సోనియా డౌన్డౌన్..
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ అనంతపురంలో వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సోనియా డౌన్ డౌన్ అంటూ విద్యార్థులు నినాదాలు చేస్తూ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన ర్యాలీ టవర్క్లాక్ వరకు సాగింది. వీరికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలపడంతో నగరం సమైక్య నినాదాలతో మార్మోగింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కన్వీనర్ శంకర్నారాయణ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనతో విద్యార్థుల భవిష్యత్ అంధకారమవుతుందని అన్నారు.
విద్యార్థుల భవిష్యత్ హైదరాబాద్పైనే ఆధారపడి ఉందన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు విద్యార్థులు ముందుండి పోరాడాలన్నారు. అనంతరం విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు జాతి కోసం పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగాన్ని సీమాంధ్ర కేంద్ర మంత్రులు, టీడీపీ, బీజేపీ విస్మరించాయన్నారు. తెలుగు ప్రజల మనోభావాలను తెలుసుకోకుండా కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు. కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఓట్లు సీట్ల కోసం ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పొట్టి శ్రీరాములు విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఐద్వా మహిళలు, ఎంఐఎం నాయకులు కూడా నగరంలో ర్యాలీలు నిర్వహించారు.
సమైక్య ద్రోహి... ఎంపీ ‘అనంత’
ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి సమైక్య ద్రోహి అని ఆరోపిస్తూ వైఎస్సార్ సీపీ నాయకులు, ఎస్కేయూ విద్యార్థులు ఆయన ఇంటిని ముట్టడించారు. ఎంపీ డౌన్ డౌన్... సమైక్య ద్రోహి అంటూ నినాదాలు చేశారు. ఈసందర్భంగా వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్రెడ్డి, ఎస్కేయూ జేఏసీ నాయకుడు ప్రొఫెసర్ సదాశివరెడ్డి మాట్లాడుతూ.. సమైక్య వాదినని చెప్పుకుంటూ ఎంపీ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. అవిశ్వాసానికి మద్దతుగా నిలబడకపోతే చరిత్ర హీనుడుగా నిలిచిపోతారన్నారు. ఎంపీ ఇంటి ఎదుట బైఠాయించడంతో టూటౌన్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. విభజన బిల్లు రాష్ట్ర ప్రజల పాలిట శాపం అని నినదిస్తూ రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వివిధ కళాశాలల విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. ఉరవకొండ, కదిరి, శెట్టూరు, రొళ్ల, రాప్తాడు, తాడిపత్రిలో ర్యాలీలు చేశారు. కాగా.. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ చేసి, అనంతరం మంత్రి జైరాం రమేష్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సమైక్యాంధ్ర కోసం తాడిపత్రి పోలీసుస్టేషన్ సర్కిల్లో ఇంజనీరింగ్ విద్యార్థులు చేపట్టిన రిలే దీక్షలు మంగళవారానికి వంద రోజులు పూర్తి చేసుకున్నాయి.
నెల్లూరు నగరంలో నెల్లూరు సిటీ సమన్వయకర్త పి.అనిల్కుమార్యాదవ్ నేతృత్వంలో విద్యార్థులు స్థానిక వీఆర్సీ సెంటర్ నుంచి గాంధీబొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. గాంధీబొమ్మ సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించి పోయింది. వైఎస్ఆర్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గాంధీబొమ్మ వద్ద రాస్తారోకో జరిగింది. ఎస్యూపీఎస్ ఆధ్వర్యంలో గాంధీబొమ్మ వద్ద రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. విద్యానగర్లో గాంధీబొమ్మ సెంటర్ వద్ద శ్రీనివాస పబ్లిక్ స్కూల్ విద్యార్థులు మానవహారం నిర్వహించారు. గూడూరు సమన్వయకర్త బాలచెన్నయ్య విద్యార్థుల ఆందోళనకు మద్దతు ప్రకటించారు.
సర్వేపల్లి సమన్వయకర్త కాకాణి గోవర్ధనరెడ్డి ఆధ్వర్యంలో మనుబోలు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. విద్యార్థులు, పార్టీ నేతలు, కార్యకర్తలు, సమైక్యవాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ సమైక్యాంధ్రకు మద్దతుగా ఒక్క వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే పోరాటం చేస్తున్నారని కొనియాడారు. ఉదయగిరిలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో యువకులు, విద్యార్థులతో ఇంజనీరింగ్ కళాశాల నుంచి బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. సూళ్లూరుపేటలో సమన్వయకర్తలు కిలివేటి సంజీవయ్య, దబ్బల రాజారెడ్డి నేతృత్వంలో విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి పట్టణ వీధుల్లో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.
కర్నూలులో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. సోనియాగాంధీ, కిరణ్కుమార్రెడ్డి, కోట్ల సూర్యప్రకాష్రెడ్డి, టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డి తదితరులతో రూపొందించిన ఫ్లెక్సీని పెట్రోల్ పోసి తగలబెట్టారు.
వైఎస్సార్సీపీ యువజన విభాగం నాయకులు పర్ల శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో కల్లూరులో బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఆలూరులో నియోజకవర్గం సమన్వయకర్త గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జూనియర్ డిగ్రీ కళాశాలలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఆదోనిలో వైఎస్సార్సీపీ బీసీ సెల్ జిల్లా కన్వీనర్ డాక్టర్ మధుసూదన్, ప్రసాదరావు, సన్నీ, ఫయాజ్, సాయిరాంల నాయకత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఆళ్లగడ్డలో వైఎస్సార్సీపీ నాయకులు చిన్నవెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి నాలుగు రోడ్ల కూడలిలో మానవహారం నిర్మించారు.
బనగానపల్లెలో నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రబోతుల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులు స్థానిక క్రీడామైదానం నుంచి పెట్రోల్ బంకు కూడలి వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు.
డోన్లో స్థానిక నాయకులు ధర్మారం సుబ్బారెడ్డి, మాజీ మండలాధ్యక్షుడు శ్రీరాములు, గుల్షన్ నాయకత్వంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ధర్మారం సుబ్బారెడ్డి కార్యాలయం నుంచి పాతబస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి సోనియాగాంధీ ఫ్లెక్సీని తగలబెట్టి దహనం చేశారు.
మంత్రాలయం మాజీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తనయుడు, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర కమిటీ సభ్యుడు ప్రదీప్రెడ్డి, మండల కన్వీనర్ భీమిరెడ్డి, సర్పంచు తెల్లబండ్ల భీమయ్యల ఆధ్వర్యంలో కర్నూలు-రాయచూరు రహదారిని దిగ్బంధించారు.
నంద్యాలలో పట్టణ కన్వీనర్ మల్లికార్జునశెట్టి, సుభాన్, వడ్డె శ్రీను, మనోజ్ల నాయకత్వంలో పద్మావతి నగర్లోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి శ్రీనివాస సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం నిరసన వ్యక్తం చేశారు.
ఎమ్మిగనూరు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కుమారుడు జగన్మోహన్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుట్టా రంగయ్య, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మాచారి నాగరాజు, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు షరీఫ్, బలరాంల నాయకత్వంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి విద్యార్థులు మద్దతు ప్రకటించారు. సోమప్ప సర్కిల్లో మానవహారంగా ఏర్పడి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
0 comments:
Post a Comment