మోహన్రెడ్డికి శనివారం వేంపల్లెలో సాదర స్వాగతం లభించింది. జై జగన్ అంటూ కార్యకర్తలు, అభిమానులు నినాదాలు చేశారు. వారందరితో కరచాలనం చేస్తూ జగన్ ముందుకు సాగారు. మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో ఆయన పులివెందులకు బయలుదేరి వెళ్లారు.
వేములలో అపూర్వ స్వాగతం
వేముల: వైఎస్ జగన్మోహన్రెడ్డికి శనివారం వేములలో ఘన స్వాగతం లభించింది. వైఎస్ఆర్ సీపీ మండల నాయకులు నాగేళ్ల సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జగన్కు అపూర్వ స్వాగతం పలికారు. మధ్యాహ్నం 12గంటలకు వేములకు చేరుకున్న జగన్ను చూసేందుకు మహిళలు, యువకులు, పిల్లలు, వృద్ధులు పోటీపడ్డారు. వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర యూత్ స్టీరింగ్ కమిటీ సభ్యులు మరకా శివకృష్ణారెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు రమాదేవి, స్థానిక సర్పంచ్ మాధురి, కొండ్రెడ్డిపల్లె సర్పంచ్ నారాయణరెడ్డి, వైఎస్ఆర్ సీపీ బీసీ కన్వీనర్ రాధాకృష్ణ, మండల యూత్ అధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి తదితరులు వైఎస్ జగన్కు స్వాగతం పలికినవారిలో ఉన్నారు.
0 comments:
Post a Comment