సాక్షి, హైదరాబాద్: విజయనగరం జిల్లా సాలూరు ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నేత రాజన్నదొర ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజన్నదొరతో పాటు ఆయన అనుచరులకు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం రాజన్నదొర మాట్లాడుతూ.. తెలుగుజాతి ముక్కలు కాకుండా ఉంచేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నాలకు అండగా ఉండాలని భావించి వైఎస్సార్సీపీలో చేరుతున్నట్లు చెప్పారు.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రజలందరూ కలసి మెలసి జీవించారని, ఆయన మరణానంతరం పాలకుల వైఖరి కారణంగా ఒకరినొకరు శత్రువులుగా చూసుకోవాల్సిన దుస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ డ్రామాలాడుతున్నాయని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ సమైక్యం కోసం కృషి చేస్తోందని, జగన్ కూడా జాతీయస్థాయిలో మద్దతు కూడగడుతున్నారని చెప్పారు.
పార్టీలో చేరిన వారిలో సాలూరు మున్సిపల్ మాజీ చైర్మన్ జర్జాపు ఈశ్వరరావు, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి డోల బాబ్జి, మేడిశెట్టి అప్పలనాయుడు, కె.సత్యం, సూర్యనారాయణతో పాటు ఇద్దరు మాజీ ఎంపీపీలు, 30 మంది సర్పంచ్లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు సుజయకృష్ణ రంగారావు, కొత్తపల్లి గీత ఉన్నారు.
0 comments:
Post a Comment