వైఎస్ జగన్ చొరవతో ఏకమవుతున్న కీలక విపక్షాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ జగన్ చొరవతో ఏకమవుతున్న కీలక విపక్షాలు

వైఎస్ జగన్ చొరవతో ఏకమవుతున్న కీలక విపక్షాలు

Written By news on Tuesday, December 10, 2013 | 12/10/2013

వైఎస్ జగన్ చొరవతో ఏకమవుతున్న కీలక విపక్షాలు
సాక్షి, న్యూఢిల్లీ:ఆంధ్రప్రదేశ్‌ను అసెంబ్లీలో తీర్మానం కూడా లేకుండా విభజించాలన్న కేంద్ర మంత్రివర్గం నిర్ణయం నేపథ్యంలో.. రాష్ట్రాల విభజనకు సంబంధించి రాజ్యాంగంలోని మూడో అధికరణ (ఆర్టికల్-3)ని కాంగ్రెస్ దుర్వినియోగం చేయటాన్ని పార్లమెంటులో కలసికట్టుగా ప్రశ్నించటానికి కీలకమైన ప్రతిపక్షాలు సన్నద్ధమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ను ఏకపక్షంగా విభజించాలన్న కాంగ్రెస్ నిర్ణయం.. ఆర్టికల్-3 దుర్వినియోగమవుతున్న తీరును.. ఆ అధికరణను సవరించాల్సిన ఆవశ్యకతను.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి గత కొద్ది రోజులుగా ఆయా పార్టీలను కలసి వివరించి ఈ విషయంలో కీలక విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చిన విషయం తెలిసిందే.
 
ఈ నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ ఏకపక్ష విభజన, ఆర్టికల్-3 దుర్వినియోగం అంశాలను మంగళవారం పార్లమెంటులో వాయిదా తీర్మానాల ద్వారా లేవనెత్తాలని ఆయా పార్టీలు నిర్ణయించాయి. సమాజ్‌వాది పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, బిజూ జనతాదళ్, అసోం గణ పరిషత్, జనతాదళ్-యునెటైడ్‌లు వాయిదా తీర్మానం ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చాయి. సీపీఎం, జనతాదళ్-సెక్యులర్ పార్టీలు కూడా ఆర్టికల్-3 దుర్వినియోగంపై పార్లమెంటులో ప్రభుత్వాన్ని నిలదీయాలన్న ఆలోచనలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియలో ఎలాంటి పద్ధతులు, ప్రాతిపదికను అనుసరించటం లేదనీ, సంప్రదాయాలను తుంగలో తొక్కేసి, అసెంబ్లీ తీర్మానం చేయకుండా ఆ తీర్మానంతో పనిలేకుండా కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా విభజిస్తోందని.. అది కూడా ఎన్నికల సమయంలో కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం, ఓట్ల కోసం, సీట్ల కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందని.. ఇందుకోసం ఆర్టికల్-3ను దుర్వినియోగం చేస్తోందని జగన్‌మోహన్‌రెడ్డి ఆయా పార్టీల నేతలను కలిసిన సందర్భంగా వివరించారు.
 
ఏదైనా ఒక రాష్ట్రాన్ని విభజించాలంటే.. సంబంధిత రాష్ట్ర అసెంబ్లీలో మూడింట రెండు వంతుల మెజారిటీతో విభజన తీర్మానాన్ని ఆమోదించటం, ఆ విభజనకు పార్లమెంటు ఉభయసభల్లోనూ మూడింట రెండు వంతుల మెజారిటీ ఆమోదం తప్పనిసరి చేస్తూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్-3ను సవరించాలని, అందుకు మద్దతు అందించాలని ఆయా పార్టీల అధినేతలను కలిసిన సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డి కోరిన విషయం తెలిసిందే. లేనిపక్షంలో.. లోక్‌సభలో 272 మంది మద్దతు ఉన్న ఏ పార్టీ అయినా సరే.. తన రాజకీయ ప్రయోజనాల కోసం ఏ రాష్ట్రాన్నయినా ఇష్టానుసారం విభజించుకుంటూ పోతుందని.. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటమేనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ వాదనతో ఏకీభవించిన ఆయా పార్టీలు.. కాంగ్రెస్ వైఖరిని ఎండగడుతూ రాష్ట్రాన్ని విభజించడానికి ఆర్టికల్-3 ను దుర్వినియోగం చేస్తున్న తీరును ప్రశ్నించాలని, అందుకు అవసరమైన రీతిలో రాజ్యాంగ సవరణకు పార్లమెంటులో పట్టుబట్టాలని నిర్ణయానికి వచ్చాయి. ఈ మేరకు మంగళవారం ఉభయసభల్లోనూ వాయిదా తీర్మానం ఇచ్చి చర్చకు పట్టుపడతామని ఆయా పార్టీలు తెలిపాయి.
 
