పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, నిర్మాణాన్ని పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జగన్ తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం నుంచి 2011 ఫిబ్రవరి ఏడో తేదీన పాదయాత్రను ప్రారంభించారు. నాలుగు రోజుల పాటు సాగిన ఈ పాదయాత్ర పదో తేదీన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరిగే ప్రాంతంలో ముగిసింది. ఈ యాత్రకు హరిత యాత్రగా నామకరణం చేశారు.
రాష్ర్టంలో నిత్యావసరాల ధరలు మండిపోతున్నా ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదు. దీనికి తోడు కేద్రం పెట్రోలు ధర పెంచి, సామాన్యుడి నడ్డి విరిచింది. దీనిపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ‘తూర్పుతీరం’లో ఓ పక్క సాగరం మరో పక్క జనసాగరం వెంట ఉండగా 2011 జనవరి 22న విశాఖపట్నం రామకృష్ణా బీచ్లో లక్షలాది అభిమానుల సమక్షంలో ‘జనదీక్ష’ నిర్వహించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ జగన్ హైదరాబాద్ నడిబొడ్డున నిర్వహించిన ఫీజు పోరుకు విద్యార్థి లోకం యావత్తు మద్దతు పలికింది. హైదరాబాద్ నడిబొడ్డున ధర్నాచౌక్లో 2011 ఫిబ్రవరి 18న లక్షల మంది విద్యార్థుల సాక్షిగా జగన్ ‘ఫీజుపోరు’ను ప్రారంభించి వారం రోజుల పాటు నిర్విఘ్నంగా నిర్వహించారు. ఆకలిదప్పులను తట్టుకొని అభిమానుల అండదండలే ప్రాణంగా దీక్ష చేపట్టిన జననేత ఏడవ రోజు దీక్ష విరమించారు. మరణించిన ఇంజినీరింగ్ విద్యార్థిని వరలక్ష్మి తల్లిదండ్రులు గుండె జంగయ్య, లక్ష్మమ్మ జగన్కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు.
తుఫానులు, వరదలతో రైతన్న నడ్డి విరిగిపోయింది. 2010 డిసెంబరు తొలివారంలో వచ్చిన తుఫాను కారణంగా 16 జిల్లాల్లో 27 లక్షల ఎకరాల్లో పంట నాశనమైంది. 23.19 లక్షల మంది రైతులు రూ.3000 కోట్ల మేర నష్టపోయారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన గుంటూరు రైతులను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వారు చేతికి అందిన పంటను నడిరోడ్డుపై వేసి తగలబెట్టారు. తనను పట్టించుకునే నాయకుడు లేడని విలవిల్లాడుతున్న అన్నదాతకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అండగా నిలిచారు. రైతు పడుతున్న వేదనను ప్రభుత్వానికి తెలియజెప్పేందుకు గుంటూరు వేదికగా 2011, మే 15, 16 తేదీల్లో మెతుకు ముట్టకుండా నిరాహార దీక్ష నిర్వహించారు.
ఇక అధికారపార్టీ కుట్ర కారణంగా 16 నెలల పాటు కారాగార వాసం అనుభవించాల్సి వచ్చినా కూడా రాష్ట్ర ప్రజల సంక్షేమమే ఊపిరిగా జననేత ముందుకు దూకారు. రాష్ట్ర విభనకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ తన విధానం ప్రకటించడంతో బయట ఉన్న నాయకులెవ్వరూ పట్టించుకోకపోయినా.. కాంగ్రెస్ పార్టీ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ జగన్ 2013 అక్టోబర్ ఐదో తేదీ ఉదయం నుంచి చంచల్గూడ జైలులో నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. ఐదు రోజుల పాటు నిరాఘాటంగా ఆయన దీక్ష కొనసాగింది. ఆరోగ్యం క్షీణిస్తోందని, ఘనపదార్థాలు తీసుకోవాలని వైద్యులు చెప్పినా, ఆయన ససేమిరా అనడంతో పోలీసులు జగన్ ను బలవంతంగా తొమ్మిదో తేదీ రాత్రి తొలుత ఉస్మానియా ఆస్పత్రికి, తర్వాత నిమ్స్ కు తరలించి ఫ్లూయిడ్స్ ఎక్కించారు.
ప్రజల కోసం, ప్రజల మధ్య, ప్రజలతోనే ఉంటూ ప్రజానాయకుడిగా వారి గుండెల్లో పదిలమైన స్థానం సంపాదించుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సాక్షి చెబుతోంది.. హేపీ బర్త్ డే.
0 comments:
Post a Comment