- కోల్కతా వెళ్లనున్న వైఎస్సార్ సీపీ ప్రతినిధి బృందం
- విభజనకు వ్యతిరేకంగా, ఆర్టికల్ 3 సవరణ దిశగా అన్ని పార్టీల మద్దతు కూడగడుతోన్న జగన్మోహన్రెడ్డి
- ఇప్పటికే సీపీఎం, సీపీఐ, బీజేపీ అగ్రనేతలతో సమావేశాలు
రాష్ట్రాల విభజన విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 దుర్వినియోగం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ స్థాయిలో ఆయా పార్టీల సహకారాన్ని కోరుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆ ప్రయత్నంలో భాగంగా బుధవారం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలవనున్నారు. ఈ మేరకు జగన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో కోల్కతాకు బయలుదేరుతోంది. పార్లమెంట్లో మెజారిటీ ఉందన్న కారణంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ను దుర్వినియోగం చేస్తూ బలమైన రాష్ట్రాలను బలహీనపరిచే విధంగా వ్యవహరిస్తున్న కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న జగన్ అదే విషయంలో.. ఇటీవల ఢిల్లీ వెళ్లి సీపీఎం, సీపీఐ, బీజేపీ నాయకులను కలిసిన సంగతి తెలిసిందే. ఒక రాష్ట్రాన్ని విభజించాలంటే సంబంధిత రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంటులలో మూడింట రెండు వంతుల మెజారిటీతో తీర్మానం చేసే విధంగా ఆర్టికల్ 3కు సవరణలు ప్రతిపాదించడమే కాకుండా ఆ రకంగా చట్ట సవరణకు అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని ఆయా నేతలకు అందజేసిన వినతిపత్రంలో ఆయన కోరారు. తాజాగా కోల్కతా, లక్నో వెళ్లడానికి సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి మంజూరు చేసిన నేపథ్యంలో జగన్.. మమతా బెనర్జీని కలిసి మద్దతు కోరతారని పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు తెలిపారు. జగన్ వెంట తనతో పాటు పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి, పీఏసీ కో ఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ, సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి, మాజీ ఎంపీ వి.బాలశౌరి వెళుతున్నట్టు చెప్పారు. మమతను కోల్కతాలో మధ్యాహ్నం 2 గంటలకు కలుస్తున్నామన్నారు. తాము జాతీయ పార్టీలే కాకుండా కోర్టు అనుమతిని బట్టి అన్ని ప్రాంతీయ పార్టీల నేతలను కూడా కలుస్తామని అన్నారు.
కోల్కతా, లక్నో వెళ్లేందుకు జగన్కు అనుమతి
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కోల్కతా, లక్నో వెళ్లేందుకు సీబీ ఐ ప్రత్యేక కోర్టు అనుమతించింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, అఖిలేశ్యాదవ్లను కలవాల్సి ఉందని, ఈ మేరకు కోల్కతా, లక్నో వెళ్లేం దుకు అనుమతించాలని ఇటీవల జగన్మోహన్రెడ్డి పిటిషన్ వేసిన సంగతి తెలి సిందే. దీన్ని రెండో అదనపు ప్రత్యేక కోర్టు జడ్జి ఎంవీ రమేశ్ మంగళవారం విచారించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ప్రాంతీయపార్టీల మద్దతు కూడగట్టాల్సి ఉందని, ఈ నేపథ్యంలో ఆయాపార్టీల నేతలను కలిసి విభజనతో జరిగే ఇబ్బందులను వివరించాల్సి ఉందని జగన్ తరఫు న్యాయవాది తెలిపారు. మమతా, అఖిలేశ్ లు నేతృత్వం వహిస్తున్న పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంట్లో బిల్లును వ్యతిరేకించాలని జగన్ ప్రత్యక్షంగా కలిసి కోరాలనుకుంటున్నట్లు చెప్పారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి.. బుధవారం కోల్కతా, గురువారం లక్నో వెళ్లేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అయితే ఫోన్ లేదా ఫ్యాక్స్ నంబర్ను కోర్టుకు ఇవ్వాలని, ఆ నంబర్లో అందుబాటులో ఉండాలని షరతు విధించారు.
0 comments:
Post a Comment