 సానుకూలంగా స్పందించిన కీలక పార్టీలు
 
 ఆంధ్రప్రదేశ్‌ను విభజించవద్దని కేంద్రాన్ని గట్టిగా కోరతామని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి తమ పార్టీ తరఫున జగన్ సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణకు మద్దతు పలికిన సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి సైతం.. ఆర్టికల్-3 దుర్వినియోగంపై పార్టీలో చర్చిస్తామని తెలిపారు. ఇదే అంశంతో పాటు సీమాంధ్ర సమస్యలపై చర్చిస్తామని బీజేపీ అధినేత రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. అసెంబ్లీలో తీర్మానం ఆమోదించకుండా రాష్ట్రాన్ని విభజించాలని చేస్తున్న ప్రయత్నాన్ని గట్టిగా అడ్డుకుంటామని మమతాబెనర్జీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే జేడీయూ నేత శరద్‌యాదవ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌లు సైతం.. జగన్‌మోహన్‌రెడ్డి వాదనకు అనుకూలంగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 9 ఏళ్ల కిందట తెలంగాణకు అనుకూలంగా పార్టీ నిర్ణయం తీసుకున్నప్పటికీ రాజ్యాంగంలోని మూడో అధికరణపై జగన్ లేవనెత్తిన అంశాలు చాలా కీలకమైనవన్న ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్.. వాటిని నిశితంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చినప్పుడు గట్టిగా నిరసిస్తామని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. యూపీ సీఎ అఖిలేశ్‌యాదవ్ పార్లమెంటులో తెలంగాణ బిల్లును గట్టిగా వ్యతిరేకిస్తామని భరోసా ఇచ్చారు. బీజేపీ మినహాయిస్తే ఈ పార్టీలకు లోక్‌సభలో వందకు పైగా స్థానాలున్నాయి. ఎస్‌పీ 22, టీఎంసీ 17, జేడీ(యూ) 19, సీపీఎం 16, శివసేన 11, బీజేడీ 14, జన తదళ్ (ఎస్), ఏజీపీలకు ఒక్కో స్థానం ఉన్నాయి. వీరితో పాటు వైఎస్సార్ సీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు సైతం పార్లమెంటులో నిరసన గళం వినిపించనున్నారు.
 
 పార్టీల మద్దతు కూడగట్టిన జగన్...
 
 పార్లమెంట్‌లో కీలకపాత్ర పోషిస్తున్న పార్టీలు.. బీజేపీ, సీపీఏం, సీపీఐ, తృణమూల్ కాంగ్రెస్, జనతాదళ్-యునెటైడ్, బిజూ జనతాదళ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శివసేన, డీఏంకే, అన్నా డీఏంకే, సమాజ్‌వాది పార్టీ, ఏఐఏడీఎంకే, డీఎంకే, జనతాదళ్-ఎస్, అస్సాం గణ పరిషత్ తదితర పార్టీల నేతలను కలిసి ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో కాంగ్రెస్, కేంద్ర ప్రభుత్వ నిరంకుశ ధోరణనిని జగన్‌మోహన్‌రెడ్డి వివరించారు. జగన్ లేవనెత్తిన కీలక అంశాలపై దాదాపు అన్ని పార్టీలు సానుకూలంగా స్పందించాయి. అవసరమైన సమయంలో కచ్చితంగా పార్లమెంట్‌లో లేవనెత్తుతామని హామీ ఇచ్చాయి.
 
 నవంబర్ 16న ఢిల్లీలో సీపీఎం, సీపీఐ ముఖ్యనేతలను జగన్ కలిశారు. నవంబర్ 17న బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. అదే నెల 20న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో సమావేశమయ్యారు. నవంబర్ 23న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన ఆవశ్యకతను జగన్ వివరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 కింద రాష్ట్రపతికి ఉండే అధికారాలను ఉపయోగించాలని.. విభజనకు సంబంధించి వివిధ అంశాలపై న్యాయసమీక్ష కోరాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నవంబర్ 23 సాయంత్రం జేడీయూ అధినేత శరద్‌యాదవ్‌ను కలిసి మద్దతు కోరారు.
 
 అదే నెల 24న భువనేశ్వర్ వెళ్లి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌ను కలుసుకొని సమస్యను వివరించారు. మరుసటి రోజు 25న ముంబై వెళ్లి ఎన్‌సీపీ అధినేత, కేంద్రమంత్రి శరద్‌పవార్, శివసేన అధినేత ఉద్ధవ్‌ఠాక్రేలతో వేర్వేరుగా భేటీ అయ్యారు. మళ్లీ డిసెంబర్ 4న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధి, ఆయన తనయుడు స్టాలిన్, కరుణానిధి కుమార్తె కనిమొళిలను కలిసి ఆంధ్రప్రదేశ్ విభజన అన్యాయాన్ని వివరించారు. 6వ తేదీన లక్నో వెళ్లి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్‌తో సమావేశమై విభజనను అడ్డుకోవాల్సిందిగా మద్దతుకోరారు. మంగళవారం ఢిల్లీలో ఎస్‌పీ అధినేత ములాయంసింగ్‌యాదవ్, జేడీఎస్ అధినేత దేవేగౌడలను కలిసి మద్దతు కోరారు.
Share this article :

0 comments: